Tuesday 21 July 2015 By: satyasrinivasg

నగరీకరణ ప్రకృతి-పరాధీన ప్రకృతి

ఫ్రిడ్రిచ్ రాత్జేల్ సైంటిఫిక్ డిటర్మినిజం సృష్టికర్త క్లాసికల్ జియోగ్రాఫికల్ డిటర్మినిజంని సోషల్ డార్వినిజం తో ముడిపెట్టి జీవ వ్యవస్ధ సిద్ధాంతాన్ని పేర్కొన్నాడు.దాని ప్రకారం జీవి లేక ప్రాణి తన జీవనాన్ని భూమితో అనుసంధాన పర్చుకుంటుంది,అది రోజు రోజుకి భౌగోళిక  విస్తృతిని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది.  రాత్జేల్ ప్రకారం ఒకే రక మైన  ప్రదేశాలు ఒకే రకమైన జీవన తీరుని ఏర్పరుస్తాయి.అభివృద్ధిలో భాగంగా మానవాళి భౌగోళిక విస్తృతిని పెంచుకుంది, పెంచుకుంటూ  పోతుంది. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలన్నీఒకే రూపురేఖలు సంతరించుకుంటూ పోతాయి. గతంలో వాటి భౌగోళిక, పర్యావరణానికి అనుకూలంగా ఏర్పడిన వ్యవస్ధల స్ధానం లో ఒకే రకమైన నివాస,వాణిజ్య,పరిశ్రమల సముదాయాలు ఏర్పడుతాయి. ఈ ప్రక్రియ అంతా ఒక మొనాటనీ గా ప్రబలుతుంది. అప్పుడు వైవిధ్యం అంటే కేవలం ఎక్కువ ,తక్కువ శక్తిని వియోగించడంలోనే వ్యత్యాసాలు వుంటాయి. ముఖ్యంగా డబ్బు, ఇతర ఇంధనం.శక్తిని తీవ్ర స్ధాయిలో వినియోగిస్తాం. ఈ వినియోగం వాతావరణం లోని ఉష్నోగ్రతల్నే కాదు, సామాజిక ఉష్నోగ్రతల్ని పెంచుతుంది. ఈ సంస్కృతి నుండి పుట్టుకొచ్చింది పరాధీనత్వం(alienation).

నగరీకరణతో బాటు పర్యావరణ కవిత్వంలో ఉద్యమ, విధ్వంసం, కవిత్వానికి కంటే  ముందుగానే వచ్చిన కవిత్వం ప్రకృతి పరాధీన కవిత్వం. ప్రకృతి కవిత్వం లో ప్రకృతి ఆరాధనా,మమైకత, చోటుచేసుకుంటే ,పరాధీన కవిత్వంలో మన నుండి ,ప్రకృతి నుండి అన్యాక్రాంతులమై దాన్ని కవిత్వం ద్వారా వ్యక్త పర్చుకుంటాం. మనమున్న ప్రాంతం మన జీవనశైలిని,నడవడికని తెలియచేస్తుందిఅని రాత్జేల్ అంటాడు.అవును నగరం అన్నది అసహజ ప్రకృతి, అందులోని సంబంధాలు కూడా అసహజంగా గానే వుంటాయి. ఎదుగుతున్న కొద్ది మనలోని అవయం కుడా ఫాబ్రికేటేడ్ అయినప్పుడు గుండె చప్పుడు ధ్వని మారుతుంది. మనస్సులోని ఊహలు కుడా. ఈ వూహల  
వాతావరణాన్నివర్ణిస్తూ ఉర్దూ ఘజళ్ళు కోకొల్లలు గా వచ్చాయి. అందులో షహరియార్ సీనే మే జలన్... జనం 

మనసుల్లోకి తడి ఆర కుండా  కొనసాగుతుంది.
మనసులో వేదన,కళ్ళల్లో తుఫానులా ఎందుకుంది
ఈ  నగరంలో ప్రతి ఒక్కరు చెల్లాచెదురుగా  ఎందుకున్నారు
గుండె వుంటే కొట్టుకునేందుకు ఒక కారణాన్ని వెతుకుతుంది
రాయిలా  కదలకుండా నిర్జీవంగా ఎందుకుంది
ఒంటరితనపు  గమ్యం ఇదేమిటి  చెప్పండి జనులారా
దారిలేనిదృష్టి  సందేశం  లేకుండా  ఎందుకుంది
ఏంటి నాలో కొత్త విషయం  ఏమైనా కనపడుతోందా
అద్దం నను చూసి విస్తుపోయింది  ఎందుకు
(మూలం-షహరియార్, అనుసృజన- జి.సత్యశ్రినివాస్)

