Thursday 4 June 2020 0 comments By: satyasrinivasg

చరిత్ర సౌ౦జ్ఞలు ప్రకృతి చిహ్నాలు



 జీవం అన్నది ఒక  పరిశోధన శాల నుండి పుట్టలేదు, అది విపత్కర సందర్భం  నుండి ఆవిర్భవించింది  అన్నది  శాస్త్రజ్ఞుల అంచనా. 251 మిలియన్ సంవత్సరాల(గ్రేట్ డైయింగ్) క్రితం 96 శాతం జీవరాసులు అంతరించి  కేవలం నాలుగు రకాల జీవరాసులు భూమి, నేల పైన జీవనం కొనసాగించాయట. దీనికి చిహ్నం సెల్ ఫిష్. జీవనయానం  అంటే విపత్కర  పరిస్ధితులని ఎదురొడ్డి నిలవడం. జీవం అలా కొనసాగింది, ఈ  కొనసాగింపులో మనతో బాటు ప్రకృతిని ఒక చిహ్నంగా  చేస్కుంటూ వచ్చాం. ప్రాణహిత- గోదావరి లోయ ప్రాంతం భౌగోళికంగా చాలా  విశిష్ట ప్రాంతం.  ఈ ప్రాంతంలోని పూర్వ ఆదిలాబాద్   జిల్లాలోని యమ్మన్ పల్లి గ్రామంలో తొలి మానవులు ఉపయోగించిన పనిముట్లు లభ్యమయ్యాయి.ఆర్కియాలజిస్ట్లు ఆనతి కాలం గా వున్న పనిముట్లని కల్చర్(సంస్కృతి) అని వ్యాఖ్యానిస్తారు., పనిముట్లు అన్నవి మానవ సంస్కృతికి చిహ్నాలు, ఈ పనిముట్ల ద్వారా వారి జీవన, సామాజిక , ప్రకృతికి గల సంబంధం వ్యక్తమవుతుంది. ఇక్కడే మరొక కధ లాంటి సంఘటన ప్రస్తావిస్తా,  కామ్తి శ్రేణుల ప్రాంతంలో( ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో)1968 కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లోని ప్యాలియనటోలజిస్త్స్(పురాజీవ, శిలాజీవ) పరిశోధన చేస్తునప్పుడు త్రైస్సాక్ కాలం (252 -201 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే గ్రేట్ డైయింగ్ కాలం పిదప) తీవ్రమైన ఎండలను లెక్కచెయ్యకుండా తవ్వకాలు చేపట్టారు, ఫలితం రాక ఇక వెనుతిరుగుతునప్పుడు వారికి, కామ్తి గ్రామస్తుడు ఒకరు ,గతంలో అంటే  కొన్ని సంవత్సారాల క్రితం గ్రామస్తులు వారికి దొరికిన రెండు రాళ్ళను, అవి దేవతల్ని పోలి వున్నాయి  అని  వాటిని విగ్రహ ప్రతిష్ట చేసి గుడి కట్టారని  చెప్పాడు. ప్రతి ఏడాది అక్కడ సంబరాలు చేస్తారు. ఇది తెలుస్కుని శాస్త్రజ్ఞులు అక్కడికి వెళ్లి చూస్తే అవి,లైస్త్రోసవురస్  అనే పురాతన సరీసృపాల అవశేషం. శాస్త్రజ్ఞులు గ్రామస్తులని ఒక దేవతని తమకు  పరిశోధన నిమ్మిత్తం ఇమ్మని అడిగి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం  వస్తువు ఒకటే కాని దానిని చూసే తీరు  ఆయా ప్రాంతం, సందర్భ౦, వ్యక్తులు ,వ్యవస్ధల తీరు పై ఆధార పడి వుంటుంది. ఒకరికి ఆ రూపం దేవత అయితే మరొకరికి  అది జంతుజీవరాసుల ఆనవాలు. ఈ   పి.జీ.