Thursday, 14 May 2020 0 comments By: satyasrinivasg

బ్లాక్ అండ్ వైట్




ప్రకృతిని అర్ధం చేసుకోడానికి ప్రకృతిలోని జీవ వైవిధ్యాన్ని అర్ధం చేసుసుకోవాలి, దీనికి పరిశీలనతో కూడిన అనుభవం చాలా ముఖ్యం. అది ప్రకృతి రంగులని బ్లాక్ అండ్ వైట్లో చూస్తేనే అవగతమవుతుంది.  ప్రకృతికి కూడా మెమరీ వుంటుంది , యునివర్సిటీ ఆఫ్ స్టుట్ గార్డ్స్  వాళ్ళు  వ్యోమగాములకు  అంతరిక్షంలో అవసరమైన మందులు తయారు  చేయాడానికి చేసిన పరిశోధనలో  నీళ్ళు గురించిన విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యచకితులయ్యారు. మైక్రోస్కోప్ లో దానిని చూసినప్పుడు ,వాతావరణం బట్టి దాని రూపం మారుతుందట. దీన్ని బట్టి దానికి జ్ఞాపక శక్తి వుందని భావిస్తున్నారు.సాల్ చెట్లు(గుగ్గిలం) ఒంటరిగా పెరగవు, అవి వాటి సముహంతో కలిసి జీవిస్తాయి, వాట్ని ఒంటరిగా పెంచితే , ఒంటరి తనానికి లోనై చనిపోతాయి. అంతదాక ఎందుకు, ఒంటరిగా ఎదిగిన తురాయి, వేప ,కానుగ, కరివేపాకు  లాంటివి తమ చుట్టూ వాటి సముహాల్ని ఏర్పర్చుకుంటాయి.

కరోనా వల్ల మనుషుల అలికిడి  తగ్గింది, వన్య జీవులు తిరిగి నగరాలలోకి  వస్తున్నాయి అని సంతోషం,ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు, అవేవీ ఇక్కడ  వుండానికి రావడం లేదు, వుండాలన్నా  వుండలేవు. కాలుష్యం   తగ్గింది అని ఏమీ లేదు, ఇవన్నీ తాత్కాలిక మార్పులు. ఈ సమయంలోనే జరగాల్సిన చట్టాల మార్పులు, ఒప్పందాలు జరుగుతూనే వున్నాయి. ఒకసారి కరోనా పోయిన తర్వాత షరా మామూలే...  ఈ భూమి , ప్రకృతి ఎన్ని ఎపిడెమిక్స్, పాండమిక్స్ చూడలేదు...

అసలు మనం మాములుగానే ప్రకృతిని సరిగ్గా పరిశీలించం,  చుట్టూ  వున్న దాన్ని పట్టించుకోము. అసలు మనలో నిక్షిప్తమైన వాట్ని కుడా పట్టించుకోము.అన్నిటికి సమయం లేదు,లేక రాదు అనే అంటాం. ఎందుకంటే మన ఇష్టాలన్నీ డబ్బుతోనే ముడిపడిపోయాయి కాబట్టి  మన ఇష్టాల్ని కుడా మెమొరి లేన్లో వదిలేసాం! కరోనా వల్ల వాట్ని కొద్దో గొప్పో  మన జ్ఞాపకాల వూట బావిలో ఏతమేసి తోడుకుంటున్నాం.  ఇలా జ్ఞాపకాల్ని తోడుతున్నపుడు పరిశీలన ముఖ్యం.  పరిశీలనలో మనం గమనించే వాటిని మనం గమనిస్తున్నాం అన్నది తెలియకూడదు, అది తెలిస్తే అవి అప్రమత్తమయ్యి సహజంగా వుండవు ,లేక అక్కడి నుండి వెళ్లి పోతాయి. ప్రకృతి పరిశీలనలో ఇది చాల కీలకమైన అంశం. దీనినే ఆల్ఫర్డ్ స్క్రుత్స్ నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు.  దీనిని ఎలా చేయ్యాల్లో ఎమిలి డికిన్ సన్ కవిత ద్వారా తెలిపింది...
ఒక పక్షి సంచారం
ఎమిలి డికిన్ సన్
ఒక పక్షి ఇటుగా వచ్చింది
దానికి తెలియదు ,నేను చూస్తున్నట్టు-
అది ఒక పురుగుని సగంగా కొరికింది
దానిని పచ్చిగానే తినింది,
తర్వాత పచ్చిక పైనున్న
ఒక చుక్క నీటిని తాగింది
తూనీగలకు దారినిస్తూ
అటు తర్వాత గోడంచునే ఎగిరింది
అది సూక్ష్మ నేత్రాలతో చూసింది
తొందరగా తూనీగలు అంతటా  చెల్లాచెదురుగా వెళ్ళిపోయాయి
నాకు, అవి రాలిపోతున్న ముత్యాల్లా అగుపించాయి-
అపాదం  మునట్టుగా, జాగ్రత్తపడుతూ
అది తన సునిశితమైన  తలను అటిటూ తిప్పింది
నేను దానికి ఒక బ్రెడ్ ముక్కనిచ్చాను
అది తన రెక్కలను విదిల్చి
సముద్రాన్ని ఛేదించే ఖడ్గంలా కాక
రంగులల్లిక మెరుపుతో
మిట్టమధ్యానం ఒడ్డుచేరే  సీతాకోకచిలుక  అలలా
సుతి మెత్తంగా,సవ్వడిలేని ఈతలా  తన  గూటికి ఎగిరింది
(అనుసృజన-జి. సత్యశ్రీనివాస్)

