Thursday 27 May 2021 By: satyasrinivasg

ఎంతెంత దూరం,జాయిస్ కిల్మర్

 


ఇప్పటి వరకు చెట్లు నాటడంలో వుండే సాధక బాధలు చూశా౦. ఇక అడవుల సంరక్షణ గురించి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి.  చిన్నప్పుడు విన్న పాట ఎందుకో అడవుల సంరక్షణ విషయ౦లో బాగా జ్ఞాపకం వస్తుంది. అది

oతె౦త దూరం ,కోసిడి కోసిడి దూరం... ఈ పాట చాల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, గెంతో దూరం లేదు, ఇంకొ౦చమే అని ఉత్సాహ పర్చడానికి చెప్పే పాట. అదే విధంగా అడవుల్లో, పల్లెల్లో తిరుగుతున్నప్పుడు , మనం చేరాల్సిన ప్రాంతం దూరం అయినప్పటికీ ,అది ఎంత దూరం అని వారిని అడిగినప్పుడు అరె! దూరం లేదు,  ఇదే దారిలో ఇంకొంచం వెళ్ళి కుడి .వైపు తిరిగి మళ్ళీ ఎడమ వైపు తిరిగి సక్కంగా పోతే అక్కడ ఒక చింత చెట్టు కనపడతది అక్కడి నుండి ఇంకో నాల్గు అడుగులెయ్యాలి అంతే, అక్కడే. చాలా సులువుగా ఎంత దూర మైనా దగ్గర వున్నట్టే చెబుతారు. కొత్తవాళ్ళు ఆ దగ్గరిని చేరడానికి మధ్యలో చాల మందిని మళ్ళీ  మళ్ళీ అడిగి తెలుసుకుని వెళుతూ వుంటారు.

ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ దూరాన్ని దగ్గరగా చెప్పే వాళ్ళకి,  నడకే అలవాటు లేని వాళ్ళు కొత్తగా నడుస్తూ ఆ ప్రదేశాన్ని కనుగొనడమే గమ్యంగా అనుకుని వెళ్ళడం వల్ల,దారిలో మనం చేరే ప్రాంతం లో గొప్పదనం కంటే ,దారి పొడుగునా  ఎదురయ్యే వాళ్ళు కూడా మన గమ్యస్దానాలే అని తెలుసుకోక పోవడం చాల బాధాకరం.  ఇది ఎందుకంటే మనం ఒకరికి ఒకరo దూరమైపోయాం. మనం మర్చిపోయా౦ మన గమ్యం ఒకటేనని.

ఈ మధ్యన అమెరికాలో జార్జ్ ఉదంతం సందర్బంగా ఒక ఆఫ్రికన్ అమెరికన్ పర్యావరణ శాస్త్రవేత్త అన్నాడు...

పర్యవరణ సంరక్షణలో కీలక సమస్య అయిన వనరుల సంరక్షణ కంటే మా జాతి పై చూపిస్తున్న వివక్ష ఎక్కువగా వుంది, కారణం ఈ వివక్ష వల్ల మేము చెప్పేది వినరు. అవును ఇది ముమ్మాటికీ నిజం అక్కడా ,ఇక్కడా కాదు ఇది అంతటా వుంది. దీన్ని  శ్రీకాళహస్తి ప్రాంతంలోని జానపద గీతంలో ఆలకించండి.

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

గరళకంఠుని కడువ నలుపే గదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

సూర్యుడు ఎరుపైన,సేంద్రుడు తెలుపైనా

సూసేటి నయనాలు నలుపెగదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

గరళకంఠుని కడువ నలుపే గదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

వరిచేను పచ్చైనా ,వరికంకు తెలుపైనా

కోసేటి కొడవళ్ళు నలుపే గదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు...

 అవును నలుపు ,నలుపు అని నవ్వుతారు, గేలి చేస్తారు, దోచుకుంటారు ,కాని ఆ నలుపంచులోని వెలుగుని మాత్రం చూడరు...

