Tuesday 24 February 2015 0 comments By: satyasrinivasg

సైలెంట్ వ్యాలీ ఉద్యమం- ప్రకృతికి కొత్త భాష్యం-పర్యావరణ ఉద్యమాలు-23

అడవి
డి. వినయ చంద్రన్
వాళ్ళకి ఏ పేరు ఇవ్వను, అడవివాసులకు?
ఏవిధమైన వర్ణన ఇవ్వను?
అక్షరంతో-అ,ఆ
అక్కడ చెట్ల వేర్లు,తుప్పలు మొలకెత్తుతాయి.
వేయ్యిన్నొక్కసార్లు, వేయ్యిన్నొక్క బండలు దొర్లుతాయి
ప్రేమతో మమేకమై,
పచ్చికబయళ్ళు,గడ్డి మైదానాలు వికసిస్తాయి,
కొండల చుట్టూ తిరిగి అలసి
వాట్ని ఏమని పిలవను- అడవి బిడ్డల్ని,
ఏవిధమైన వర్ణన ఇవ్వను?
రంగులు,కళ్ళకి నగ్నంగా కనిపించేవి,
గొంతులు,చెవులకు విన్పించేవి.
అంతులేని పరిమళం
రాత్రింబవళ్ళు నువ్వు లెక్కపెట్టినా,
గాలి సూర్యుడిలో వర్షాన్నిలెక్కపెట్టడం మానదు
సంయమనం ధ్యానించే పరిపూర్ణతని
మమైకత ఆలింగనాల అసంపూర్తి శీర్షికల్ని.
అడవి బిడ్డలకి ఏ పేరు పెట్టను,
ఏ పేరైనా ఇవ్వగలనా?
ప్రతి నీడా,పూల తివాచీల- నేర్పరి తనం,
ప్రతి చివర నియంతల యేలిక,
అనాగరిక దేవుళ్ళు, చనిపోయిన ఆత్మలు, జననం ఎరుగని భవిష్యత్తు తరాలు,
శుభసూచికల నమ్మకాల నరికివేత,కాటుకలాంటి అడవి మంటలు,
రాత్రుల్ని చంపేసిన పైశాచకత్వం,
ఎవరు తల్లి,ఎవరు తండ్రి, ఎవరు తండ్రి ,చెల్లి?,
ఆ తమ్ముడు లేక కాబో యే వరుడా?
క్షీణించిన అడవి మళ్ళీ పునారావృతం అవుతుంది-
మళ్ళీ ఆ కాలం వస్తుంది లేక వెళ్ళిపోతోందా?
మిట్టమధ్యాహ్నం కుడా అడవిలో కురుస్తుంది,
సూర్యుడి రధ చక్రాలు రాత్రప్పుడు కూడా కాంతిని వెదజల్లుతాయి,
నేను వాడని సరస్సులో దూకి మళ్ళీ వస్తాను,
ఎన్నెన్ని పుట్టుకలు,ఎన్నెన్ని మరణాలు!
భయాన్ని నిప్పుల్లో వేయండి, అది తిరిగి నెగళ్లు గా వికసిస్తుంది,
శివుడి డమరుకం సముద్రపు ప్రళయం,
అడవి కూడా ఒక సంద్రమే, ఆదరణమైన తాబేళ్లు,
చేపలు,సంద్రపు మాయా జీవాలు,
మైనాక పర్వతపు చిహ్నం
నోవా, మను,కృష్ణుడి ప్రళయ నాదం
మనం, నావికులం,నక్షత్రాలు,పడవలు, అడవి కూడా ఒక సముద్రమే!
మనం అడవిలో మునిగి తేలుతాం,
మనం వేదాలం,కాలాలం, చెదల గూళ్ళం.
ఏ పేరైనా ఇవ్వగలనా-
అడవి స్నేహితులకు, ఇతర మిత్రులకు,
వారి పిల్లా పాపలకు,ఆ  చుట్టు పక్కల వాళ్ళకి,
యవ్వనులకు, పూర్వీకుల ఆత్మలకు,ఋతువులకు?
లక్ష్మణా, వాళ్ళు ద్రౌపది కారు, లేక పరిజన్య కారు
లేక భాగీరధి,రిగ్,యజుర్ లేక  సామవేదాలు కారు
లేక వస్తువులు, వివేకం,నమ్మకం.
వాళ్ళు వన్య ఏనుగులు,సింహాలు, తూనీగలు,ఎలుగుబంట్లు,
దియోదర్ వృక్షాలు,అరటి చెట్లు, టేకు చెట్లు, పూలు,
గరికలు,పక్షులు, పూర్వజన్మ పై వాలే ముందు ఘడియలు 
వాళ్ళని మనం వాళ్ళ పేర్లతో గుర్తించం,
మనకి ఏమి తెల్సుఅని? మన గురించి మనకైనా?