ఎమిలి డికిన్ సన్(1830-1886,అమెరికన్ కవయిత్రి), తన శైలిలో నాల్గు పంక్తులు /అయుదు పంక్తులతో కూడిన స్టాన్
 జాలలో కవితలు రాస్తుంది. కవితలో  ఒక పాజ్ తో కూడిన వాక్యాల్ని అమర్చుతుంది .ఇది  చదవడానికి అనువుగా వుంటుది. తన కవితల్లో కవయిత్రి  ప్రకటితమవుతుంది.

ఒక పక్షి సంచారం కవితలో ,ఒక పక్షి తనకు దగ్గరగా సంచరిస్తున్నప్పుడు దాని నడవడిక తీరుని ప్రస్తావిస్తుంది, ఇక్కడ పక్షి ప్రకృతి ప్రతిరూపం కూడా. పక్షిని పరిశీలిస్తున్నట్లు దానికి తెలియదు. పక్షి పురుగుని తిన్నాక , మనుషులులానే గ్లాస్లోని నీళ్ళు తాగినట్టే అది కూడా గడ్డి పరక మీదున్న నీటిచుక్కను తాగుతుంది. ఇక తూనీగల ప్రస్తావనలోని ప్రతీకల్లో  (రాలిపోతున్న ముత్యాల్లా) సామాజిక మెటాఫర్ల ప్రస్తావన  కనిపిస్తుంది.అపాయం అన్న విషయాన్ని   చిన్నగానే చెబుతూ , అప్పుడు పక్షి అప్రమత్తమై తీసుకున్న జాగ్రత్తల్ని వివరిస్తుంది.కవిత  ముగింపులో పక్షి తిరుగు ప్రయాణంలో వ్యక్త పర్చిన మెటాఫర్స్ ఒక దర్జీ పిట్ట గూడు అల్లే దృశ్యంలా వుంది. అవును  ప్రమాదం అన్నదాన్ని పక్షులు, జంతువులూ చాలా సునిశితంగా పసిగడతాయి, అంతే జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి. ఈ చర్యలో మిట్టమధ్యానం ఒడ్డుచేరే  సీతాకోకచిలుక  అలలా, సుతి మెత్తంగా,సవ్వడిలేని ఈతలా  ,తమ సమూహాన్ని తన ,పర అన్న తారతమ్యం  లేకుండా   అప్రమత్తం చేస్తాయి. మనుషులు అలికిడివున్న  చోట పక్షులు,ఇతర ప్రాణులు అప్రమత్తంగానే సంచరిస్తాయి.అలికిడి అన్నది మన ఆలోచనలోని అంతర్లీన భాగం,ఒక స్పర్శ.

