Tuesday 24 March 2015 By: satyasrinivasg

మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-27

బ్రిటిష్‌ కాలంలోనే  ఆంధ్రప్రదేశ్‌లో, అరకులో ఖనిజాల శ్యాంపుల్‌ తీసుకున్నారు. అరకు, అనంతరగిరి ప్రాంతాల్లో గాలికొండ, రక్తకొండ ప్రాంతంలో బాక్సైట్‌ ఖనిజాల తవ్వకాల వల్ల సుమారు రెండు వందల గ్రామాల్లోని వెయ్యిమంది గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా నష్టం వాటిల్లుతుంది. దీనికి వ్యతిరేకంగా 1992 నుండి పోరాటం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఉద్భవించే సహజ ఊటల నీరు గోస్తానీ నది ద్వారా పల్లపు ప్రాంతానికి చేరుతుంది. విజయనగరంలోని తాడిపూడి రిజర్వాయర్‌కు ఇదే ఆధారం. 1/70 చట్టం, పీసా. అటవీ హక్కుల చట్టం, సమత తీర్పు అన్నింటిని ఉల్లఘించి ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు గనుల తవ్వకానికి లీజులు ప్రతిపాదిస్తోంది. కంపెనీ వారు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఏదో రీతిలో గనుల తవ్వకం చేపట్టాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక యువకులకు డబ్బులు ఎరచూపి పోరాటాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కథ కూడా అదే. వ్యతిరేక గొంతులను నక్సలైట్లన్న పేరుతో కేసులు బనాయించడం, ప్రభుత్వం, కంపెనీ వారు నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం ప్యాకేజీలు ఇస్తారో అన్నది మీమాంస .
ప్యాకేజిల్లో మనలో ఇమిడిపోయిన మన చుట్టు పక్కల  ప్రకృతి నష్టపరిహారంగా లభించదన్నది వాస్తవం.ఇది మన నుండి మనని ఎలియనేట్ చేస్తుంది.అంతర్లీనంగా మనలో మనం నిర్వాసితుల శిబిరంలో వున్నట్లు జీవిస్తాం. ఇది ఎలా అంటే...
విశాఖ జిల్లా అనంతగిరి మండలం ,వోలాసి పంచాయతిలోని నిమ్మలపాడు గ్రామంలో బాక్సైట్ మైనింగ్ చేపట్టే ప్రాంతం. 1994 లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రాత్రంతా  ఊర్లో వాళ్ళతో  మైనింగ్ విషయం పైన చర్చలు జరిగాయి. ఊర్లోని పెద్దలు మైనింగ్ కి  వ్యతిరేకంగా , యువకులకు  ఉద్యోగాలు దొరుకుతాయన్న మీద రాత్రంతా జరిగిన చర్చలకు ముగింపు దొరకలేదు. మర్నాడు కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళుతునప్ప్పుడు ఆ వూరి పెద్దాయన అందరితో  చుట్టూ పక్కల వున్న ప్రకృతిని చూపిస్తూ అన్న మాటలు “ఈ కొండ, ఈ వాగు, ఈ వంక, ఈ చెట్టు ,ఈ నేలలో దేవుడున్నాడని పూజించం, అవి మనకి బతకడానికి తిండి,గాలి, నీరు నిస్తాయని పూజిస్తాం, అందుకే వాట్టిల్లో దేవుళ్ళు వుంటారు, వాటిని అమ్మడం అంటే మనని మనం  అమ్ముకోవడమే”. ఈ మాటలు ఎంగెల్స్ తన డైలెక్ట్స్ఆఫ్ నేచర్ లోను ధ్వనిస్తాయి. ఈ పెద్దాయన వల్ల  పొందిన స్పూర్తి నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. మైధాలజిని మతంతో జమకట్టకూడదన్న విషయం కుడా అప్పుడే నాకు బాగా అర్ధమైంది.