అడవి- భూమాత గాజుల సవ్వడి
ఎవరైతే నక్షత్ర కూటమి దివి పీటం మీద కూర్చు౦టుందో,
అన్నిటిని మేళవించుకుని  వీణ వాయిస్తూ
ఆమె కాళ్ళు ఆడిస్తునప్పుడు, కాలం తన్మయత్వంలో నాట్యమాడుతుంది,
అడవికి ఏ పేరని పెట్టను?
అడవికి నా పేరే పెట్టుకుంటాను
పేర్లు సూర్యుడి తో బాటు పన్నెండు రాసులలో నడుస్తాయి,
ఉత్తరం, దక్షిణం, తృతీయ గ్రహణాలు
రాహు గొంతు చుట్టూ,
తరచూ వాటి ప్రకాశాన్ని  పొందుతూ మళ్ళీ వికసిస్తూ
సూర్యుడి రధం ముందు వాలుతూ
ఏడు గుర్రాల బండిలో
వేకువ వెనక నడిచే పేర్లు ముందుకు కొనసాగుతాయి
సూర్యుడి రధసారధి అరుణలా , గరుడి తమ్ముడు,
ఋషుల అనుంగుడి లా,
దైవతా మూర్తుల ఆనందపు సంగీతం లా,
దైవకన్యల నృత్యంలా,
యక్షులు,నాగాల్లా
సంధ్య, ఛాయ ,సూర్యుడి నమ్మక సహచరిణిల్లా,
చెట్ల కొమ్మలకి తలక్రిoదుల వుండి తపస్సు చేసే వేలెడంత ఋషుల్లా,
ఉద్యమం, సాయంత్రం విశ్రాంతి లేకుండా,
మది లోని సరిహ ద్దుల్లా,
సూర్యుడితో పేర్లు నడుస్తాయి,

ఏ పేరని పెట్టగలను అడవికి?
అడవిని నా పేరుతోనే పిలుస్తాను,

చంద్రుడి తో పేర్లు నడుస్తాయి
నేలవంక నుండి, పున్నమి చంద్రుడి వరకు,
ఇరవై ఏడు మార్లు వికసించే నెలవంక చారలతో కూడి,
శక్తి నలుముకున్న రోహిణి,శుక్ర బుద్ధ సహచరులతో,
ఔషద గల గుణంతో
సృష్టికి ఉత్తేజమిచ్చే,
రాత్రి పూర్వీకుల ఆత్మలకు లంగరయ్యే విధంగా,
పెంచిన తల్లి కలగా,
కవిత్వానికి రాజ హంస లా,
పేర్లు చంద్రుడి తో నడుస్తాయి, కవిత్వ విల్లుని ధరించి,
 ఏ పేరని పెట్టగలను అడవికి?
అడవిని నా పేరుతోనే పిలుస్తాను,
సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి పేర్లు
సమస్త ప్రపంచం నీ నామం
పేరుల్లోనే పెరుమాళ్ళు వుంటాడు,మూలవాసి,
పేరు ,పెరుమాళ్ళు ఒకటే.
(ఆంగ్ల మూలం-సరితా మోహనన్ వర్మ)
(అనుసృజన- సత్య శ్రీనివాస్)

సైలెంట్ వ్యాలీ ఉద్యమం వల్ల మైక్రో హైడ్రో ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిలిపేసింది.1983లో సైలెంట్ వ్యాలీ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతoగా ప్రకటించారు.2014లో 25 ఏళ్ల ఉద్యమానికి ప్రతీకగా మలయాళం సాహిత్య కారులు సదస్సు నిర్వహించి, మలయాళం సాహిత్యం పర్యావరణం అన్న ప్రత్యేక సంచిక విడుదల చేసారు. ప్రకృతి సాహిత్యం లో ఈ అధ్యయనం ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.
Wednesday 18 February 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-22-సైలెంట్ వ్యాలీ ఉద్యమం- కాల్ అఫ్ నేచర్.

సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి సంబంధించిన కవితల్లో “గీతం” అన్న శీర్షికతో కవితలో ప్రముఖంగా వచ్చాయి . దీనికి విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తే ప్రతిస్పందన విధ్వంసం అని ఓ.యన్. వి. కురుప్ రాసిన ‘భూమికోరు చరమగీతం’ చెట్టుకి సంభందించిన కవితల్లో  సృజనాత్మక పరంగా , విశేషంగా ప్రాచుర్యం పొందిన కవిత ఇది. ప్రకృతిలోని  వ్యవస్ధలపై మానవ ప్రమేయం వలన వాతావరణ సమతుల్యత ఏ విధంగా దెబ్బతింటుందని తెలుపుతుంది.నిస్సంకోచంగా ఈ రచన తీరు ప్రకృతి విద్వంసం కి సంభందించిన రచనా శైలికి నిదర్శనాలు.