(ప్రాణహిత –గోదావరి వ్యాలీ) ప్రాంతంలో కొండలు,నేలలు శిలాజీవాల అవశేషాలు ఘని. అక్కడ జరిగిన పరిశోధనల వల్ల ఆయా గ్రామాలకు ఆ కొండ శ్రేణుల పేర్లు పెట్టారు. గొంద్వాన రీజియన్ అన్న పేరు కుడా అలానే వచ్చింది. దురదృష్టవశాత్తు మనం  ప్రకృతికి, జీవరాశికి సంబంధం వల్ల ఏర్పడిన చరిత్రను పట్టించుకోము, తగిన గుర్తింపు ఇవ్వం. ఎంతసేపు మానవ నిర్మిత కట్టడాలనే చరిత్ర చిహ్నాలుగా కీర్తిస్తాం. ఎందుకంటే గిరిజనులకు అది బువ్వనిచ్చే గూడైతే నాగరికతకు అది డబ్బునిచ్చే ముడిసరుకు కాబట్టి. అంటే మన ఇజంలలో ప్రకృతి చిహ్నాలని ఎక్కువగా వాడుకున్నది మతం కోసమే! అది, భారతంలో శల్యుని  రధం పై జెండా   గుర్తు అరటి చెట్టు,భీష్ముడికి తాడి చెట్టు,అభిమన్యుని జెండా పై   గుర్తు  కొండగోగు పువ్వు,లేక గన్నేరు చెట్టు. వాటికంటూ ప్రత్యేక విశిష్టత వుంది. ఆ వ్యక్తుల విశిష్టతకు తగ్గటుగా ,ఇతర విశేషాల వల్ల పెట్టుకుని వుంటారు. ఇవి కేవలం గుర్తులే కాదు, అవి ఇంకా చాలా విశేషాల్ని  చెబుతాయి.ఇవి మనలో కాలక్రమేణా నాటుకు పోతాయి, నాల్గో సింహం సినిమా డైలాగ్ కంటే బలంగా.   ప్రతీకలకు సంబంధించి  మరొక  విశ్లేషణ వుంది, అది వాణిజ్యానికి, వర్తకానికి సంబంధించి.ఇందుకు సజీవ ఉదాహరణ  సుప్రసిద్ది గాంచిన లక్ష్మీ దేవి క్యాలెండర్. రాజా రవి వర్మ తన చిత్రపటాలని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి తదనంతరం కాలంలో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభిoచాడు, తన పెయింటింగ్స్ ని అచ్చువేసి సరఫరా చేసాడు, అందుకే ఇప్పటికీ శకుంతల, సరస్వతి ,లక్ష్మీ దేవి పెయింటింగ్లు గోడలకి క్యాలెండర్లు గా , మార్బుల్స్ పైన  దేవుడి గదుల్లో ప్రతిష్టి౦చుకున్నాయి.  ఇక లక్ష్మీదేవి క్యాలెండర్ని గమినిస్తే ,లక్ష్మీ దేవి సముద్రంలోని కలువ పైన కూర్చుని కుడిచేతి నుండి కాసులు రాలుస్తుంది.అసలు ఈ రూపం ఎందుకు వచ్చింది, అని మిత్రులతో చర్చించినప్పుడు కళల పైన అవగాహన వున్న మిత్రుడు ఇచ్చిన వివరణ. ఒక కాలంలో సముద్రయానం  అన్నది తిరిగిరాని ప్రయాణం, కాని అప్పుడు వాణిజ్యం ,వర్తకం,అంటే కాక పై చదువులకు బయటకు వెళ్ళాలి,అది సముద్రయానం ద్వారానే జరిగేది. కనుక జనాల్లో వుండే భయం పోగొట్టడానికి సముద్రయానం ద్వారా వాణిజ్యం ,వర్తకం చేస్తే  డబ్బులు, డిగ్రీలు  సంపాదిoచవచ్చు అన్న  ప్రేరణతో కూడిన అవగాహన కల్పించడానికి ఏర్పడిన చిత్రం, ఇక ఏముంది శుభ్ లాభ్ పోయి,  లాభ్  శుభ్ అన్న నినాదం  వచ్చింది.
కళలలో రూపం ముఖ్యం,ఆ రూపం ప్రకృతి ఆనవాలైనప్పుడు, ప్రీ కాని పోస్ట్ కాని ఇజం లో రీజన్ అండ్ రివిలేషన్(కారణం ,కనుగొనడం) కంటే  నమ్మకమే ఆచరణ లోకి వచ్చేస్తుంది, ప్రకృతి సంరక్షణ పేర్న  గుడ్డిగా చెట్లు నాటినట్టు.నేడు మనమున్నది పోస్ట్ ట్రూథ్ కాలం లో ప్రజల అభిప్రాయాన్నిఏర్పరచుకోడానికి  వాస్తవ అంశాల కంటే , వారి నమ్మకాల్ని ,భావోద్వేగాల్ని ఎవరికి అనువుగా వారు మల్చుకోవడం కీలకం. మేక ,కుక్క కధ లా...
ఇప్పటి రోజుల్లో ప్రకృతి చిహ్నం ఒకటే అయినప్పటికి దాని వాడుక  అర్ధానికి వివిధ తీరులున్నాయి కనుక ప్రకృతి సంరక్షణ,పర్యావరణ, జీవావరణ సంరక్షణ అన్నది   అరచేతిల్లో తిరిగే గ్లోబ్ చిహ్నం ఒక్కటే కాదు, ఎందుకంటే ఆ అరచేతులు ఎవరివి అన్నది నిగూఢ రహస్యం.