ఇప్పుడేదో కరోనా వల్ల అవి తిరిగి వస్తున్నాయి అన్నది నగర వాసులకి ఆశ్చర్యం కాని ,నగర శివారుల్లో, ఊర్లల్లో, పంట పొలాల దగ్గర, పోడు చేనులోని చేనుమకాంల దగ్గర ఇది  షరా మామూలే. మనుషులు , పక్షులు, జంతువులు ఒకరి అలికిడి ఒకరు పసిగడుతూ జీవించాలి.  పక్షులు ,జంతువులు వాటికి హాని కలగదు అన్న భరోసా ఏర్పడినప్పుడు అవి వస్తూ పోతూ వుంటాయి.  ఇప్పుడు జంతువులు అవి కోల్పోయిన జీవావరణలోకి  తిరిగి వస్తున్నాయి, మనుషుల, వాహనాల అలికిడి తగ్గినందుకు.

నిర్మానుష్యమైన వీధులు, అందరూ ఇళ్ళలోనే వున్నారు, ఆ నగరం పోలిమేరనానుకుని అడవి వుంది. జపాన్ లోని నార నగరంలో నిర్మానుష్యమైన వీధుల్లో సిల్కా జింక వీధుల్లో, స్టేషన్లలలో స్వేఛ్చగా తిరుగుతోంది.పనామా లోని సాన్  ఫిలేపి సముద్రపు ఒడ్డున రాకూన్స్ చేరుతున్నాయి.చికాగో లోని లింకన్ జ్యూ పార్క్,అర్బన్ వైల్డ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సెత్ మాగ్లె మాట్లల్లో మేము ఉపయోగించని ప్రదేశాల్లో జంతువులు తిరుగుతూ వుంటాయి, ‘వాటి సంచారం,ఉనికి మాకు తెలియదు, ఒక రకంగా అవి కనిపించని దెయ్యాలు’. ఇట్లాంటి సంఘటనలు కరోనా వచ్చినప్పుడే కాదు, మామూలు రోజుల్లోనూ  హైద్రాబాద్ , వైజాగ్, తిరుపతి, శివార్లల్లో జరిగాయి. ఇక వూర్లల్లో చెప్పనక్కర లేదు. మాగ్లె  ఈ సందర్బంగా అన్న మాటలు  ‘జ్యూరాసిక్ పార్క్ లో అన్నట్టు, జీవితం తన మార్గాన్ని అన్వేషిస్తుంది,” . ప్రస్తుతం నగర ప్రవేశం చేసిన జింకల పై వాళ్ళు ఇంటిపట్టు నుండే , సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, వన్య ప్రాణుల పై  ప్రతి సంవత్సరం చేసే కొద్ది పాటి పరికరాలతో చేసే అధ్యయనాన్ని ,ఇప్పుడు  కరోనా వల్ల వాటి నడవడికలో వచ్చే మార్పులపై అధ్యనం  చేస్తారట.

జంతువులు ,పక్షులు తిరిగి అవి కోల్పోయిన ఆవాసాలకు వస్తున్నాయి. మరి మనం కరోనా ప్రభావం వల్ల  ఇంటికి కూడా పోలేక పోతున్నాం,ఆహారం నిల్వ వుండే రోజులు కూడా దగ్గర పడుతున్నాయి, జేబులకు  కూడా కన్నాలు పడుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న, చెందిన  దేశాల్లో లాక్ అవుట్ దృశ్యాలు వేరు, వేరు. అభివృద్ధి చెందిన దేశాల్లో, పేరు చెప్పడం అవసరం లేదన్కుంటా. ఒక మహా నగరంలో నిత్యావసరాల మాల్ దగ్గర జనాలు గుమికూడి వున్నారు, నిత్యావసరాలకంటే ముఖ్య మైన దాని కోసం, ఎగబడి .గంటల కొద్దీ నుంచున్నారు, వాళ్ళ తరుణం వచ్చే సరికి కట్టల కొద్దీ కావాలన్నారు, కౌంటర్ దగ్గర వున్న వాళ్ళు అన్నీ ఇవ్వం ,అందరికీ ఇచ్చే కోటా  ప్రకారమే తీస్కోవాలి, కట్ చేస్తే... దిగాలుగా  గత్యంతరం లేక తనకు వచ్చిన కోటా టిష్యు పేపర్ రోల్స్ తీసుకుని  వెళ్ళాడు.