విద్వేషం ఉప్పొంగింది
మండే సూర్యుడి నుండి నిప్పులు కురుస్తాయి;
వర్షం మబ్బులు 
 తాగడానికి చుక్క నీటి కోసం తపిస్తాయి;
వసంత కన్యలు చల్లటి గాలికోసం తహతహ లాడుతాయి
ఋతువుల రాజు అన్వేషణ నిర్వియమవుతుంది
ఒక పువ్వు కోసం;
కదలిక లేని నదులు తరంగాల కోసం తపిస్తాయి
జీవన చక్రాలు దారుల్లో కుంగిపోతాయి
(30-37,పంక్తులు)
(అనుసృజన)
ఇదే విధమైన  ప్రకృతి చరమ గీతం దాని వల్ల భవిష్యత్తు ప్రస్తావన 1962 లో రేచల్ కర్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతి పై ఏ అడ్డు అదుపు లేని మానవ దురాగతాలు కొనసాగితే, ఏ మార్పులేని ఒకే విధమైన జీవనంతో మిగిలిన భూమి, ఇక ఎప్పటికీ పక్షుల గళం లేని  వసంతం గురించి చెపుతుంది.’భూమి’ కవితలో నేల తల్లి ని  సౌందర్యారాధనతో చూసిన దృష్టి, భూమి చెక్కు చెదరని  నవ యవ్వనాన్ని తెలుపుతూనే రాబోయే విధ్వంశం గురించి చెపుతుంది. పర్యావరణ కవిత్వం భవిష్యత్తుని ప్రస్తావించే కాల జ్ఞానం. ఇదే విషయాన్ని నేడు ప్రకృతి విద్వంశం వల్ల వాతావరణ మార్పులు గురించి విస్తారంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కవితలోని అంశాలనే 2006 నోబుల్ బహుమతి పొందిన  అంతర్జాతీయ వాతావరణ మార్పులు నివేదికలో ప్రస్తావించారు. శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకృతి రహస్యాలను చెపితే , కవిత్వం మనలోని మనస్సు ప్రకృతి, సామాజిక ప్రకృతి,ప్రకృతి ప్రకృతి మధ్య అంతర్లీన టైం ,స్పేస్ సంభాషణ. ప్రముఖ ఫిలాసఫర్ యు.జి. కృష్ణమూర్తి మాటల్లో ‘మన శరీరంలో ఒక గడియారం వుంటుంది. అది ఏ యాంత్రిక గడియారం లేకుండానే మేలుకొల్పుతుంది’. ఆ ఘడియారపు సెకండ్ల ముల్లు చప్పుడే మన కవితాక్షరాలు. శరీరం డైనమైటు అయినప్పుడు   మనస్సు సవ్వడి  చరమ గీతానికి సహవాయిద్యాల తంత్రులగానే పలుకుతుంది. ఇంత కంటె తీవ్ర మైన హృద్రోగం ,నరాల బలహీనత లేదు. మనం మనలోని సహజంగా మేల్కొలిపే సుప్రభాత గీతాన్ని కోల్పోయాం. రోజుల్ని యాత్రికం చేస్కునప్పుడు ,రోజులు మనకి ప్రతి రోజు మనకి ‘దినం’ గా నే గడుస్తుంది. డి. వినయచంద్రన్ అన్నట్టు పర్యావరణీయం అంటే ప్రకృతి ని గుడ్డిగా పుజించడం కాదు, అదే విధంగా తోటల/వనాల పెంపకం గురించి అధ్యయనమూ కాదు. ఈ విధమైన దృక్పథం ప్రకృతిని కేవలం చెట్లు,నదులు,పక్షులు,అడవులు గా మార్చేస్తుంది. ఈ నిర్జీవ (సింథటిక్) ఆలోచన, అనాలోచితంగా నే మానవ జీవనాన్ని, మనుషుల్ని ప్రకృతిని విడధీస్తుంది. అప్పుడు సూర్యోదయం కూడ  కరిగిపోతున్న కలే!
వినయచంద్రన్ దృష్టిలో పర్యావరణీయ సాహిత్యం అటువంటి ధృక్కోణాల్నిమార్చాలి, ప్రకృతి ,సమస్త  మానవ జీవన అంశాలు ఒకటికొకటి ముడిపడి ఉన్నాయన్న భావనని కల్పించాలి అన్నది వ్యక్తపరుస్తాయి. అయ్యప్ప పానికర్ ఉదయాస్తమనం  అన్న కవితలో వివిధ జీవరాసుల మధ్య వున్న సహజీవనాన్ని చెపుతాయి. సూర్యుడి పడమటి పయనాన్ని సహజీవనానికి ప్రతీకగా వర్ణిస్తుంది.