 సంరక్షణ ఒక బొంగరాలాట
నాకు చిన్నప్పుడు బొంగరాలాట ఆడడం చాల ఇష్టం. నేల పైన బొంగరం తిరుగుతునప్పుడు  కళ్ళు దాని చుట్టూ తిరిగేవి, అందుకే అది ఎంత ఎక్కువ సేపు తిరిగితే అంత సేపు దాని చుట్టే  చూపులు అల్లుకునేవి. నాకంటే పెద్దవాళ్ళు బొంగరాన్ని అరచేతిలో తిప్పుతున్నప్పుడు ,నేను చాలా ప్రాక్టిస్ చేసి నేర్చుకున్నా, ఇంకేముంది నేనే బొంగరమై పోయా!. ఆ బొంగరాన్ని చిన్న పిల్లల అరచేతులకి అందిస్తే , అది వారి లేలేత చేతుల్లో తిరుగుతోంటే వారి సంతోషం ,నీటి చుక్కల్లో తడిసే బుజ్జి పక్షుల కేరింతలాగుంటుంది. ఈ ఆటలో మరో లక్షణం   గుండ్రంలోని రాయి ఎవరు కొడితే వాళ్ళు గెలిచినట్టు. అలా మనకు తెలియకుండా మనకు చాలా అబ్జర్వేషన్ గుణాల్ని నేర్పిస్తుంది. నేడు య్యానిమలిజం, మోడర్నిజం, హ్యుమనిజం, నుండి  అన్నీ ఇజంలలో పోస్ట్ స్ధాయికి చేరామని అనుకుంటున్నాం. ఇవి ఎక్కువ గా సాహిత్యం , కళలు, శాస్త్రీయ ధోరణిలలో కనిపిస్తాయి తప్ప సామాజిక మార్పుల్లో కాదు.  ఇక పోస్ట్ మోడర్నిజం స్ధాయిలో శాస్త్రీయ మార్పుల వల్ల అభివృద్ధి చెందాము అని చెప్పడానికి  ఉపయుక్తకరమైన సాధనాలని ఏర్పరుచుకున్నాం, కాని పోస్ట్ హ్యుమనిజం స్ధాయికి ఎదగలేదు. వివక్షత అన్ని రూపాల్లో కొనసాగుతోంది, కొన్నిట్లో అయితే హెచ్చు స్ధాయిల్లో ఎదిగిపోయింది. ఆశించే స్ధాయికి ఎదగలేకపోవడానికి కారణం  మనం అనాదిగా  ప్రకృతికి ఎంక్లోజర్స్ ఏర్పరుస్తూ వాటి ద్వారా సమాజాన్ని అదుపాజ్ఞలలో పెట్టుకోవడం.  దీనికి ,బొంగరం ఆటకి చాలా దగ్గర పోలికల్లున్నాయి. ఆట ఆడుకోడానికి ఒక వస్తువు కావాలి , ఆట ఆడుతూ, ఆడుతూ, క్రమేణా మనమే ఆట వస్తువయి పోతాం. బొంగరం ఆటలో మన ఆలోచన ,శరీరం అంతా బొంగరం చుట్టూ తిరుగుతుంది, అది తిరుగుతుంది , కాని మనం తిరుగుతున్నాం అన్న భ్రమలోకి  పోతాం.
ఇదే అట 2000 దశలో వచ్చిన బేబ్లేడ్ పిల్లల కార్టూన్ సీరియల్, పిల్లలని ఎగబడి కోనేడట్టు చేసింది, అన్నం తినే కంచాలలో సైతం బొంగరాలు తిరిగాయి.నేను తిప్పిన బొంగరం నేల పైన తిరిగేది, నా కొడుకు,మేనల్లుడు తిప్పే బొంగరం కంచంలో తిరుగుతోంది.  మన తోలి దశ బొమ్మలు కుడా అన్నం తింటూ, అన్నం ముద్దల్ని వలయా కారం , గీతలు గీయడం తో మొదలైయింది, తరం మారేసరికి నేల కంచం అయిపోయింది. ప్రీక్వెల్  నుండి సీక్వెల్ కి వచ్చే సరికి బొంగరం  రూపం అదే వుంది, దానిని తయారు చేసే సామాగ్రి మారింది, ఆడే ప్రదేశం మారింది, తిరిగే స్ధానం కూడా. ఒక సహజమైన చెట్టు నుండి తయారైన బొంగరం(.  చిత్తూరు జిల్లా ఒక కాలంలో బొంగరాల తయారీకి ప్రసిద్ది , అక్కడ బొంగరాలు తయారు చేసుకునేందుకు అనువైన చెట్లు ఉండేవి)  ప్లాస్టిక్ అయ్యింది. ఇది అందరూ చూడలేరు, కొన లేరు ,సామాజిక తేడాలు ,వివక్ష. ప్రకృతిని ముడిసరుకుగా  మార్చి ఎదగడం అన్నది సింబల్ గా  మారింది. ఇది జరగాలంటే ప్రకృతిని సహజంగా కాక ఒట్టి ముడిసరుకుగా మార్చాలి. అది కొందరి చేతుల్లోనే వుండాలి, ఇక్కడే మనలోని  డా. జెకిల్ అండ్ హైడ్ పాత్రలు వస్తాయి. ఒకడు మంచివాడు ,మరొకడు దుర్మార్గుడు.  ఈ పద్ధతిని ఇప్పుడు రివర్స్ లో  తిప్పాలి . కధ ప్రీక్వెల్ లోకి వెళ్ళాలి!