ఇదంతా ఒక జోక్ సోషల్ మీడియా లో చూసి నవ్వుకోవచ్చు,1943 క్షామం అప్పుడు ఇట్లాంటివి జరిగాయి, డిమానిటైజేషన్ కాలంలో ఇట్లాంటి  సంఘటనలని చూశాం, సినిమా అప్పుడే అయిపోలేదు, కరోనా తగ్గినా  తర్వాత సినిమా ఇంకా వుంది. వాణిజ్య  వైరస్ అంటుకుంటుంది... ఒకటి మాత్రం నిజం ప్రకృతి,సామాజిక నడవడికలు గతంలో లాగానే పునరావృతం కావు. అవి కొండ గుహలలో మన పూర్వీకులు మనకు వీడ్కోలు చెప్పిన అచ్చైపోయిన హస్తాల  ఆనవాళ్ళు మాత్రమే, వాళ్ళు మనని రమ్మని పిలిచే సంకేతం కాదు. !. కారణం మనం, మనిషి-వస్తువు, మనిషి-ప్రకృతి, వ్యక్తి- సమూహం, సమూహం-కులం ,జాతి -మతం  అన్నిట్నీ విడదీసి చూసి కలుపుకుపోతాం. మనకంట్లోని కనుపాప తడి వెలుతురులేని చుక్క మాత్రమే, చూపున్న పక్షి నేత్రం కాదు.


Saturday, 2 May 2020 0 comments By: satyasrinivasg

ప్రకృతి, సంస్కృతి, జీవన స్మృతులు


దైనందిన జీవితంలో అనారోగ్యంగా వున్నపుడు వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్ళం, కొందరికి దానిని స్వతహాగా తట్టుకుని కోలుకునే శక్తి వుంటుంది, కొందరికి వుండదు. ఒక్కోసారి  అనారోగ్యం అన్నదానిని అసహజమైనదిగా చూస్తాం తప్ప సహజంగా వచ్చేది గా అనుకోము. ఉదా: జలుబు దగ్గు, లాంటివి పక్కన పెడితే, డిప్రెషన్ ,ఒంటరితనం లాంటి మానసిక రుగ్మతులని భూతద్దాలతో చూస్తాం ,అందుకే అవి చెప్పుకోరు, మరి ఎపిడెమిక్స్ ప్రబలినప్పుడు బాధితులు ఎలా ఎవరికి చెప్పుకోవాలి?
 ఏదైనా గతం, వర్తమానం , భవిష్యత్తు అన్న కాల చక్ర వలయంలోనే తచ్చాడుతాయి, పర్యావరణ ,జీవావరణ కవిత్వం కూడా అంతే! ఇది ఒక పర్యావరణ ,జీవావరణ సామాజికావరణ కాల చక్ర  కవిత్వ రాట్నం. ఇందులో అందరం బందీలమే. 
మనం ఈ వలయంలోని అనుభూతుల్ని, అనుభవాల్ని మాట ,మంతి  ద్వారా  వ్యక్త పర్చుకుంటాం. ఒక పీడన అందులోను ఎపిడెమిక్ 2020 కాలం అద్దాల నుండి 915 అంటే 10  శతాబ్దం కాలం కవిత్వాన్ని చూద్దాం ...
ఒక పీడిత వ్యక్తి అదీ కవి అయినప్పుడు వ్యక్త పర్చుకునే  తీరు...