సరిహద్దులనుండి పొడుచుకొస్తున్న నిప్పు బాణాలు
భూమిని మేల్కొనేలా చేస్తాయి;
చొచ్చుకుపోయిన వేర్లు;
మొగ్గలు,పూలు, లేత ఆకులూ
కొమ్మల కున్న;
ముందుకు సాగుతున్న  క్రిములు
 లేత ఆకుల్ని భుజించడానికి;
పాటలు పాడుతున్న పక్షుల గుంపు
ఆ క్రిముల్ని ఆరగించడానికి;
వేటగాడు తనకు ఆహారం కోసం ఆ పక్షుల్ని సంహరిస్తాడు;
వేటగాడిని వెంటాడే వన్య ప్రాణి
అతనిని భుజించడానికి;
వన్య ప్రాణిని ,అడవిని ఆహుతి చేసే మంటలు;
అప్పుడు సరిహద్దు వాట్ని తిరిగి పొందుతుంది
(22- 35 పంక్తులు)
(అనుసృజన)
ఈ కవితలో మనకి ప్రకృతిలోని ఆహార చక్రం తెల్సుతుంది. ప్రకృతిలోని నీటి చక్రం,ఆహారం చక్రం అన్నిటికీ ఆదీ అంతం వుండదు.ఇదంతా శక్తి(యనర్జి సైకిల్) ని తెలుపుతాయి. ఇది అర్ధం చేస్కోకుండా మనం మనలోని గడియారాన్ని సరిచేసుకోలేము. మనం ఎంత డిజిటల్ క్లాక్స్ ఉపయోగిస్తున్నా .సెల్ కెమెరాలు వాడుతున్నా అది ఒక పునర్జీవం కాలేని ఐ వెస్ట్ గానే మారుతోంది. ఈ తీరు మారాలంటే మన ఆలోచనలు సింథటిక్ గా వుండకూడదు. ప్లాస్టిక్ డబ్బుల కాలంలో సంబంధాలు కూడ నిర్జీవంగాను వుంటాయి. పర్యావరణ కవిత్వం అన్నది ఒక సింధటిక్ ప్రవచనం కాదు, ఒక సజీవ వెదురాకంచున మంచు బిందువు గూడులో నిశ్శబ్దంగా విచ్చుకునే తొలి కిరణం. అప్పుడే వెదురు గూటి లోనుండి ఆహార అన్వేషణకు వెళ్ళే తల్లి పక్షికి వీడ్కోలు పలికే బుల్లి పిట్టల  స్వరం. 

ఈ స్వరం మనని మన లోని  ప్రకృతి ఘడియల్ని  స్ప్రుజించే మేల్కొల్పు. సైలెంట్ వ్యాలీ ఉద్యమ కవిత్వం అంటే కాల్ అఫ్ నేచర్.
Tuesday 10 February 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-21

మనమిప్పుడు సామాజిక,సంస్కృతిక,రాజకీయ,సిద్ధాంతాల పలు మార్పుల స్ధితిలో వున్నామన్నదాన్ని కాదనలేము. సామజిక తీరుతెన్నులు,అవి నూతన ఒరవడులను ఒకదానిదో ఒకటి ఏవిధంగా సాగుతున్నాయన్నది కేవలం విద్యావేత్తల అధ్యయనాలకే పరిమితంకావడం లేదు. మన నరనరాల్లోకి మనకి తెలియకుండానే ఇంకిపోతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా జీవించడమే మనం అనుభవిస్తున్న ఘర్షణ.ఈ విషయాన్ని పర్యావరణానికి అతీతంగా భావించడమే మనం చేస్తున్న లోపం. వీట్ని గ్రహించి సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో రచయితలు తమ రచనల్ని కొనసాగించారు.భౌతిక పర్యావరణాన్ని కాపాడడం కోసం విలువల ప్రాముఖ్యతను చెప్పారు. సామాజిక అంశాల్నిశాస్త్రీయ అంశాలతో జోడించారు. ఇది పర్యావరణీయం అయ్యింది. వీరు ఉద్యమంలో చేరేసరికి ఉద్యమం తీవ్ర స్ధాయికి చేరింది, ఆ వేగాన్ని వీరు మరింత పెంచారు. ఇది సాహిత్య పర్యావరణీయం అయ్యింది. వైకం బషీర్,యస్.కే. పోట్టేకర్,ఓ,వీ. విజయన్, కే.