   మాటలని నేను చాలాసార్లు విన్నాను, ఉమ్మడి అటవీ యాజమాన్యం కార్యక్రమం తొలి నాళ్ళల్లో మారుమూల ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ పైన చూపిన వివక్ష కళ్ళారా చూసాను. అంతే కాదు ఎక్కువ శాతం అటవీ అధికార్లు, ఇతరత్రా ప్రభుత్వ అధికార్లు,ఇంకా అనేక మంది  అనేది ఒకే మాట  ‘దొంగల చేతికి, తాళాలు ఇచ్చాం.’ అంటే  మన పాలనా యంత్రాంగంలో గిరిజన, గ్రామీణ ప్రాంత వాసులు అడవుల దొంగలు, పట్టణ వాసులు దొరలు. మారుమూల ప్రాంతంలో తిరిగి చూస్తే కానీ తెలియదు ఎవరు దొంగలో ,ఎవరు దొరలో. దొర దొంగలు,దొంగ దొరలెవరో. కరోన టెస్ట్లు చేసినట్టే ఈ  మహమ్మారికి కూడా పరీక్షలు చేయాలి. అప్పుడు వాస్తవాలు బట్టబయలవుతాయి.

ఇక వారి మాటల్లో వింటే అసలు విషయం  ఏంటో తెల్సుతుంది. అందుకు  ముందుగా  ఉమ్మడి అటవీ యాజమాన్యం గురి౦చి తెలియాలి. ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే ప్రజల భాగాస్వామ్యoతో అడవుల సంరక్షణ చేయాలన్న తలుoపుతో మొదలుపెట్టిన కార్యక్రమం.    ఆలోచనకు పునాది వేసింది వెస్ట్ బెంగాల్లోని అరాబారి అన్న గ్రామం అని అంటారు. అసలు అక్కడ ఎందుకు మొదలయ్యిందంటే , ఆనవాయితీ గా ఆ ఊర్లో సామాజిక వన పధకం కింద చెట్లని అటవీ శాఖవారు నాటే వారు. స్ధానికులకు తీవ్ర వంట చెరకు  కొరత వల్ల. కొద్దిగా  ఎదిగిన చెట్లని , దాని కోసం ఉపయోగించే వారు. దీని వల్ల వనం ఏర్పడలేదు. ఇది గ్రహించి ఒక అటవీ శాఖ అధికారి స్దానికులతో ఒక ఒప్పందం కుదుర్చు కున్నారు. అది, వాళ్ళకు కావాల్సిన వంట చెరకు కోసం  కొన్ని చెట్లని  నాటి, ,దానితో బాటు ఇతరత్రా చెట్లని కూడా వాళ్ళు సంరక్షిస్తే వాళ్ళకు లాభాల్లో పాతిక శాతం ఇస్తానన్నారు. అందుకు ప్రజలూ ఒప్పుకుని సంరక్షణ చేపట్టారు. అది విజవంతమయ్యి అ మాట అoతటా పొక్కింది. ఇంకే ముంది, ప్రపంచ బ్యాంకు, ఇతర ప్రపంచ దాత సంస్ధలు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించడం వల్ల అది మన దేశంలో చాలా రాష్ట్రాల్లో అమలులోకి  వచ్చింది. ఇక ప్రపంచ వత్తిడి వల్ల తు.చ తప్పకుండా అమలు చేయడం మొదలు. అప్పటి వరకు అటవీ శాఖ ఆధీనంలో జరిగే అటవీ యాజమాన్యం , ప్రజల భాగస్వామ్యం లోకి మారింది. ఇక అప్పటి వరకు ప్రజల్ని దొంగలు అన్న పాలక వ్యవస్ధ ,ఇప్పుడు దొంగల చేతికి తాళాలు ఇచ్చాం అనడం మొదలు పెట్టారు. ఇది అసలు విషయం.

ఇదే విషయం గురించి  గత మెదక్ జిల్లాలోని నర్సాపూర్ దగ్గర  గ్రామంలో ఈ పధకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్దామె అంది. ‘అంతా బాగానే వుంది సారూ, కాని ఒక్క విషయం అడుగుతా దానికి సమాధానం చెప్పండి సారూ.’ ఏంటి అని అడిగా, ‘సారూ అడవంతా పచ్చగా వున్నప్పుడు ఫారెస్తోల్ల చేతిలో వుండే అడవి, ఇప్పుడు అడవంతా పోయి కూట్లు(వేర్లు) వున్నప్పుడు, దొంగల చేతికి తాళ్లాలు ఇచ్చినామంటారు , గిది ఎంత వరకు నిజం సారూ. ఈరే చెప్పాలి.’  గంతే కాదు సారూ, అసలు అడవిని  ఎవరు పెంచారు సారూ, గదె పెరుగు తది, చెట్లని నాటి పెంచితే గది తోటైతది, అడవి కాదు. గిప్పుడు గీ కూట్లున్నాయి, జరంత మొగులై, ఆన బడితే గవే సిగురించి పచ్చగా ఎదుగుతాయి సారూ’, గదె అడివైతది’. ఇవే మాటలని వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామస్తుడు అన్నాడు, ‘గిదేంది సారూ చేరువులోని నీళ్ళని చేపలు తాగి, చెరువు ఖాళి చేసినాయ్యన్నారు,మల్లా గాదె చేపలకి చెరువు ఇచ్చిన్నారు’.