రాత్రి సందర్శకురాలు
అల్- ముతన్నాబి
మధువు మత్తులో లేకున్నా , అశ్వస్థ శరీరం, లేవలేని స్ధితిలో ...
నమ్రతతో ఇమిడిన  ఆమె సందర్శనంలా,
చీకటి అంచులలో దాగి  ఆమె సందర్శించదు
నేను ఆమెకు ఇష్టపూర్వకంగా  వస్త్రాలు ,దిండ్లు ఇచ్చాను
కాని వాట్ని తిరస్కరించి నా ఎముకలలో రాత్రిని గడిపింది
 నా చర్మానికి, నా శ్వాసని ,ఆమెని ,రెండిట్నిఇముడ్చుకునే  శక్తి  లేదు,
 అందుకే ఆమె అన్ని రకాల  రోగాలతో  కలిసి విశ్రమిస్తుంది
ఏదో మేమిద్దరం చేయకూడని పనిని ముగించినట్టు
ఆమె నన్ను వదిలి  వెళ్ళినప్పుడు, తన శ్వాసతో నన్ను కడిగి వెళుతుంది
ఉదయం, ఆమెని తరిమేస్తుంది,
ఆమె కన్నీరు, నాల్గు రంద్రాలలో  ద్రవంలా వరదై పారుతుంది
వాంఛ లేకుండా, నేను ఆమె సమయం కోసం ఎదురుచూస్తాను
ఒక ప్రియుడి ఎదురు చూపులా
ఆమె ఎప్పటిలానే క్రమం తప్పకుండా   సమయానికి వస్తుంది, కాని నమ్మకం ఒక దుష్ట శక్తి
అది సోకినప్పుడు తీవ్రమైన బాధలకు గురిచేస్తుంది
(అనుసృజన-జి.సత్య శ్రీనివాస్)
ఇక్కడ కవి వ్యాధిని రాత్రి వేళ వచ్చే ప్రేయసి గా ప్రస్తావిస్తున్నాడు,అంతేకాక చావు అనివార్యం అని తెలిసి నిబ్బరంగా వుండడానికి ఆ విధంగా మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు. అల్- ముతన్నాబి పేరుకి అర్ధం ‘అతను ప్రవక్త కావచ్చు’. ఇతని కవిత్వ భాష అప్పట్లో విశిష్టమైనది, వ్యాధిని రాత్రి  సందర్శకురాలిగా  ఏ వైద్య బాషా పేర్కొనలేదు. తన మిత్రుడైన అలెప్పో రాజు సైఫ్ ఎల్ దవలతో వాగ్వివాదం జరిగిన తర్వాత అతనిని వీడి వెళ్లి పోతాడు.965లో ఆహ్వాస్ (నేటి ఇరాన్) నుండి పయనిస్తున్నపుడు బందిపోట్లు అతనిని హతమారుస్తారు . అతని చావు వార్త దావానంలా పాకింది.
 ఈ కవి ప్రవక్త  ద్వారా నాగరికతకు వ్యాధికి వుండే వారధుల్ని పరిశీలిద్దాం...
నాగరి ‘కత’
వ్యవసాయం వల్ల అవాసాల్ని స్ధిరంగా చేసుకుంటూ నగరీకరణకూ వూతమిచ్చింది, ఈ క్రమంలో పారిశ్రామీకరణ వల్ల రాజు ,పేద వర్గాల్ని విస్తృతంగా ప్రబలించేటట్టు చేసింది. స్పష్టంగా వున్న వాళ్ళది, లేని వాళ్ళది అన్న ప్రాంతాల్ని బలపరచింది. గతంలో ఊరు ,వాడకి కుల ,మతంతో బాటు డబ్బుని కూడా అతికించింది.
నేడు మనం ఏ  స్ధాయికి ఎదిగామంటే మన శరీరంలోని అవయవాలు కూడా వాడల్లా ఏర్పడినాయి. కారణం వాటికంటూ వుండే జీవితకాలం వల్ల అవి నేడు ఒక వనరుల సంపత్తిగా మారాయి. ఇప్పుడు వనరు అన్నది కేవలం మనకు బాహ్యంగా వున్న ప్రకృతి వనరే కాదు, మనలోని అవయవాలు కూడా దోపిడికి గురవుతున్న వనరులే!. పేదరికం వల్ల మనుషులే కాదు వలసపోతున్నది, వారి అవయవాలు. శరీరం ,అస్దిత్వం  కూడా. అభివృద్ధికి నమూనా నగరమే అయితే ఇదే అవుతుంది.