భాస్కరన్ నాయర్, సుకుమర్ర్ అజ్హికోడే వంటి వారు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. వివిధ ప్రయోగాలు చేసారు అందులో భాగంగా  1983లో 34 కవితలతో కూడిన వనపర్వం అన్న కవితా  సంపుటిని ప్రచురించారు. సుగత కుమారి గారు సైలెంట్ వ్యాలీని దట్టమైన,చల్లని, జీవం ఉట్టిపడుతున్న ప్రదేశం, భూమి వ్యక్త పరిచిన అత్యత్భుతమైన భావన అంటారు. ఆ భావాలన్నీ వనపర్వంలో చోటుచేస్కున్నాయి. వనపర్వం అన్న శీర్షికకి స్ధానికులు సైలెంట్ వ్యాలీ గురించి చెప్పే కధకి పోలిక వున్నది. ఈ ప్రాంతాన్ని సైరంధ్రి వనం అంటారు. ద్రౌపది కి వున్న మరో పేరు సైరంధ్రి. వనవాసమప్పుడు పాండవులు ఇక్కడ కొంత కాలం గడిపారని వారి నమ్మకం. కాలక్రమేణా బ్రిటిష్ వారి కాలం వచ్చే సరికి సైరంధ్రి వనం సైలెంట్ వ్యాలీ గా మారింది.  చిత్తూరు జిల్లాలోని మదనపల్లి దగ్గర వున్న ఏనుగు మల్లమ్మ కొండ కూడా  బ్రిటిష్ వారి పుణ్యామా అని హార్స్లీ హిల్స్ గా మారింది. అలా చాలా ప్రాంతాలని వారు మార్చారు. ఈ ప్రాంతాన్ని  చిపింగ్ సిడా అన్న అడవి  క్రిమి వల్ల కూడా సైలెంట్ వ్యాలీ అన్న పేరు వచ్చింది అన్న నానుడి కూడ వుంది.
 ఒక ప్రాంతాన్ని భౌతికంగా ఆక్రమించడానికి దాని చరిత్రను మార్చాలి ,అది నామధేయాన్ని మార్చడం వల్ల చాలా తొందరగాను ,అనుకున్న ఆశయాన్ని సాధించడంలో ప్రయోగాత్మకంగా సంభవిస్తుంది. వనపర్వం పర్యావరణ చరిత్రను  తిరగరాసే ప్రయత్నం చేసింది. ప్రకృతికి సంబంధించిన సాహిత్యంలో   బైయో సెన్ ట్రిసం, ఇకో సెన్ ట్రిసం, ఎర్త్ సెన్ ట్రిసం అన్న ధృక్పధాలు వున్నాయి తరచూ ఒకదానికి ఒకటి పర్యాయంగా   వాడుతారు. ఇవి ప్రస్ఫుటంగా థియో సెన్ ట్రిసం, హ్యూమన్ /ఆంత్రాపో సెన్ ట్రిసం ధృక్పధాని కి విభిన్నంగా ప్రయోగిస్తారు.
బైయో సెన్ ట్రిసం భూమి పైనున్న అన్ని  జీవ,నిర్జీవ వ్యవస్ధాలకు సమాన భావాన్ని అపాదిస్తాయి, ఇకోసేన్ ట్రిసం ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని. ఆంత్రాపో సెన్ ట్రిసం మనషులను ప్రధానంగా పరిగణించి మిగతా జీవరాశులను మనుషులకు ఉపయోగపడే వనరులుగా పరిగణిస్తుంది. ఇది ఇకోసేన్ ట్రిసంకి విరుద్ధమైనది.మానవజాతిని విస్మరించలేము కాని మనవ మనుగడ అన్నది ప్రకృతిలోని మిగతా జీవ రాసుల పైన ఆధారపడి వుంది. ఇకోసేన్ ట్రిసం అంటే జీవ వ్యవస్ధ కేంద్రంగా ఊహాజనకంగా ప్రతిష్టించడం ,కేవలం మనుషుల్ని కీలకంగా కాదు. ఇకోసేన్ ట్రిసంకేంద్రం అన్నది అంటూ ఏమి వుండదు, ఒక స్పెషల్ స్పేస్ లో, కేంద్ర బిందువుకి ,చివరి అంచులకి మధ్యన తారతమ్యాలంటూ వుండవు,ముందు వెనకకు కూడా. (కేర్దిజ్). దీనిని అర్ధం చేసుకునప్పుడు మానవుడు ప్రకృతిలో ఎంతపాటి భాగమన్నది అర్ధం అవుతుంది.
