Tuesday 10 March 2015 By: satyasrinivasg

ప్రజల మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-25

మన దేశంలో అత్యంత ఖనిజ సంపద గల రాష్ట్రాలు అతి పేద రాష్ట్రాలుగా వున్నాయి. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ఆఫ్రికా ఖండంలోనూ అదే పరిస్ధితి. ఈ ప్రాంతాలు అత్యంత దోపిడీకి గురవుతున్న ప్రాంతాలు. నా అనుభవం లో నాకు బాగా తెలిసిన విషయం ఏమిటంటే ప్రకృతి పచ్చగా వుందటంటే ,అక్కడ ప్రజల బతుకులు మాడి మసై పోతాయని.  ఈ ప్రాంతమంతటా గనులు విస్తారంగా వచ్చేస్తున్నాయి.గనుల వల్ల కేవలం ఖనిజ సంపదనే వెలికితీయడం లేదు. స్ధానిక సంస్కృతిని ఖననం చేస్తునారు. అక్కడ అంతా ఓ భయంతో కూడుకున్న వాతావరణం, తిరుగుబాటుకి పునాదులు మొలకెత్తే ఘడియలు చోటుచేసుకుంటున్నాయి.  ఓ 5-6 సంత్సరాల క్రితం తమిళనాడు సేలం లో గనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నా. అందులో  వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన స్ధానిక ప్రజలు, కార్య కర్తలు పాల్గొన్నారు. వారి మాటలు మీ ముందుచుతున్నాను... ఎవరికీ ఏమి తెలియదు. కాని ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో అన్నది స్ఫష్టంగా తెలుసు. కంపెనీ రాకమునుపే మన గూట్లో మనం అజ్ఞానంగా ఉండే వాతావరణం ఏర్పడుతోంది. ఇక కంపెనీ వస్తే ఎటువంటి కాలం ఉంటుందో అన్నది ఉహించుకోవడం పెద్ద కష్టం కాదు.ఇది కేవలం ఒక ప్రాంతం ప్రజల గోడు కాదు, తూర్పు కనుమల నిండా ప్రతిధ్యనిస్తున్న ఘోష.
ఒడిస్సా రాష్ట్రంలో లాంజిగడ్‌ ప్రాంతాలలో, ఆంధ్రా రాష్ట్రంలో అరకు, చింతపల్లి, పాడేరు, ఎస్‌. కోట, కడప, తమిళనాడులోని సేలం, తిరువన్నామలై, గోవా, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘర్, ‌ పశ్చిమ బెంగాల్‌ అంతా ఇంతే. ఒక కొండ పట్టుకుని దారమ్మటే వెళితే దారమ్మటంతా కొండ గోడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఒరిస్సాలో వేదాంత కంపెనీ, లాంజిగర్‌, జార్సిగుడ ప్రాంతంలో అల్యూమినియం కంపెనీలు పెద్దవి. గనుల కోసం ప్రజలకు భూమి వదిలి పొమ్మని నోటీసులు అందాయి. దేవదాని సంగ్రామ్‌ పరిషత్‌, లోక్‌ శక్తి, వంటివి గనులు తవ్వకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇదే ప్రాంతంలో పక్షుల అభయరణ్యాం ఏర్పడానికి ప్రయత్నాలు జరిగాయి. దీని వల్ల 250 గ్రామలు నిర్వాసితుమవుతాయి. గనుల కోసం పబ్లిక్‌ హియిరింగ్‌ జరిగింది. ఇదీ ఒక కంటితడుపు పద్దతిలోనే అయ్యింది. వేదాంత కంపెనీ జార్సిగూడలో బాక్సైట్‌ ఖనిజాన్ని తీసుకుని లాంజిగర్‌లో శుద్దిచేసి కోర్బాలో అల్యూమినయం ఉత్పత్తి చేస్తుంది. జార్సిగూడ నుండి లాంజిగర్‌కి దూరం ఎక్కువ కనుక లాంజిగర్‌కి ప్రత్నామ్నాయంగా నియమగిరి కొండల నుండి ఖనిజాన్ని వెలికతీసే ఆలోచన మొదలయ్యింది. అదే తడువుగా భూసేకరణకు ప్రజలను భూమి వదలాలన్న నోటీసులు,ఈ విషయం మీద స్థానిక డొంగ్రిజాతి గిరిజనులు, దళితలు, సంస్థల నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను అణచివేయడానికి కంపెనీ ప్రయత్నాలలో భాగంగా స్థానిక ప్రజల్ని అరెస్టు చేయించడం, దళితలకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు సృష్టించడం, గూండాలచేత ప్రజల్ని బెదిరించడం వనరుల మీద ఆధిపత్యం ఛలామణి జరుగుతూ వస్తోంది. చరిత్రపుటాల్లో గిరిజనుల వ్యతిరేకతను తిరుగుబాటుగానే చిత్రీకరించారు. ఇప్పుడూ అంతే. ఇప్పుడున్న కొత్త మార్పు ఏమిటింటే ఎన్నికలకు ముందు ఈ సమస్యల మీద రాజకీయ నాయకులకు అపార సానుభూతి, పోరాటానికి చేయూతనివ్వడం, ఎన్నికైన తర్వాత ఆ పోరాటం, ఓ తిరుగుబాటు, ఈ నాయకులే వారి పూర్వ మిత్రుల్ని అరెస్టు చేయిస్తారు. ఇదే మన రాజశేఖర చరితం కూడా చెబుతుంది.
గంధమర్థన పోరు
ఒరిస్సాలోని గంధమర్థన ప్రాంతంలో బాల్‌కో కంపెనీపై తిరుగుబాటు జరిగింది.  ఈ ప్రాంతం హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకు వస్తున్నప్పుడు ఒక్క ముక్క విరిగి గంధమర్థన పర్వతంగా ఏర్పడిందన్నది స్థానికుల నమ్మకం. ఇక్కడ వందల సంఖ్యలో ఔషధ మొక్కలున్నాయి. సుమారు 52 సహజ ఊటలు కొండల నుండి పుడతాయి. అందులో చాలా మటుకు నిరంతరం ప్రహిస్తాయి, 1983లో బాల్‌కో కంపెనీ వారు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. అందుకు ముందుగా ఖనిజ శ్యాంపుల్ని తీసారు. దీని వల్ల కొన్ని జీవజలాలు హరించుకుపోయాయి. ఈ కారణంగా దిగువనున్న గిరిజన రైతుల పంట నాశనమైంది.
కంపెనీలు స్థానిక జల వనరుల్ని తమ అవసరాలకు మళ్ళించుకుంటాయి. దంతేపాడు నుండి నీరు కంపెనీకి మళ్ళించడం వల్ల సుమారు 200 కుటుంబాల గొంతెండిపోతుంది. గనులు తవ్వకం వల్ల కొండల్లో ఉండే ఊటలు తరిగిపోయి క్రమేణా మటుమాయమవుతాయి. నియమగిరి సంరక్షణ సమితి, లోక్‌ సంగ్రాం,ఇతర ప్రజా సంస్థలు వారివారి స్థాయిలో పోరాటం చేస్తునే ఉన్నారు. కలెక్టర్‌, ఎంఆర్‌ఓ కార్యాలయాలు ముట్టడి వగైరా లాంటవి. కంపెనీ వాళ్ళ వాహనాలు మటుకు కన్వేయర్‌ బెల్ట్‌ వరకు వెళతాయి. కానీ ప్రజల్ని మటుకు వారి భూముల్లోకి వెళ్ళనివ్వరు. దిక్కుతోచక వాళ్ళ భూముల్లో....వాళ్ళు ఖైదీలుగా మిగిలుపోతున్నారు. ఎండిన గొంతుతో, ఆకలి తీరని డొక్కలతో అలమటించి పోవచ్చు .అప్పుడు నియమగిరి పర్వతంలోని మొక్కలే వీళ్ళని తిరుగుబాటు చేసేందుకు తగిన బలాన్నిస్తాయి.
ఆ గొంతుల్లోనుండి వచ్చే పాట, కాశీపూర్ బాక్సైట్ మైనింగ్  వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనుల నాయకుడు  భగవాన్ మాజీ ప్రేరణతో  సునీల్ మింజ్,విండో కుమార్ సహకారంతో మేఘనాథ్ రాసిన పాటలా మనని తాకుతుంది ...