నేడు నగరరీకరణంలో మనం కోల్పోయింది మౌకిక భాష, అంటే శబ్దం ,మాటల ద్వారా సంభాషించుకోవడం. మనకు సమాచారం, జ్ఞానాన్ని అందించే  మాధ్యమం, మన విధ్యాబ్యాసంలో కేవలం కొన్ని విద్యలే ఉపాధి, డబ్బు ,పరపతిని సమకూరుస్తాయని వాటినే శిరోధారoగా పరిగణించి .  జీవించడానికి కావాల్సిన విలువల్ని, మనో: ధైర్యాన్ని సమకూర్చలేని చదువుల్ని  నూరిపోశాo.   దీని వల్ల శరీరం అన్నది కేవలం ఒక అవయవాల యంత్రం తప్ప మరేమీ కాదు! ఈ యంత్రానికి వినడం తప్ప .విన్నదాంట్లో వాస్తవ అవాస్తవాల్ని అంచనావేసే తీరిక, ఆలోచన లేకుండా పోయింది. అంతే కాదు ప్రకృతి, మనిషి అన్నది ఒక సబ్జెక్ట్ గా  మారింది, అంటే ఉపయోగానికి అవసరమై పరిశీలించే వస్తువు.అందుకే పర్యావరణ , ప్రకృతి సంరక్షణ అన్నవి కేవలం నినాదాలుగానే మిగులుతాయి, కారణం భాధితుడి, సంరక్షణ చేసే వారి మాటలు ఆచరణలోకి రావు. ఇందుకు కారణం  నేటి అధునాతన ప్రసార మాధ్యామాలు  మనకి ఆలోచించే సమయం ఇవ్వవు, ఒక క్షణంలోనే  కోకోల్లల కొద్దీ  టెక్స్ట్ మెసేజ్లు, వాట్ని మనం  విపులంగా చదివే కాలం లేదు, అందుకే గుడ్డిగా ఫార్వర్డ్ చేసేస్తాం.అంతే కాక ఎదుటి వారు ఏమి అర్ధంచేసుకున్నారో అన్నదాన్ని మనం అర్ధం చేసుకోకుండా మన పరిభాషలోకి మార్చేస్తాం.
ఆధునికత ఘడియ ,ఘడియకు మారే  మార్కెట్   క్యాప్షన్. మనం ఎక్కువగా కాలచక్ర వలయంలో   బందీలై పోవడం వల్ల  మనకంటూ వుండే కాలాన్ని అర్ధం చేస్కోక దాన్ని సద్వినియోగం చేస్కోo ! నేడు మార్కెట్ అధినేతల కంటే  గొప్ప స్టోరీ టేల్లర్స్ లేరు. వాళ్ళు చెప్పే వాళ్ళు ,మనం వినే వాళ్ళం. నేడు మనకు ఎదురవుతున్న విపత్తులు, ఇతరత్రా విషయాల్ని ,మనం కేవలం తాత్కాలికంగా, కొంత సమయమే వాటి గురించి అలోచిస్తాం, అవి ఎంత తీవ్రమైనప్పటికీ!.
సామాజిక స్దితిగతుల్లోని  మార్పుల కధనాలన్నీ , శక్తినిచ్చే వనరుల వినియోగంలో జరిగిన మార్పుల కధనాలేనా! లేక జీవక్రియ చర్యల వివరణా అన్నది అర్ధం చేసుకోకుండా అవసరాలకి మించిన కోరికల వెంట పడ్డాం. దీన్నిఅభివృద్ధి మార్పుగా పరిగణిoచాం.
ప్రకృతిలో పునరావృతం కాని శక్తిని ఇచ్చే  వనరుల్ని హరించేస్తున్నాం,  పునరావృతం అయ్యి శక్తి నిచ్చే వనరుల్ని సరిగా వినియోగించు కోవడం లేదు. మరి శక్తిని పొంది జీవించే వైరస్  తనకు కావాల్సిన శక్తిని పొందే ఆవరణని పసిగట్టి ,అందులోకి ప్రవేశించడం జరుగుతుంది, ఇది గతంలోనూ జరిగింది ,నేడు కని విని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఆ తీరులో అది మన అవయవాల్నే కాదు , మన ఆలోచనల నుండి కార్యాచరణ దాల్చిన వ్యవస్ధల్ని కబళించింది. వ్యవస్ధల్ని ప్రోద్భలించిన సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తోంది. ప్రకృతిని కబళించడంలో క్యాపిటల్, సోషలిస్ట్ సిద్ధాంతాలు ఏవీ వెనుకంజ వేయలేదు.  రెండూ భూమిని కేవలం శక్తినిచ్చే ముడిసరుకుగా జమకట్టాయి తప్ప జీవక్రియను పట్టించుకోలేదు.