సాహిత్యం ద్వారా కేవలం సైలెంట్ వ్యాలీ అంశాలనే కాక ప్రకృతి మానవ మనుగడ గురించి విశిష్టంగా ప్రకృతి సంరక్షణ,సుస్ధిర జీవనం అన్న నినాదం తో ప్రకృతి సంరక్షణ సమితి పని చేసింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రచారానికి కేరళ నలుమూలల వివిధ కళా రూపాల ద్వారా ప్రచారం చేసారు. 1980 జూన్,6 వ తేదీన కవులను సత్కరించారు. ప్రముఖ కవులు కవితలు చదివి పర్యావరణ విశిష్టతను చెప్పారు. సైలెంట్ వ్యాలీ సంరక్షణకు వివిధ స్ధాయిల్లో సమితి కృషి చేసింది. అందులో సుగత కుమారి గారు ప్రముఖ పాత్ర పోషించారు ,ఆమె రచించిన మరతిను స్తుతి’(వృక్ష గీతం) విశిష్ట ప్రాచుర్యం  పొందింది. ఈ కవితలో ఆమె చెట్టుని, భూమిని కాపాడడానికి  విషం తాగిన శివుడిగా వర్ణిస్తారు. నేను అతనిని పూజిస్తాను/ ఎవరైతే శ్వాస గాలినిస్తారో/ విషం తాగి/నీలకంటుడిలా(5-8). ఇదంతా పాటకుడికి కిరణజన్య సంయోగంగా అనిపించవచ్చు. ఈ కవిత ప్రకృతి సమతుల్యతను శాస్త్రీయంగా వివరిస్తుంది. ప్రకృతిలో చెట్టు పాత్రను ,అది మానవ మనుగడకు చేసే ఉపయోగాలను.
నువ్వు  మా
తల్లి భూమిని వరదల నుండి రక్షిస్తావు
నేలను పునర్జీవింప చేస్తావు
నువ్వుఅమృతాన్ని భద్ర పరుస్తావు
దివినుండి భువి కి వస్తున్న దానిని
ఉబుకుతున్న నీ గుండెల్లో(౩౩-40,పంక్తులు)
భూమి ఏమైనా ఆడుకునే బంతా లేక ఆడుకునే బొమ్మా! (43-44 పంక్తులు)

ఈ కవితలో భూమి కున్న ఓపికను పరిక్షించొద్దని హెచ్చరిస్తారు. దీని ద్వారా  ప్రకృతి మన తల్లి ,ఆమెని పూజ్య భావంతో, ప్రేమతో దరి చేరమని  చెపుతారు. మన చర్యలు విధ్వంశంగా వుంటే ప్రకృతి ప్రతిచర్యలు అదే విధంగా ఉంటాయిఇది అర్ధం చేస్కునే సునిశిత మనకు అవసరం.
Tuesday 3 February 2015 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-20

కవిత ఒక భద్రమైన శక్తి,ఒక అనధికార ప్రకంపన,ఓ జీవం,ప్రవాహంలోని సుడి,కవితలు జీవనాన్ని సుస్థిరం చేసే మూల మార్గాలు.కవితలు ప్రకృతి అవశేషాలను పోలిన అక్షర మాటల దార్లు (భద్రమైన శక్తి),అవి పునరావృతమయ్యే ప్రకృతి శక్తి జన్యు వనరులు.ఊహ,బాష కవలల మాతృక కలయిక నుండి, వాటంతటవే నిరంతరం ఉద్భవిస్తుంటాయి, ఈ నిర్వచనం  లిటరేచర్ అండ్ ఎకాలజీ గ్లాట్ఫెల్టి ఎడిటెడ్ పుస్తకం   లోనిది.ఈ నిర్వచనం ఇకో సేన్ ట్రిసం దృక్పదంతో ముడిపడింది.