ఈ విషయాల్ని మిత్రులు చిక్కటి పచ్చదనమున్న టి. శివాజీ గారి తో చెప్పుకున్నా. అయన దీనికి ఒక కధ రూపం, డైలాగులు రాశారు, వాటికి మిత్రులు రాజు గారు బొమ్మలు వేశారు. అది వార్త పత్రికలో వచ్చే లింగా ది గ్రేట్ అన్న కామిక్ సీరియల్ లో అరకు లో అల్లుడు  అన్న శీర్షిక కింద నవంబర్- డిసెంబర్,1996లో అచ్చయ్యింది. బహుశా సమకాలీన పర్యావరణ ఉద్యమాల గురించి ప్రపంచంలో, మన దేశంలో ఒక సీరియల్ గా  అచ్చయిన, అరుదైన కార్టూన్ సీరియల్  ఇది.ఒకసారి మాటల్లో శివాజీ గారన్నారు ఇది చాల భారతీయ బాషలలో కూడ అనువదించబడిందని.
నిమ్మలపాడు గోడు నిమ్మలపాడుకే  పరిమితం కాలేదు, కొండ దేవుడి మాటలు పల్లపు ప్రాంతంలో కూడ విన్పించాయి. మాతో బాటు సేలం కి వచ్చిన దేవుడమ్మ,కడప మిత్రుడు విజయ్ కుమార్  ఇదే గోడుని ప్రస్తావించారు.
శృంఖలాల కోట...
దేవుడమ్మ(టి.వి.9, నవీన మహిళ అవార్డు గ్రహీత) . తల్లిదండ్రుల్ని తాటిపూడి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నిర్వాసితుల్ని చేశారు. ప్రస్తుతం వారు విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట మండలం,కిలతంపాలెం పంచాయతీలోని రామన్నపాలెంలొ  ఉంటున్నారు. ఆమె తల్లి దండ్రులు జొన్నలుసోళ్లుదినుసులు పండించేవారు. ఆమె తన పొలంలో వరి,పెసరలుమినుములుచెరుకు పండిస్తోంది. అంతా సజావుగానే ఉంది. ఇక ఇన్నేళ్ళకు స్థిరపడాం,భవిష్యత్తు బాగానే ఉంటుంది అనుకుంటున్న కాలంలో జిందాల్‌ కంపెనీ ప్రవేశం. ఒక రోజు వూర్లో ప్రభుత్వ అధికార్లు భూమి సర్వే మొదలు పెట్టారు. ఇది చిన్న పిల్లలు చూసి తల్లిదండ్రులకు చెప్పారు. గ్రామస్థులందరు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా అధికార్లు ఇక్కడ కంపెనీ వస్తుంది మీకు ఉద్యోగాలొస్తాయని అన్నారు. ఎకరానికి 75,00 రూపాయలు నష్టపరిహారమిస్తామన్నారు.. ప్రజలందుకు ఒప్పకోలేదు. ఎంఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ప్రభావిత మూడు పంచాయితీల గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. కంపెనీ వల్ల లాభాలు వివరించారు.  యింటికొక్కరికి ఉద్యోగo, పది సెంట్ల ఇళ్ళ స్థలంఉచిత కరెంట్‌నీరు అందిస్తామన్నారు. ఎకరానికి 1,25,00 రూపాయలు ఇస్తామన్నారు. ప్రజలు డబ్బు వద్దుకావాలంటే మీ జీతాలు పెంచుకోoడి, వేరే దేశం పొండిమేం మటుకు భూములు వదలం అన్నారు,అయితే మా పొలాలకు తాడిపూడి రిజర్వాయర్‌ నీరు ఇవ్వండి అని కూడా అన్నారు.
                ఇది జరిగిన తర్వాత గ్రామస్తులకు భూసేకరణకు సంబంధించి ఎ-నోటీసులొచ్చాయి. గ్రామస్థులెవరూ తీసుకో లేదు. అధికార్లు వాటిని గ్రామంలో గోడలకు అతికించి వెళ్ళారు. నోటీసులు తీసుకోకపోతే వారిపై కేసులు పెడతామనితీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్త్తుందని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ప్రజలు భూములివ్వలేదు. బాక్సైట్‌ వ్యతిరేక పోరాట కమిటి అన్నది ఏర్పరచుకున్నారు. ఇందులో మొత్తం 50 