అవును ఆ కూట్లకి, ఆ చెరువులోని చేపలకి  ఎదిగే సమయం ఇస్తే,  అదే అడివైతది, చెరువు నిండుతది అన్న సూక్ష్మ జ్ఞానాన్ని మన అభివృద్ధి పయనంలో కోల్పోయాం. అందుకే మన బాటకి తోవ సూపేది ఎంత ఎంత దూరం అన్న ప్రోత్సాహం తో బాటు  స్ధానిక వాసుల పచ్చటి జ్ఞానోపదేశం, నేడు మనం కోల్పుతున్నది కేవలం ప్రకృతినే కాదు ఆ జ్ఞానేంద్రియాల్ని కుడా. ఆ జ్ఞానం కలగాలంటే మనకున్న అజ్ఞానం పోవాలి, అందుకు ఈ పాటని పదే పదే స్మరించాలి...

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

సూర్యుడు ఎరుపైన,సెoద్రుడు తెలుపైనా

సూసేటి నయనాలు నలుపెగదా

అభివృద్ధి కాంక్షలో దూరాల్ని పెంచుతున్నామే తప్ప  దగ్గర చేయడం లేదు. ఒక వైపు పచ్చటి హారాలు ఏర్పాటు చేయాలని చెబుతూ , మరో వైపు చెట్టుకి ఉండే నిర్వచనాల్ని మార్చే చట్టాల్ని ప్రవేశపెడుతున్నాం. మొన్ననే చేవెళ్ళ -వికారాబాద్ హైవే లోని  కొన్ని ఏళ్ళ  నాటి  వందల మర్రి చెట్లని నరికేస్తుంటే , చాలా మంది చెట్ల ప్రేమికులు, సంరక్షులు అడ్డుపడ్డారు. దానికి ఇంకా పూర్తి పరిష్కారం దొరికే లోపే, కేంద్ర ప్రభుత్వం  చట్టాలలో కొత్త సిఫార్సులు జోడించే క్రమంలో పూనుకుంది. అది వందకు పైగా వున్న హైవేలకు  చెట్లు అడ్డంగా వుండడం వల్ల వాట్ని నరికివేయాలన్న నెపంతో అటవీ చట్టంలో వున్న చెట్ల నిర్వచనాన్ని మారుస్తోంది. ఇక అశోకుడి నాటి కాలం మాట రహదారుల పక్కన చెట్లు నాటడం , వుండడం అన్నది చరిత్ర లోనే కనబడుతుంది.

వంగారి మాతాయి ఎనర్జీ పావర్టి నుండి  మహిళలను , ఎన్నో కుటుంభాలను  బయటకు తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ బెల్ట్  ఉద్యమం చేపట్టి౦దో దాని ఉద్దేశ్యం మారిపోతోంది.  కరోనా వల్ల వలస కార్మికులు తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ల్లని నగరాలకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు నగరాల్లో వుండి పనిచేస్తున్నప్పుడు, వాళ్ళు వంట వండు కోడానికి గ్యాస్ బండలు వుండవు, చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు  ఇక్కడ వుండి వండు కోడానికి వుండే ముఖ్య ఆధారం చెట్లు. మరి ఈ రహదారులు ఎవరి రియల్ ఎస్టేట్ల అభివృద్ధికి!.    దీనితో బాటు కొన్ని వందల బొగ్గు గనుల తవ్వకాలకి అనుమతులు ఇస్తున్నారు. అటు ,ఇటు యధేచ్చగా పుట్టుకొచ్చే ఈ ప్రక్రియల వల్ల మళ్ళీ వలస ఇంకా ఉధ్రుతం అవుతుంది, క్రమేణా ఎనర్జీ పావర్టి పెరుగుతుంది. దాన్ని పరిష్కరించడానికి దిగుమతులు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. ఇప్పటికే క్లైమేట్ చేంజ్ వల్ల వలస కూలి పై ఆధారపడే వారి జీవనం ,ముఖ్యంగా మహిళల పై  ప్రభావంపై పలు అధ్యయనాలు వాస్తవాల్ని వెల్లడించాయి. శాస్త్రవేత్తలు 2050 నాటికి మంచు ఖండాలు కరిగిపోతాయి అని అంటున్నారు. అంతె౦దుకు  ? కరోన వల్ల  చనిపోతాం అని తెలుస్తుంది తప్ప , దీని వల్ల బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. పేద పిల్లలకి చదువు అందుబాటులోకి రాకుండా పోతుంది కారణం ఇట్స్ ఆల్   ఎ వర్చువల్ వరల్డ్ ఇన్ ఫ్యూచర్ అన్న వాస్తవాలు  బయటకు రావడం లేదు. కారణం విపత్తులో  కూడా మానవత్వం కాదు ముఖ్యం వ్యాపారం ముఖ్యం. శుభ్ లాభ్ కాదు, లాభ్ శుభ్  అన్నది నేటి నీతి. అందుకే క్రమేణా హరిత హారాలు కూడా   ప్లాస్టిక్ కవర్ల కంపెనీలకి  మంచి లాభ౦ తెచ్చి పెట్టె వ్యాపారాలు. అటు చెట్లు  నరుకుతూ, అడవులని పెకిలించేస్తూ , ఇటు చెట్లు నాటుతూ  పోతాం. లేని వాడు మటుకు  అటు ఇటు పరుగెడుతూనే వుంటాడు.