ప్రతి ఘడియ ఒక సంఘర్షణ
విపత్తుల వల్ల ఏర్పడే సామాజిక రుగ్మతుల్ని గ్రహిస్తే గతం,వర్తమానంలో వుండే సమకాలీన పోకడలని అంచనా వేయచ్చు. రుక్మిణి భాయి నాయర్ రాసిన ప్లేగ్ ,కోవిడ్-19 పోలికలు,  వ్యాసంలో ప్రస్తావించిన అంశం 1347 లో ఇటలీ లోని మేసిన తీర ప్రాంతంలో 12  ఓడలు వచ్చాయి. అందులోని నావికులందరూ అశ్వస్థులై వున్నారు, అదే బ్లాక్ డెత్ (నల్లటి  మృతువు). ఇది  బుబోనిక్ ప్లేగ్ ,దీని వల్ల దశాబ్ద  కాలంలో మూడొంతుల యురోపియన్ జనాభా ,అంటే   20 మిలియన్ల మంది చనిపోయారు. నేచర్ అనే పత్రిక లో అచ్చయిన వ్యాసం  ప్రకారం ఈ వైరస్ ‘ఎర్సినియా పెస్టిస్’ చైనా లేక అక్కడి పరిసర ప్రాంతంలో పుట్టి సిల్క్ రూట్ ద్వారా , ఇతర  భూ వాణిజ్య మార్గాల ద్వారా పరివాప్తి చెందింది. సముద్ర వాణిజ్య ,వర్తక మార్గం ద్వారా ఇటలీకి చేరింది. ఈ వైరస్ ఎలుక, పాము, గబ్బిలం ద్వారా సోకి వుండచ్చు. ఈ ప్లేగ్ వల్ల ఏర్పడిన తీవ్ర పరిణామాలు ఆర్ధిక సంక్షోభానికి  దారితీశాయి. ఆహార కొరత, బతకడం కోసం పేదలు దోపిడిలకూ పాలుపడడం. ఈ పరిస్ధితుల నుండి బయటకు రాడానికి సుమారు శతాబ్ద కాలం పట్టింది. నేటికి ఈ
ప్లేగ్  సార్వజనికంగా ప్రచారంలో వున్న పిల్లల రైం
‘రింగా,రింగా రోజెస్,
పాకెట్ ఫుల్ ఆఫ్ పోయిజేస్ ,
హాషా, బుషా,
 అల్ ఫెల్ డౌన్’  
ఈ రైం 1881 లో అచ్చయింది, అంత కంటే మునుపే 1790 లో పాడిన తీరు ఒకేలా వున్నాయి. వివిధ ప్రాంతాలలో వారికనుగుణంగా మార్చుకున్నారు. బహుశా  ఇక్కడ రొజేస్ అంటే గులాబి పూలు కాదేమో, రోగం వల్ల శరీర భాగంలో ఏర్పడిన గడ్డలు. అలానే పాయిజేస్ అంటే రోగం వల్ల వచ్చే దుర్వాసనని అరికట్టే ఔషద మొక్కలు.
లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్
ఫాలింగ్ డౌన్
ఈ రైం  కూడా 1200-1500 A.D. (మధ్య యుగం) చివరిలో రాసినట్టు చరిత్ర తెలుపుతోంది, ఈ రైం లండన్ బ్రిడ్జ్ వల్ల ఏర్పడిన దుష్పలితాల్ని పిలల్లు ఆహ్లాదంగా ఆడుకునే టట్టు మార్చారు. ఇది తెలిసి పిల్లలు ఆడి పాడుతూ, ఆడుకోడాన్ని ఒకసారి ఉహించుకుంటే!
సాహిత్యం ద్వారా చరిత్రను పరిశీలిస్తే చాలా వాటి అర్దాల వెనకున్న పరమార్దాలు తేటతెల్లమవుతాయి.మనం చరిత్ర సాహిత్యం ,అందులోనూ కవిత్వం ద్వారా పరిశోదిద్దాo అంటే  సాహిత్య మాధ్యమంలో వాటి ప్రస్తావన చాల తక్కువ, ఇది  ప్రకృతి, పర్యావరణానికీ వర్తిస్తుంది. 