నగరం ,అద్దం రెండు ఒకటే వర్చువల్ ప్రతికల్ని చూపిప్తాయి. ఇక్కడి రూపకం (మెటాఫర్) సీతాకోక చిలుకలు అవ్వడం కాదు,అద్దాల మేడల్లో మన వర్చువల్ ప్రతిబింబాల్ని చూసుకోవడమే.అరబ్ భౌగోళిక శాస్త్ర వేత్తలు ప్రపంచాన్ని  ఏడు భౌగోళిక ప్రాంతాలుగా విభజింఛి  భౌతిక ,సంస్కృతిక లక్షణాల్నివివరించారు. దానితోబాటు స్ధానిక పర్యావరణాన్ని,మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ని మనుషుల చర్యలతో పోల్చారు. సంవృద్దిగా నీరు వున్న చోట  మనషులు ఒక లాగా, నీరు లేని చోట ఒక లాగా ,విస్తారమైన ప్రదేశాల్లో వుండే సంచారులు శక్తి ,ధృడ నిశ్చయం,వివేకంతో బాటు శారీరక ధృడత్వం కల్గి ఉంటారని పేర్కొన్నారు.
నగరం అన్నది ఇతర ప్రాంత పర్యావరణాన్ని అక్కడి వనరుల్ని వినియోగించుకుంటూ ,ఉత్పాదకని సృష్టించే ప్రదేశం. ఇది ఇతర స్ధానిక పర్యావరణాన్ని కృత్రిమంగా మార్చి వినియోగించే  సమాజంగా  ఏర్పడుతుంది. అటువంటి ప్రదేశంలోనుండి మనలో ఉత్పాదన అయ్యేది పరాధీనతే. మన చుట్టూ వున్న   బాహ్య ప్రదేశం మనలాగే విస్తారమవుతున్న రహదారి. ఆ రాహదార్లు ఎలావుంటాయంటే --

ముసుగు

నడిరాత్రిలో
తడిసిన రోడ్డు
పగటి ముసుగుని
తొలిగిస్తుంది
సప్తవర్ణాల్ని
ఏక వర్ణంలో
చూపిస్తుంది
పెరుగుతున్న
ఏకాంత కొలతల్లో
వెడల్పవుతున్న రోడ్లు
రాత్రి పలుకుతుంది
అమ్మమ్మ చెప్పిన కధలు
ప్రేయసితో చేసిన వాగ్దానాలను
నెమరేస్తుంది
రాత్రి మనం
అలసిపోయి నిద్రపోం
ముసుగులు తొలగించి
దాక్కుంటాం
నిజం పలకడానికి
నిర్జీవులమవుతాం
పగలు
అబద్ధాలు చెప్పడానికి
రాత్రి
శ్వాసలు జోడిచుకుంటాం
అందుకే రాత్రి- చీకటి
వీధులు-నిర్మానుష్యం
-జి.సత్య శ్రీనివాస్
(మే,28,95,ట్యాంక్ బండ్,న్యూ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్,) 

రాత్రి నగరంలో తిరుగుతునప్పుడు మన వెన్నంటే వచ్చే మన నియోన్ కాంతి నీడ ఎ దిల్ ఎ క్యా కరూన్ అని మజాజ్ గజల్...
నగరం రాత్రి నేను
ఏమి తోచక  గమ్యంలేక  తిరుగుతాను
తళుకు మెరుపులతో మేల్కున్న
వీధుల్లో అవారాగా తిరుగుతాను
ఓ వేదనతో వున్న మనసా నే నేమి చేయను...

అంటూ కోల్పోయిందాన్ని వెతుక్కుంటూ తిరిగే ప్రదేశం ఇది. దీనినే స్మార్ట్ సిటి గా మల్చుకుంటాం కాని ఆ స్మార్ట్ సిటి లో ఏమి ఇమిడి వుందో అబ్దుల్ వాహిద్ కవితలో ...

స్మార్ట్ సిటీ

చెత్త కుండీలో
వేలితో డయల్ చేసే ఫోనుల్లా
పాత ర్యాలీ సైకిలుకు దారి చూపిన కిరోసిన్ బుడ్డిలా
తాతల జేబువాచి స్ప్రింగులా
బండెద్దుకు కొట్టిన నాడాలా
పనిచేయని టచ్ స్క్రీన్ మొబైళ్ళ పక్కనే
విరిగిన అంకెలు 
తలతెగిన కలలు
చెల్లచెదురుగా పడున్నాయి
చెత్తకుండీ వీధుల్లో
రాత్రింబవలు తిరిగే బొద్దింకలు, చీమలు
ఆ కలల మూటలు పోగేసుకుంటున్నాయి
గుండెకుంపటి రాజేసి
నాలుగు కలలు కాల్చుకుని 
ఒకపూట ఆకలి తీర్చుకుని
బతికేసే కొన్ని మెతుకులు...
కలను అమ్ముకుని
కలను కొనుక్కుని
కలను నమ్ముకుని
కలగా మారిన బతుకులు
చెత్తకుండీ నెత్తిమీద
రాజుగారి కిరీటంలా
వీధిలైటు వెలుగులు
విరిగిన గ్రామ్ ఫోను రికార్డు
చిట్లిన డివీడీ డిస్కు
చెట్టాపట్టాలేసుకుని
బతికే నగరం...
(5-2-15,కవి సంఘమం)
మట్టి కల్లుకున్న కొన్ని వేల నాటి సంస్కృతిని మట్టి లేని నగరం త్వరితంగా మార్చేస్తుంది. ప్రకృతిలో చివరాఖరికు వచ్చిన వాళ్ళం మనం, మానవ సమాజం కొసలో  ఏర్పడిన నగర సమాజం ప్రకృతికి మనకి చివరకు మిగిల్చేది పరాధీనతనే.ప్రకృతిలో జీవ వైవిద్యం లేని చోట మోడ్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా పచ్చ కాగితమే. నగరం ఒక హ్యుమేన్ జూ. 

0 comments:

Post a Comment