Tuesday 3 March 2015 By: satyasrinivasg

ఉద్యమ పర్యావరణ కవిత్యం ఆవశ్యకత,ఉనికి-పర్యావరణ ఉద్యమాలు-24

ఇప్పటి వరుకు పలు పర్యావరణ ఉద్యమాలు  అందులో పర్యావరణ కవిత్యం ఉనికిని ప్రస్తావించాను. ఈ ఉనికి వెనుక కధ కి మూలం ...

అభివృద్ధి  అనే ధోరణిలో ఆర్థిక అభివృద్ధినే పరిగణలోనికి తీసుకునప్పుడు యాంత్రిక జీవనం పునర్జీవనం కాని ప్రకృతిని కేవలం ఒక ఆదాయ మార్గం గానే భావిస్తుంది. ఈ భావన  సమస్త జీవరాసుల్ని ఎప్పటికీ తరగని ప్రకృతి స్థిరాస్తులుగా అంచనా కడుతుంది. ఇప్పడు మన చుట్టూ అల్లుకున్న తాపత్రయం స్మార్ట్ సిటి’. స్మార్ట్ అన్న పదానికి నిర్వచనం మన అవసరాల్ని క్షణ కాలంలో తీర్చే నేర్పరితనమా లేక మన ఉనికికి సంబంధిoచిన ఒక ఆవరణని సృష్టించడమా? నా చిన్న మెదడుకి తెల్సింది సాంకేతిక పరిజ్ఞానంతో మన అవసరాలని తీర్చుకునే౦దుకు  పరిపక్వత వున్న పాలనా వ్యవస్థని పటిష్ట పర్చుకునే ప్రయత్నం అని పలు విధాలుగా ప్రచారం జరుగుతోంది. వీటికి సైన్స్ స్మార్ట్ సిటి, ఎన్విరాన్మెంట్ స్మార్ట్ సిటి అని పలు సిటీల పేర్లు పుట్టుకొస్తున్నాయి. మరి అప్పుడు ఆ నగరాలలో వుండే మనుషులూ స్మార్ట్  మనుషులే కదా , ఈ స్మార్ట్ మనుషులకి  ఏర్పడిన  స్మార్ట్ సిటి నిర్మాణానికి  పెట్టుబడి అయిన  ప్రకృతి పెట్టుబడి/సహజ పెట్టుబడి( న్యాచురల్ క్యాపిటల్) నగర నిర్మాణం అయ్యేసరికి హరించుకుపోతుంది. మనం స్మార్ట్ సిటి కట్టే ముందు స్మార్ట్ గా ఆలోచిస్తే, బంగారు పెట్టే గుడ్డు కధ గుర్తు తెచ్చుకోవాలి!