మంది సభ్యులు, 20 మంది పురుషులు, 30 మంది మహిళలు. ఈ కమిటీని చెల్లాచెదరు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం వారిలో కొందర్ని విడిగా పిల్చి రహస్య చర్చల ద్వారా ఆశలు రేపింది. ఫలితం కొందరు విడిపోయారు. తర్వాత కీలకపాత్ర వహిస్తున్న ఐదుగురు మహిళలతో ఇదేవిధమైన మంతనాలు జరిపారు. ఫలితం ఇద్దరు మహిళలు వెళ్లిపోయారు. దేవుడమ్మకు 3.75 ఎకరాల భూమి రసీదు తీసుకు వచ్చి ఇచ్చారు. ఇందులో సర్వే నెం:131 అన్నది రాసి ఉంది. ఈ ప్రలోభాలకు ఆమె  లొంగలేదు. ఆమె భర్తని విడిగా తీసుకెళ్ళి మంతానాలు జరిపారు. ఆయన ప్రతికూలనగా లొంగిదేవుడమ్మ మీద వత్తిడి తీసుకు వచ్చాడు. అయినా ఆమె  లొంగలేదు. పోరాటం కొనసాగిస్తూనే ఉంది. పోరాటం సాగిస్తున్నవారoదరూ భూ నిర్వాసిత కమిటీగా ఏర్పడి పది రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఆ కాలంలో ప్రభుత్వ అధికార్లు వీరి భూముల్లో మళ్ళీ సర్వే చేశారు. ఇది గ్రహించిన గ్రామస్థులు కొందరు అధికార్లను గ్రామంలో కట్టేశారు. ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆ తతంగం కొనసాగింది. చివరకు గ్రామస్థుల భూముల జోలికి రాము అన్న లిఖిత పూర్వకంగా ఒప్పందం మీద అధికార్లను విడిచిపెట్టారు. ఇది జరిగిన పది రోజులకు గ్రామస్థులు ఎంఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికార్లు, 41 మందిని సబ్‌ జైల్‌కు తరలించారు. చివరకు వారిని కండిషనల్‌ బెయిల్‌పై విడుదల చేశారు. వీరు తమ గ్రామంలోని తమ కుటుంబీకులతో కలవ కూడదన్నది షరతు.  దేవుడమ్మ మీద కూడా కేసులు పెట్టారు. ఆ కాలంలో దేవుడమ్మకు సమత సంస్థ అండగా ఉంది. గతంలో కనిపించిన రాజకీయ పార్టీల నుండి తగిన సహకారం అందలేదు. లోక్‌ సత్తా,బీజేపీరాష్ట్ర నాయకులు ఆమె గ్రామాన్ని ఈ సందర్భంలో సందర్శించినప్పుడు స్థానిక నాయకులు కనుచూపు మేరలో కనిపించలేదు.
                ప్రభుత్వం మూడు పంచాయితీలలో సుమారు రెండు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అందులోని కొంత  భాగంలో ప్రహరీ గోడను నిర్మించారు. కొన్ని చోట్ల ఈ భూమిపై ఎవరైనా అడుగు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోనాల్సి వస్తుంది అన్న హెచ్చరిక బోర్డులు పెట్టారు. వాట్ని గ్రామస్తులు పెకిలించి” గిరిజనుల భూములపై అడుగుపెడితే వారికి సమాధి కడతాంఅన్న హెచ్చరిక బోర్డు పెట్టారు.
పబ్లిక్‌ హియిరింగ్‌కు ముందుగానే భూముల సర్వే చేపట్టారు. ముందుగానే కంనెనీ తన మనుషుల చేత గ్రామంలో డబ్బులు వెదజల్లింది. కంపెనీప్రభుత్వం కలసి తమకనుగుణంగా పబ్లిక్‌ హియిరింగ్‌ చేయాలన్న ప్రయత్నం చేసింది. ప్రజలు పబ్లిక్‌ హియిరింగ్‌లో తమ గోడు వినిపించారు. ముఖ్యంగా మహిళలు. అయినా ప్రభుత్వం కంపెనీ మాటలకే అనుమతి మంజూరు చేస్త్తోంది. దేవుడమ్మ గనులకుకంపెనీకి వ్యతిరేకంగా చేస్తున్న నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది.