డి బ్లాక్ డెత్  గురించి బొచ్చాసియో రాసిన డికామేకరోన్లో ప్రతి రోజూ ధనవంతుల జీవితాల్లోని సంఘటనల్ని  ప్రస్తావిస్తుంది. ఇప్పటి లానే అప్పట్లో కూడా ధనవంతులు ఈ వైరస్ ఎక్కడ  సోకుతుందో అన్న భయంతో, అమానుష ధోరణి ప్రదర్శించారు. వాళ్ళ ఇంట్లోనే వుండిపోయారు.   వాళ్ళ కధనాలు  నేటికీ కనబడుతాయి. ఫ్లోరెన్స్ అనే నగరంలో  సుమారు ఒక లక్ష మంది చనిపోయారు, ఆ సంఘటన ద్వారా కానీతెలియలేదు ఆ నగరంలో అంత మంది నివసిస్తున్నారని.
మాములుగా వున్నప్పుడు తెలియనివి , పట్టించుకోనివి , అనుకోని పరిస్ధితులు ఏర్పడినప్పుడు బహిర్గతం అవుతాయి.  అదే అంత్రోపో సీన్ .జర్మన్ ఫిలాసఫర్ స్లోటేర్దిజ్క్స్ అన్నట్టు  ‘ఇప్పుడున్న స్ధాయి, మానవుల వూహకు అందని  స్ధాయి, అన్ని విధాల  మానవేతర, అతీతమైన ఆవరణలో  చిక్కుకుపోయిన  స్ధితి.  స్ధలం అన్నది కేవలం మానవాళి ప్రదేశం కాదు’.
డార్క్ ఎకాలజి అనుసారం మన ఆలోచనలు అన్నవి మన మెదడు చేసే ప్రక్రియ, లేక  ఇంకేదైనా, eliminative materialism(1980 లో మొదలైన దృక్పదం) అనుసారం: మనసుని మెదడు దృష్ట్యా వ్యక్తీకరిస్తే , మనకు మనస్సు అన్నది లేదు , అది ఒక మిధ్య. మనమిప్పుడు వివిధ విషయాల్ని  వున్నత  స్ధాయిలో ఆలోచించే తీరులో అడుగిడుతున్నాం. జీవావరణ యుగంలో వ్యక్తి, వస్తువు,జీవరాశి అన్నీ మానవుడి ఆలోచనలకు అవసరం,జీవనాన్ని కొనసాగించడానికి ఇవి కీలకం. మనం భూమి తీవ్రత స్ధాయిని అర్ధం చేసుకోవడాన్ని మొదలెడుతున్నాం. 
ఆర్ధిక శాస్త్రవేత్తలు, జీవశాస్త్ర వేత్తలు నేడు ఉపయోగించే పదం ‘ఎకో సిస్టం సర్వీసెస్’ ,అంటే ప్రకృతి మానవుల జీవనానికి అందించే సహాయ సహకారాలు.మనం దీనిని అర్ధం చేసుకోకుండా, ప్రకృతిని సంరక్షించకపోతే,అది నాశనమై ,మనకి తెలియని రీతిలో సాధిస్తుంది.మచ్చుకగా కనిపించేవి,  మనని తీవ్ర స్ధాయిలో గురి చేసిన రోగాలు ఎయిడ్స్, ఇబోల,వెస్ట్ నైల్ ,సార్స్,లిం  లాంటి అనేక వ్యాధులు. ఈ వ్యాధులు పర్యావరణానికి సంబంధించినవి,60% ఈ వ్యాధులు మనిషికి జంతువు నుండి సంక్రమించినవి, ముఖ్యంగా వన్య జీవుల నుండి వచ్చినవి.వైరస్ సోకే విధం గురించి  అధ్యయనాలు జరుగుతున్నాయి. జరుగుతూనే వుంటాయి. మనం ఎప్పటికప్పుడు అనుకునేదల్లా మనం జయిస్తాం! అవును మనం జయిస్తాం, వివిధ రకాల యుద్దాల్ని   సృష్టించడం, యుద్ధం చేస్తూ వుండడం మనకు పరిపాటి ,ఎందుకంటే డార్విన్ సూత్రాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ధ ఫిట్టెస్ట్’ ని దేవుని  పలుకుగా ఆచరిస్తాం, కాని దాని అర్ధం బలప్రయోగం (తెలివి, శారీరక బలం) వల్ల ఇతర వాట్ని నాశనం చేయడం కాదు, ఎటువంటి పరిస్థితిలోనైనా తట్టుకుని బతికి, బతికించడం అని. బికాజ్ వి ఆర్ బయో సోషల్ యానిమల్స్! ఇది నగ్న సత్యం.