  ఈ నిర్వచనం సైలెంట్ వ్యాలీ ఉద్యమ సాహిత్యానికి  జీవం పోసింది. ముఖ్యంగా పర్యావరణ కవిత్వం ఒక ఉద్యమ రూపం దాల్చడం సైలెంట్ వ్యాలీ సంరక్షణలో  కనిపిస్తుంది. కేరళ శాస్త్ర సాహిత్య  పరిషత్, 1979 లో సైలెంట్ వ్యాలీ సంరక్షణ అన్న నినాదంతో వుపందుకుంది. ఈ సంరక్షణలోని పరిషత్ సభ్యులు అన్ని వర్గాలకు చెందినవారున్నారు.వీరు 7000 వేల సంఖ్యలో ఉన్నారు. ఇందులో సాహిత్య కారులు ముఖ్య భూమిక పోషించారు.కధకులు,నవలాకారులు,కవులు అందరూ ఏకమయ్యారు. వీరు వివిధ వర్గాల వారైనప్పటికీ వారిని కలిపింది సేవ్ సైలెంట్ వ్యాలీ అన్న నినాదం.పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో జీవ వైవిధ్యం ఎలా కలిసి వుందో అదే విధంగా వివిధ సాహిత్య వైవిధ్యాలు కలగలసి ఏక గీతాన్ని ఆలపించాయి. ఇకోసేన్ ట్రిసం ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని.అందుకే కవిత అన్నదానికి విశాల అర్ధం అన్ని ఊహాజనిత మార్గాల ఉత్పత్తి ప్రక్రియ. దీనినే భారతీయ సనాతన సాహిత్య కారులు మానసిక  శక్తులను సృజనాత్మక రూపంలో విడుదల చేయడం అన్నారు.ఇది జరగాలంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం అన్న వాస్తవాన్ని తెల్సుకోవడమే కాక మనలోని సునిసితను పెంచుకోవాలి.అప్పుడు సాహిత్యం ఒక నిర్జీవమైన పుస్తకంగా మిగిలిపోదు.భిన్న స్వర వచనం  (పోలిఫోనిక్) లేక  ముఖ్యమైన అసంఖ్యాక ( ప్లూరి సిగ్నిఫికంట్) స్వరాల గళం అవుతుంది,అందులో రచయిత/రచయిత్రి,విశ్లేషకులు, పాటకులు, మధ్య పరస్పర చర్య అవుతుంది.సనాతన భారతీయ తర్కశాస్త్రం అనుసారం ప్రపంచ మనుగడకు ఒకరిమీద ఒకరికి ప్రేమ మూలం. మూలాన్నే అద్వైతం పేర్కుంటుంది. ఈ ప్రేమను  కేవలం కవితలు ద్వారానే చెప్పాల్సిన  లేదు ,సైలెంట్ వ్యాలీకి సంబంధించి పెట్టుకున్న  కేరళ హై కోర్టుకు మొదటి పిటిషన్ రాసింది కవి సుజాత దేవి. అది ఒక కవితాత్మ రూపంలోనే ప్రస్తావించింది.
సైలెంట్ వ్యాలీ అద్భుతమైన భూమికవిత
దానికి ప్రత్యేకమైన భౌగోళిక పరిస్ధితులతో బాటు
ప్రకృతి పరమైన స్థితిగతులు వున్నాయి.
దీని  ప్రత్యేక విశిష్టతలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది
ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి .ఆధునిక పర్యావరణ సాహిత్యానికి ,సాంప్రదాయ పర్యావరణ సాహిత్యానికి తేడాలలో కీలకమైనది, కి స్టోన్ ప్రకారం ఎన్విరాన్మెంటలిజం (పర్యావరణీయం).అన్నది పారిశ్రామిక సంస్కృతి నుండి పుట్టింది. ఇది అనాదిగా మానవ సమాజాలు చేతుల్లో బలవుతున్న  ప్రకృతిని సంరక్షించుకోడం కోసం ఉద్భవించే వ్యతిరేక నినాదం. స్లేమేకర్ అనుసారం పర్యావరణ సాహిత్య, పర్యావరణ విశ్లేషకులు తమ మనోభావాల్ని రాజకీయ స్ధైర్యంతో ,ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతిని యాంత్రికంగా మార్చుతున్న తీరుని ఖండిస్తున్నారు. సాంప్రదాయకమైన ప్రకృతి సాహిత్యం లోని జ్ఞానం ప్రస్ఫుటంగా ప్రకృతి విధ్వంసాన్ని భరించే తీరుని వెల్లడించడంలో తన ఛాయల్ని పూర్తి స్థాయిలో చాటి చెప్పలేదు. అవి పూర్తి స్ధాయిలో పర్యావరణ స్పృహని వ్యక్తపరచలేదు, చాల మటుకు ప్రాంతీయ ,జాతీయ స్థాయికే పరిమితమయ్యాయి , ముఖ్యంగా పర్యావరణ సాహిత్యం భౌగోళికమైనదన్నది ఆయన ప్రస్తావన. ఈ ప్రస్తావనల్ని పూర్తీ స్ధాయిలో ఖండిచలేo. సైలెంట్ వ్యాలీ విషయంలో రెండు ప్రధాన ధోరణులు ద్వారా ఉద్యమం నడిచింది. ఒకటి శాస్త్రీయ నినాదాల ద్వారా ,రెండు సాహిత్యం ద్వారా. పర్యావరణ విషయంలో ఎప్పుడూ శాస్త్రీయ వాదనలదే పై చేయి, సాహిత్యాన్ని కేవలం ఊహాజనికంగా,భావావేశంగా జమ కట్టి పట్టించుకోరు. శాస్త్రీయ జ్ఞానం జనాలకి అర్ధం కాదు,కోర్టు కచేరి వ్యవహారలు అసలు అర్ధం కావు. ఈ రెండు వ్యవస్ధలే పర్యావరణ అంశాల పై నిర్ణయం తీసుకునేవి. ఈ రెండు వ్యవస్ధల్లో స్ధానిక జనాలకి చోటు లేనప్పుడు ,అక్కడ చోటుకి మార్గం ఏర్పరిచే సాధనం సాహిత్యం. ఇది నిశబ్దంగా ఈ  ఉద్యమంలో ఏర్పడింది. అందులోను కవిత్వాన్ని కోర్టులో కచేరి చేయడం చాల అరుదు. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలోని మరో ప్రత్యేకత అక్కడ జనావాసం నామ మాత్రమే, మరప్పుడు అడవిగోడు విన్పించేందుకు సాహిత్యకారులు ఏకమయ్యారు, బహుశా అందుకే వర్గ వైరుద్ధ్యాల్ని పక్కన పెట్టారేమో.