గడప గడపకి ఇదే వ్యధ...
 కడప జిల్లాలోని పులివెందులలో యురేనియం మైనింగ్ కధ: పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో యు.సి.ఐ.ఎల్‌. వారు యురేనియం మైనింగ్‌  ప్రాజెక్టు మెదలుపెట్టారు. దీని వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు తుమ్మల పల్లె, మబ్బుచింతలపల్లె,  భూమయ్యగారి పల్లె, రాచకుంటపల్లె,  మీదిపెంట్ల కోట,  కనం క్రింద కొట్టాలు.

ఈ ఆరు గ్రామాల్లో 80%  మంది వ్యవసాయ భూములున్నవారే. వర్షాధారంబావులుబోరుబావుల కింద పంటలు సాగుచేస్తారు. ప్రతీ గ్రామంలో పశుసంపద ఆవులుబర్రెలుమేకలుగొర్రెలున్నాయి.  మైనింగ్‌ ప్రాంతం 6 గ్రామాలకు మధ్యలో  తుమ్మలపల్లె లో వుంది. పులివెందుల నుండి అనంతపురం జిల్లా కదిరి  బస్సు రోడ్డు దగ్గర టెయలింగ్‌ పాండ్ ఉంది.
 ఇక్కడ రైతులు వేరుశెనగకందిఆరికకొర్రధనియాలునువ్వులుశెనగఆముదాల పంటల్ని వర్షాధారంతో సాగుచేస్తారు.  అరటిచీన (బత్తాయి)దానిమ్మచిన్న నిమ్మమిరప పంటలు బావులుబోరువావుల ద్వారా పండిస్తారు.

భూగర్భజలాలు 120 అడుగుల నుండి 200 అడుగులలోతులో  బోర్లు వేస్తారు. కరెంటు మోటార్లు 130 అడుగుల నుండి 160 అడుగుల మధ్యలో బిగిస్తే మంచినీరు పంట పొలాలకు సమృద్ధిగా వస్తాయి.
          ఈమైన్స్ కు అతి సమీపంలో రిజర్వ్‌ ఫారెస్టు ఉన్నందువల్లఇక్కడ నుండి రాచకుంట పల్లెకు ఊటనీరు పారుతుంది,  తుమ్మలపల్లె,మబ్బుచింతలపల్లెకు మధ్యన రిజర్వ్‌ ఫారెస్టు నుండి ఊట నీరు పారుతుంది. ఈ ఊటనీటిని గ్రామాల పశువులువ్యవసాయ కూలీలు ప్రతినిత్యం తాగుతారు. అలాగే మీదిపెంట్ల కోట దగ్గర నిరంతరం ఊటవంక పారుతుంది. ఈ నీటిని భూమయ్యగారి పల్లెమీదిపెంట్ల కోట పశువులుపశువుల కాపర్లువ్యవసాయ కూలీలు తాగుతూ ఉంటారు. ఈ గ్రామాల ప్రజలు ఇక్కడ బట్టలు ఉతుక్కుంటారు.
          యు.సి.ఐ.ఎల్‌. కంపెనీ యురేనియం మైనింగ్‌ ఓపెన్‌ కాస్ట్‌ పద్ధతిలో  జరుగుతుంది600 అడుగులు మైన్స్‌ తవ్వడం వల్ల నిరంతరమూ పారే ఊట వంకలు పూర్తిగా కలుషితమై ఎండిపోతాయి. యురేనియం శుద్ధి చేయు ప్రాంతం ఈ 6 గ్రామాల మధ్యనే  గాలి ద్వారా పర్యావరణం పూర్తిగా పాడవుతుంది. భూగర్భ జలాలు కలుషితమవ్వడమే కాకవ్యవసాయదారులు వేసుకున్న బోరుబావుల నీరు కలుషితమవుతాయిపూర్తిగా ఎండిపోతాయి.
          కొద్దో గొప్పో పారే వంకల నీరు కలుషితమైపోయిపశువులుఅడవి జంతువులు ఈ నీరు తాగి అశ్వస్ధతకు గురికావడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. ఈ ఊట వంకలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అంతేకాక 6 గ్రామాల్లోని 3,382 మంది జనాభా అనారోగ్య పాలయ్యే అవకాశాలు కోకొల్లలు.