పోయే..పోయే...

చెట్టూ పోయే

పుట్టా పోయే

భూమి పోయే

పంటా పోయే

కుంటా పోయే

చెరువు  పోయే

పడిన వర్షం

నిలవ దాయే

పనికోసం

పట్నం వస్తే

గాలి కూడా

సోకదాయే

(నల్లగొండ, 96)

ఇక కవిత్వానికి వస్తే మనం దీర్ఘ కవిత రాస్తామా, లేక చిన్న కవిత రాస్తామా అన్న దానికంటే ఆ కవితలో చెప్పదలుచుకున్నది ముఖ్యం.    అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి టైం అండ్ స్పేస్ ని పట్టుకున్న కవిత రూపాల్లో వేమన శతకాలు, ఉర్దూ,పర్షియన్ , సూఫీ, హైకూల్ని మించినవి లేవు. ఎందుకంటే అవి కేవలం  ఒక టెక్నిక్  కాదు ఒక టెక్నాలజీలు. కవిత్వానికి మన మెదళ్ళలో ఎప్పుడూమెదిలే మొబైల్ రింగ్  టోన్లు అవి.   కవిత్వ బీజాల్ని భద్ర పర్చే మట్టి కుండలు. ఒక సారి మణిపూర్ వెళ్ళి నప్పుడు చూశా. అక్కడి మారు మూల  ప్రాంతంలో ని మట్టి గోడల ఇళ్ళల్లో, వాళ్ళు విత్తనాల్ని ఆ గోడల్లో దాచిపెడితే అవి మొలకెత్తడం. అదే దృశ్యం కర్నూలు  జిల్లాలో  పాత ఇళ్ళ మేడల పైన కనబడుతుంది.  నేడు మనకు ఏర్పడుతున్నది కేవలం ఎనర్జీ పావర్టినే కాదు క్రియటివ్ పావర్టి కుడా. కారణం మనచుట్టూ అంతరించుకుపోతున్న పచ్చదనం.

 ప్రపంచానికి చెట్లు కావాలి. ప్రపంచానికి క్రిమికీటకాలు కావాలి. ప్రపంచానికి కవులు కావాలి, వారిలో కొందరు చెట్ల గురించి రాస్తారు.

చెట్లు

జాయిస్ కిల్మర్,1914

నేనుకుంటాను ఇక వవీట్నిఎప్పటికీ చూడను

అందమైన తియ్యటి భూమి రొమ్ములకు

అంటిపెట్టుకున్న ఆకలిగొన్న చెట్టు గొంతును

రోజూ దేవుడి వైపు చూసే చెట్టుని

ఆకులతో నిండిన కొమ్మలతో ప్రార్ధిస్తూ

చెట్టు వేసవి దుస్తులలో

రాబిన్ పిట్ట గూళ్ళను

తన కేశాల్లో అలంకరించుకుని

మంచు తన రొమ్ముల్లో అల్లుకుని

వర్షంతో పెనవేసుకుని జీవిస్తూ.

నా లాంటి అల్పులు కవితలు అల్లుతారు

దేవుడొక్కడే చెట్టుని సృష్టి౦చగలడు

(అనుసృజన జీ.సత్యశ్రినివాస్)

0 comments:

Post a Comment