ఈ ప్రతీకల రూపాల్లోని మూలాలు చూడాలి,ఇందుకు మనం నేర్చుకున్న దాంట్లో ఏమి నేర్చుకోలేదో తెల్సుకోవాలి అందుకు, చదివినది పక్కన పెట్టి, రాయనిది,చెప్పనిది తిరిగి  చదవాలి. ప్రకృతి, జీవావరణ ,పర్యావరణ కవిత్వంలో కొత్త ఒరవడి , ప్రతీకలని సృష్టించాలి. , ఇందకు జాయ్ హర్జో, అమెరికాలోని మొదటి నేటివ్ అమెరికన్ కవయత్రి , సంగీత విధ్వాంసురాలు, రచయత్రి, నాటక రచయత్రి, 20 వ శతాబ్దం చివరి దశలో  నేటివ్ అమెరికన్  సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి.  జాయ్ హర్జో  రెండు సార్లు పోయెట్ లారేట్ గా పురస్కారం అందుకుంది.
గ్రద్ద
జాయ్ హర్జో
ప్రార్ధించాలంటే, మనస్సుని పూర్తిగా తెరవాలి
ఆకాశానికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి
ఒకే  గొంతుక, అది నువ్వు.
నువ్వు చూడలేనిది, వినలేనిది
ఇంకా వుందని తెలుసుకో
మెల్లిగా ఎదుగుతూ, భాషల్లోనూ
చలనం లేకుండా ఏదీ అంతుబట్టదు
అవి ఎప్పుడూ శబ్దాలే కాదు,ఇతరత్రవి కూడా
చలన గోళాలు.
ఆ ఆదివారమప్పుడు  గ్రద్ద లా 
సాల్ట్ నది పైన నీలటి ఆకాశంలోని వలయంలా
పవిత్రమైన రెక్కలతో
గాలిలో, మన మనస్సుల్ని శుభ్రపర్చినది
మేము నిన్ను చూస్తాము, మమ్మల్ని మేము, ఇంకా తెలుసుకుంటాం
అన్నిట్ని భద్రంగా చూడాలని
అన్నిటి పట్ల దయతో వుండాలి.
మనం వీటన్నిటితో ముడిపడున్నామని,శ్వాస పీల్చు
ఇవన్నీ,
శ్వాస పీల్చు, ఇది తెల్సుకుని
నిజంగా  మనం ధన్యులం, ఎందుకంటే
మనం జన్మించాము, త్వరలోనే చనిపోతాం,
స్వచ్చమైన  జీవన చక్రం
మనలోనే.
ఉదయమే వలయంలా  ఎగురుతున్న గ్రద్దలా
ప్రార్దిద్దాo అది జరగాలని
అందంగా.
అందంగా.
(అనుసృజన జి.సత్య శ్రీనివాస్)

ఇదంతా ఆమె మాటల్లో చెప్పాలంటే...  నిజంగా  మనం ధన్యులం, ఎందుకంటే ...,
 నాకో సిద్ధాంతం వుంది మనలో కొందరు మన శరీరాలను దాటి బతుకుతామని ,ఎందుకంటే మనం నరాల అల్లికలతో జన్మించాము.
ఉదయమే వలయంలా  ఎగురుతున్న గ్రద్దలా...
నాకు తెల్సు ప్రతి రోజు  ఎన్నో ప్రపంచాల్ని చూస్తూ ,వస్తూ పోతూ వుంటా..
ఈ కవితలో నేటివ్ అమెరికన్ల ప్రాపంచిక ప్రకృతి రూపం నేటి కోణంలో ఆవిర్భవిస్తుంది,
ఆకాశానికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి
ఒకే  గొంతుక, అది నువ్వు.
ఆమె మాటల్లోనే ఒక ఆకుని చదువుతూ ప్రపంచాన్ని అర్ధం చేస్కోవచ్చు...
ఇది నేననుకుంటున్న మాట ,ఆ ఆకు పచ్చని పాఠ౦ మీరే కావచ్చు!