పర్యావరణ విధ్వంసం ఒకే ప్రాతానికి పరిమితమవ్వదు, అంతటా పరివ్యాప్తి చెందుతుంది, అక్కడ జరిగింది ఇక్కడ మనకెందుకు అనే వదిలేసే గుణం సమాజంలో వున్నా, ప్రకృతిలో ఆ నైజం లేదు. కవిత కూడా ఒక బాషలో ,ఒక ప్రాంతం లో పుట్టినా అది విశ్వమంతా పరివ్యాప్తి చెందుతుంది, అందుకే అనువాదాలు. కవితలోని సారాంశం విశ్వజనీన మైనప్పుడు ,దానికి భాష అడ్డం రాదు. భావన మనస్సులోని పచ్చదనం పై చిరు  జల్లు కురిపిస్తుంది.
క్యూబన్ కవి నికొలస్ గిగేన్, క్యాన్ యు.. కవితలో అన్నట్టు ( నౌడూరి మూర్తి గారి వ్యాసం కవిత్వంతో ఏడడుగులు 60,కవి సంగమం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు)

నువ్వు ఆకాశాన్ని అమ్మగలవా?...
ఒక్కోసారి నీలంగా,
మరోసారి తెల్లగా ఉండే
ఒక చిన్న ఆకాశం ముక్క.
నీ తోటలో చెట్లతోపాటే కొనుక్కున్నాననుకున్నఆకాశం ముక్క,
ఇంటితోపాటే, ఇంటికప్పుకూడా కొనుక్కున్న వాడిలా...
నాకో డాలరు ఖరీదు చేసే ఆకాశం,
ఓ రెండుమైళ్ళ ఆకాశం,
పోనీ ఓ చిన్న ముక్క
ఎంత వీలైతే అంత
ఆకాశం అమ్మగలవా?
(13-22 పంక్తులు)
ఈ సంఘటనలన్నీ ప్రకృతి వనరుల్ని అమ్మకపు  వస్తువులుగా మార్చే ప్రక్రియను అభివృద్ధిగా  నిర్వచించే కాలం గురించి చెప్తాయి. మనం మన ముందు  తరాలకి ఆకాశంలోని నక్షత్రాలని కూడా  రంగు కాగితంతో కొన్న మరో కాగితపు బొమ్మగా గోడ మీద వేలాడదీసి చూపిస్తాం. ఈ మొత్తం క్రమంలో ఒకటి మాత్రం నిజం- మనలోని అవయవాలు కూడా రంగు కాగితాల సంతలో ముడి సరుకులే!

నాకు కొంచెం మట్టిని అమ్మగలవా?
చెట్లవేళ్ళు చొచ్చుకుపోయిన చీకటిమట్టి,
పోనీ రాక్షసబల్లుల దంతాలూ,
ఏనాటివో అస్థిపంజరాలనుండి
చెల్లాచెదురైన సున్నం అమ్మగలవా?
నాకు భూకంపాలలో సమాధి అయిన అడవులూ,
చనిపోయిన పక్షులూ,
చేపల శిలాజాలూ,
వేలకోట్ల సంవత్సరాలబట్టి లోలోపల ఉడుకుతూ,
పైకి వెదజిమ్మిన అగ్నిపర్వతాల
లావాలోని గంధకాన్ని అమ్మగలవా?
నాకు ఆ అగ్నిపర్వతాల నేలని అమ్మగలవా?
భూమిని అమ్మగలవా? నిజంగా?
(పంక్తులు-43-55)
మట్టి, మట్టిలోనిది, మట్టి పైనది అంతా ముడిసరుకు గా జమ కట్టి నప్పుడు ఆకాశం ఓ నిర్మానుషమైన శ్మశాన వాటిక లానే కనపడుతుంది. అప్పుడు అందులో రెప రెప లాడుతూ  రగిలే చితి మంటల్లో తిరిగే  సూర్యుడు కాటి కాపరిగానే కనిపిస్తాడు.

 దేవుడమ్మ కూడా ఇవే ప్రశ్నల్ని అడిగింది, అలానే ప్రపంచ వ్యాప్తంగా చాల మంది దేవుడమ్మల గొంతులోని గుటకకి అడ్డం పడుతున్న ప్రశ్నలు ఇవే...