1960 వరకు ఆస్ట్రేలియాలో  ఫ్లోరా ,ఫోనా  చట్టం కింద మూల వాసుల్ని మనుషులు గా కాక జంతువులు గా పరిగణించారు.  వాస్తవంగా వారి భూమిని అన్యాక్రాంతం చేసి వారిని ఆ విధంగా చూసే దృష్టి ఇప్పటికీ పోలేదు. ఇప్పుడున్న సాంకేతిక సామర్ధ్యం తో మునుపటికన్నా ప్రకృతిని వెయ్యింతలు త్వరగా క్షీణింప చేయగలం ,అది స్మార్ట్ నెస్ అనుకోవడం దురదృష్టకరం. ఈ దృక్పధాన్ని అడ్డుకట్ట వేసేందుకే పర్యావరణ  దృక్పధంతో  ఎలుగెత్తడమే తిరుగుబాటు గా ముద్ర వేస్తే భూమి మీద వున్న చెట్టు కూడా ఉద్యమ జెండానే.
ఈ అభివృద్ధి వలసల్ని పెంచేస్తుంది, భూస్వరుపాన్ని మార్చేస్తుంది. అంతే కాదు ఎక్కడ నుండి వనరుల్ని వెలికి తీసి ఈ అభివృద్ధికి సరఫరా చేస్తారో అక్కిడికి వెళ్ళడం అంటే  కొన్ని  వేదాంత రహస్యాల్ని ఛేదించాలి.దానికి సజీవ సాక్ష్యాలు ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ లోని మైనింగ్ ప్రాంతాలు. గత 20 సంవత్సరాల కంటే  ఆంధ్ర లోని బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక ఉద్యమం  కొనసాగుతూనే వుంది. ప్రకృతిని కాపాడే ఉద్యమాల కధలు కంచికి చేరవు.ఇవి కేవలం మనుషుల గురించి చెప్పే కధలు కావు ,  వాళ్ల చుట్టూ అల్లుకున్న ఆవరణ తో బాటు పుడమి కధలు. ఈ కధలు అర్ధం కావాలంటే మనం బతికి వుండడం అనేది  ప్రాధమిక హక్కు గా గుర్తించడం అవసరం. ఇది హెగెల్ అన్నట్టు ఒక అబ్ స్ట్రాక్ట్  రైట్”.  ఇరువురి మధ్యన ఇచ్చి పుచ్చుకునే ఒప్పందం కుదిరి నప్పుడు, ఇరువురికి సమ్మతమైనది అందాలి. అంతే కాని అర్ధం కాని వాట్ని,  అంద చేయడం కాదు. మరి ఇప్పుడు పబ్లిక్ ,ప్రైవేట్ పార్ట్నర్ షిప్ లో జరుగుతున్న ఒప్పందాలలో ఈ భూమి ఒక ఉమ్మడి వనరు. దీనిని తదనంతరం వాళ్ళకి వడ్డీ తో సహా ఇచ్చి వెళ్ళాలి  అన్న  తీర్మానాలు ఎక్కడా లేవు. ఇంకా ఏమిచ్చి వెళుతున్నాం. విలువలతో వున్న ఒప్పందం లేనప్పుడు ,విలువలతో వున్న జీవనం ఏమి వుంటుంది. నేడు అభివృద్ధిలో దళితులు,గిరిజనులు నిరాశ్రయులు ,వనరుల నిష్క్రమణ అనివార్యం , ఈ అభివృద్ధి ఒప్పందాలని బలియపాల్ (ఒ డిశా- మిసైల్ రేంజ్) సంబంధి౦చిన కవిత లో  బ్రజాబాబు ప్రస్పుటంగా చెప్పారు.

నువ్వు నుంచో మంటే
నుంచుoటాను
నువ్వు కూర్చో మంటే
కూర్చుంటాను
నా పేరు నమ్మకస్తుడు
దీనికి  బానిసఅన్న బిరుదు.

భూమిని బానిసగా అంచనావేయడం అన్నది అనాది గా జరుగుతోంది. అందుకే కొందరి ఆధీనంలోనే వుంది. వారి నుండి వేరు చేసి లేని వారికి అందచేయడం లో కూడా భూమిని ఒక తరగని గని గానే అంచానా వేయాలిo. లేని వాడికిచ్చినా , అభివృద్ధి లో వాళ్ళ పలుకు అందులో చోటు చేసుకోలేక పోయింది. ఎప్పుడూ  ఇరువురు వున్న  వాళ్ళ మధ్య జరిగే ఒప్పందాలకి , లేని వాడికి ,వున్న వాడికి, మధ్య జరిగే ఒప్పందాలలో చాలా వ్యత్యాసం వుంటుంది. సదా కోల్పోతుంది కాలి కింద  మట్టినే .

లేనప్పుడు పోరాడే ధోరణి వేరు, కోల్పోతున్న దాని కోసం పోరాడ్డం  వేరు, ఎక్కువగా పర్యావరణ కవిత్యం రెండో ధోరణికి సంభందిచినది.ఈ ఉదంతాలను గత 5 దశబ్దాలుగా చెప్పుకుంటూ వస్తోంది. మనం మట్టి మనుషులుమని.

 ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి ,ఈ ఉద్యమాల్లో సాహిత్య ప్రయోగాల విస్త్రుతి ఇంకా పెరగాలి.   పర్యావరణ కవిత్యం  సాధారణ మనషులు గురించిన అనితర విషయాల్ని  శోధించడం,  వాట్ని  ముచ్చటగా చెప్పడం , ఇది నిరంతరం వీచే మట్టి నీలి  రంగు గాలి వాగు. ఈ ప్రవాహం పెరుగుతుందన్న ఆశ...

0 comments:

Post a Comment