సైలెంట్ వ్యాలీ హైడ్రో ప్రాజెక్ట్ నినాదం అడవి మొత్తం సమాజంది. కేవలం, పారిశ్రామికవేత్తల్ది,మార్కెట్ది కాదు, ప్రత్యక్షంగా అక్కడ నివసిస్తున్న వార్ది,వారి మనుగడది. వీట్ని గుర్తించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే  కాదు, ప్రకృతికి,మనిషికి వున్న ప్రేమ పూరిత సహజీవనానిది.
ఈ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సాహిత్యకారులతో ఏర్పడిన ప్రకృతి పరిరక్షణ సమితి క్రియా శీలక పాత్ర వహించింది. వారు ఉద్యమాన్ని నడిపిన తీరుని  ఎందుకో తుకారాం పలుకుల్లో చెప్పాలని...
పదాలొక్కటే
నా దగ్గరున్న ఆభరణాలు
పదాలొక్కటే
నేను ధరించే దుస్తులు
పదాలొక్కటే ఆహారం
నాకు జీవితానిచ్చేది
పదాలొక్కటే సంపద
నేను జనానికిచ్చేది
-అంటాడు తుకా
పదాలను దర్శించు
అవి దేవుళ్ళు
నేను వాట్ని
పదాలతో పూజిస్తాను.
(సెయింట్ తుకారం)
(అనుసృజన)
ఇటువంటి పదం బాటలో నడిచిన పర్యావరణీయ కవితోద్యమo  సైలెంట్ వ్యాలీ. చాల బలంగా పరివ్యాప్తి చెందుతున్న పారిశ్రామీకరణ,శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం,మార్కెట్ అన్నవి ప్రకృతిని త్వరితంగా  కబళిస్తున్నాయి.కాని ప్రకృతి తన ప్రాంతీయ ఉనికి వల్ల భౌగోళిక పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తున్నదన్న సత్య వాక్కు అంతగా పరివ్యాప్తి చెందడం లేదు. ఓ ప్రాంతంలో మనం చేసేది  తప్పో,ఒప్పో అన్న ప్రస్తావనకి అతీతంగా చర్చించే ప్రాంతంలో కలయిక కోసం కవిత్వ గళం నుండి జరుగుతున్న  సాహిత్యాభివృద్ది ప్రక్రియ పర్యావరణ కవిత్వం. ఇది నిశబ్దంగా భూమంతా ప్రతిధ్వనిస్తున్న  నేలాకాశ వాక్కు ... సుజాత కుమారి కేరళ కౌముది అన్న పత్రికలో 
కాలం చేజారిపోతోంది
గొడ్డలికోత కొనసాగుతోంది
అడవికి నిప్పంటించారు
అడవి చేతులుచాచి అరుస్తోంది

ఇది చదువుకుని ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి నిరంతరం కొనసాగే అడవి రక్షణ పోరాటాన్ని తన జీవిత ఆశయంగా తీసుకుంది.ఈ పోరాటంలో ఆమె సైనుకురాలైనందుకు గర్వపడింది. తనతోటి రచయితల్ని ఇందులో భాగ్యస్వాముల్ని చేసింది.ఎందుకంటే ఆమె గట్టి నమ్మకం ప్రజల భాషని తెలిసి ,బాగా పలికే వారు శాస్త్రజ్ఞులు కాదు రచయితలని. అదే  ప్రకృతి పరిరక్షణ సమితికి బీజం వేసింది. దీని ఆశయం కేవలం మానవ మనుగడే కాదు, ప్రకృతి వ్యవస్ధల సుస్తిరత. ఆమె వాంగ్మూలాన్ని వచ్చే వారానికి వాయిదా వేస్తూ, శెలవు...