అందరి కాళ్ళ క్రిందా నలిగే,
నీదనుకుంటున్న ఈ నేల నాది కూడా.
అది ఎవ్వరిదీ, ఏ ఒక్కరిదీ కాదు.
(పంక్తులు-56-58)
ఈ ప్రశ్నా పత్రమే పర్యావరణ కవిత్వం , వీటికి జవాబులు ఏ ఒక్కరి వల్లే  దొరుకుతుతాయి అన్నది లేదు, కాదు కూడా! పీల్చే గాలి కళ్ళని  తాకితే చెపుతాయి, దేవుడమ్మ మట్టి కాళ్ళ సవ్వడి  వేదాన్ని , ఆ కాళ్ళ కింద ఖననమమవుతున్న జీవ ఘోషని. ఈ ఘోషని శిధిలమవ్వకుండా  ప్రతిధ్వనింప చేయడం పర్యావరణ కవిత్వం.

ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో వనరులని వేగవంతంగా వేలికితీయగల సామర్ధ్యంతో బాటు త్వరగా గ్లోబల్ బిడ్డింగ్ చేయగలం.ఇపుడు జరుగుతున్న భూమి, మైనింగ్ చట్టాల సవరణలు కేవలం కాగితాలు కావు, అవి సామాజిక ప్రకృతి నైసర్గిక  స్వరూపాన్ని మార్చే ఇంధనాలు.ఇవి    భూమినల్లుకున్న మట్టిని దానితో పెనవేసుకున్న ఖనిజ  గుణాన్నిఖననం  చేసే సాధనాలు. ప్రకృతినే మనం  ఖననం చేయడం లేదు, మనలోని ప్రకృతిని కూడా చేసుకుంటున్నాం, మనని మనలోని ప్రకృతి   నుండి దూరం చేసుకునప్పుడు , మనం ముందుగా విక్రయ వస్తువులుగా మారుతాం. దీనిని పరిణామ క్రమంలో ఎదిగామంటే ఆలోచించాల్సిన విషయమే. మనం సోల్ లెస్ నేకేడ్ ఏప్స్ అవుతామేమో! ఈ భూమ్మీదున్న ఎలియన్స్ మనమే కావచ్చు.
వ్యక్తిత్వ అభివృద్ధి జీవితాంతం కొనసాగే చర్య,మనోగతం ఒక కధలా నిరంతరం పరిణతి చెందుతుంది. కాని దేవుడమ్మ లాంటి వాళ్ళకి మటుకు అది పరమపద సోపానం. మైనింగ్ కోసం ప్రయత్నాలు అంతం లేని సీరియల్ కిల్లర్ కధల్లా ఎప్పటికీ కొనసాగుతాయి.
అందుకే మైనింగ్ కి సంబంధించిన పర్యావరణ కవిత్వం ఒక ప్రాసెస్, ప్రోగ్రెస్ డాక్యుమెంటేషన్ లా ,ఒక కోహర్ట్ అధ్యయనం లా వుండాలి. సీక్వెల్ కవితలు రాయాలి.
ప్రభుత్వాలు మారినపుడల్లా మర్చిపోయామనుకున్న మైనింగ్ మళ్ళీ,మళ్ళీ తెర మీదకి  వస్తుంది, అది విశాఖ లోని బాక్సైట్ మైనింగ్ లోనే కాదు సర్వత్రా  జరుగుతోంది. అపారమైన ఖనిజ సంపదున్న నేల  అభివృద్ధి పేర్న ఏర్పడ్డ  యుద్ధ భూమి.అక్కడి  వాళ్ళ కంటే అక్కడ ఎప్పుడూ ఎక్కువగా కన్నేసి  వుండేది ప్రపంచంలోని సమస్త భూమికలు.  అక్కడి వారికి గాలి ప్రశాంతమైన  శ్వాసనివ్వదు. నేలకు పహారా కాసే చౌకి చూపులా ప్రసరితమవుతూ వుంటుంది , ఆ ప్రసారంలోని తరంగాల ఫ్రీక్వెన్సి మనని వెంటాడుతూనే వుంటుంది.







0 comments:

Post a Comment