వూరువిడిచి వెళ్ళం!
వూరువిడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!(2)
వూరువిడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
వాళ్ళు డ్యాములు కట్టారు
వూర్లు మునిగాయి
ఫ్యాక్టరీలు కట్టారు
అడవుల్ని నరికారు
గనులు తవ్వారు,
శాంక్చరీలు పెట్టారు  (2)
నీళ్ళూ లేక, భూమీ లేక,అడవీ లేక
మేమేక్కడెక్కడికి పోతాం?
ఓ, అభివృద్ధి దేవుడా,
దయచేసి చెప్పు
మా బతుకుల్ని ఎలా కాపాడుకోవాలి(2)
వూరువిడిచి వెళ్ళం!
 అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!

జమున ఎండిపోయింది
నర్మదా ఎండిపోయింది
ఇంకా, ఎండింది సువర్ణ రేఖా
గంగైంది మురికి వాగు
కృష్ణా  అయ్యింది నల్లటి రేఖ(2)
మీరు తాగుతారు పెప్సీ కోలా
బిస్లరీ నీళ్ళు
మేమెట్లా దాహం తీర్చుకోము
బురద నీళ్ళు తాగి?
వూరువిడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!(2)
మా పూర్వీకులు  మూర్ఖులు
అడవిని కాపాడారు
భూమిని పచ్చగా వుంచారు
నదుల్ని తేనెలా ప్రవహింప చేసారు(2)
నీ అత్యాశ భూమిని దహనం చేసింది
దాని పచ్చదన్నాన్ని దోచుకుంది
చేపలు చచ్చిపోయాయి
పక్షులు ఎగిరి పోయాయి
ఎ దిశగానో తెలియలేదు?!(2)
వూరు విడిచి వెళ్ళం!
 అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!
మంత్రులయ్యారు పరిశ్రమల బ్రోకర్లు
మా భూముల్ని లాక్కున్నారు!
తుపాకులతో పోలీసుల బలగాలు వాళ్ళని కాపాడుతారు!(2)
అధికారులయ్యారు రాజులు
కాంట్రాక్టర్లు కోటిశ్వరులు!
మావూరయ్యింది వారి కాలనీ !
ఓ సోదరుడా వారి కాలనీ!(2)
వూరు విడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!
బిర్సా పిల్చాడు
అందర్ని కలవమని, నిశభ్దాన్ని చేదించమని!
మత్స్యకారులు రండి,దళితులు రండి, గిరిజనులు కలవండి(2)
పొలాల నుండి, గనుల నుండి మేల్కొనండి!
నగారా మ్రోగించండి!
దేశ ప్రజలారా వినండి
పోరాటం ఒక్కటే మార్గం!(2)
వూరు విడిచి వెళ్ళం!
అడవి వదిలి వెళ్ళం!
మా మట్టి తల్లిని విడిచి వెళ్ళం!
మేము పోరాటం వదలం!
 (అనుసృజన-జి.సత్య శ్రీనివాస్) 

0 comments:

Post a Comment