Thursday 18 September 2014 By: satyasrinivasg

నిర్వచనాన్ని నిర్వచించడం - మూల వాసుల అంతరంగాలు-3


పర్యావరణ కవిత్వం అన్నది  ఈ మధ్యనే వెలుగులోకి వస్తున్న అంశం. అంటే ప్రకృతికి సంబంధించిన కవిత్వం పూర్వం లేదా అంటే అప్పుడూ వుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి అంటే, వికిపీడియా నిర్వచనం తో మొదలుపెడదాం. ఇకో పోయెట్రీ - ప్రకృతి తో సంబంధాన్ని పునరావృతం చేసుకునే ధ్వని,ప్రకృతి విధ్వంసం పై  ప్రతిఘటన, మెరుగైన ,ఆరోగ్యకరమైన ప్రకృతి కోసం పర్యావరణ సంరక్షణ ప్రణాళికల్ని, చట్టాల్ని   ప్రోద్భలించడం.( Naseer76). గతంలో పర్యావరణం గురించి రాసినప్పటికీ, ఈమధ్యనే ఇది కొత్త ఒరవడిగా ,నూతన పద సృష్టి గా ఎదుగుతోంది.,ముఖ్యంగా ఆంగ్ల కవిత్వంలో స్ఫురిస్తోంది.జేమ్స్ ఎన్గల్ హార్ట్ చెప్పిన వివరణ లోని కీలక అంశం , ఇతర సిద్దాంతాల్లాగానే (మార్క్స్, స్త్రీవాదం, వగైరా ) సామాజిక  బాధ్యతతో కూడిన ప్రక్రియ. ఇకో పోయెట్రీ  అన్నది విలువలతో కూడుకున్నది.
 వాళ్ళు ఇదే నిర్వచనమని అనరు,కాని ఈ నిర్వచనాన్ని లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం స్టేట్ నిర్వచనంగా కనపడుతుంది. మూలవాసుల  ప్రకృతి ,సంస్కృతి నిర్మాణానికి, స్టేట్ ప్రకృతి సంస్కృతి నిర్మాణానికి మధ్యన పొంతన కుదరరడం లేదు. దీని మధ్యన పర్యావరణ కవిత్వానికి,కవిత్వ పర్యావరణానికి వున్నంత లోతైన అగాధం వుంది. రెండూ పోషకుల పైనే ఆధారపడి వుంటాయి.   ఎటొచ్చీ ధృక్కోణాలే వేరు.
ఇది ఇప్పుడే అని కాదు,అనాదిగా ధృక్పధాల్లో  తేడాలున్నాయి. దీనికి బీజం, వనరుల్ని  అంచనా కట్టే  బిన్న ఆర్ధిక   క్పధాలు. ప్రకృతి భావాన్ని కవిత్వంగా  వ్యక్తపర్చడమంటే వైవిధ్యమైన దారిన సాగే  నిరంతర అన్వేషణ. వలస  పక్షుల  వైతరణి తోవ.  ఇది ప్రణాళికలు  ,చట్టాలకంటే విస్త్రుతమైనది .పాట పాటతో  ముచ్చటించుకోవడం, కవిత కవితతో పెనవేసుకోడం, పర్యావరణ కవిత్వం  కవిత్వ  పర్యావరణమవ్వడం. ఇది మన అంతర్లీన ,బాహ్య ప్రకృతి తో బాటు మన స్పేస్ ,టైంని ఇక్యం చేసే భావ ప్రకటన. అంతే గాని మొక్కలు నాటడం వల్ల అడవులు పెరుగుతాయి అన్న ప్రచారాల వల్ల కాదు. మనలో కవిత్వ ప్రకృతి బీజం లేనప్పుడు పచ్చని  ఆలోచన మొలకెత్తదు. ఒక్టావో పాజ్ ఈ విషయాన్నే ముచ్చటగా ప్రస్తావించాడు, ‘జీవితం నుండి కవిత్వాన్ని రాసుకోవడం కంటె, కవిత్వాన్ని జీవితంగా మలుచుకోవడం ఉత్తమం కదా’ అని.
పర్యావరణ పరిశీలనలో వైవిధ్యమైన దృష్టి అవసరం. చుట్టూ వున్న ఆవరణ మన సామాజిక వ్యవస్థలని ఏర్పరుస్తుంది.ఇవి స్థిరంగా ఉండేవి కావు. దీనిని విస్మరించిన చూపులోని  వాస్తవికత కూడా  అవాస్తికతే.ఆధునిక దృక్కోణంలోని వాస్తవికతలోని కల్పితాలు,మూలవాసుల కాల్పనికతలోని   వాస్తవికత మధ్య చాల వ్యత్యాసం వుంది. అందుకే ప్రకృతిని చూసే కోణంలో   వైరుధ్యం.ఆధునికతలో  నేర్చుకున్నది వాస్తవాన్ని  ఒక రూపంగా జమకట్టడం. నిజం అన్నది ఒక వస్తు రూపంలోనే చూడడం, ఈ ఆలోచన తీరు చిన్నప్పటి  నుండి కధలు ,పాటలు ద్వారా మనలో ఏర్పడ్డాయి. ఉదా: అడవుల వర్ణనలో    కాకులు దూరని కారడవి,చీమలు దూరని చిట్టడవి అని విన్నాం. ఇది చెప్పిన తీరు ,ధ్వని లోనుండి పుట్టిన ఆ వర్ణనని  ఒక మిస్టికల్ వ్యవస్థలు గా మనం భుజించాం, నెమరేసుకుంటాం .ఆదివాసులకి కాకులు దూరని కారడవి అంటే ఎత్తైయిన చెట్లున్న అడవి,చీమలు దూరని అడవి అంటే తుప్పలు,పొదలున్న అడవి.  కాకులు దూరని కారడవిలో వున్న ఆదివాసులు చీమలు దూరని అడవిచూస్తే అడవి గా అస్వాదించలేరు. ఒక సారి తూర్పు కనమల ప్రాంతం ఆదివాసులు రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్  చుట్టూ వున్నఅడవిని చూసి  ఇది ఆడవా  అని ఆశ్చర్య   పోయారు. కాని మనకి  అడవి రూపాలన్ని  భీకరంగానే సృష్టించబడ్డాయి.
ఈ రూపాలు  ప్రకృతి సంస్కృతి నిర్మాణం( nature culture construction) లో ఏర్పడిన ప్రతీకలు.  వీట్ని డి కన్స్ ట్రక్ట్ చేయాలి, దీనికి డి లర్నింగ్ ఆఫ్ హిస్టరీ అవసరం. ప్రకృతిలోని జీవ వైవిధ్యం ఒకే రకమైన ఇమేజస్ని సృష్టించదు.అక్కడి  జీవితం కూడా ఒకే రకంగా వుండదు. కవిత్వం లో ఎంచుకున్న అంశానికి ఒక  ఆవరణ వుంటుంది ,అది తనకంటూ  రూపాన్ని  నిర్మిస్తుంది. పర్యావరణ కవిత్వం ఒక ప్రకృతి  బాషావరణ రూపం . ఇది  మన అనూభూతులు,అనుభవాలతో   నిర్మించున్నాం,పదాలు,వాక్యాలతో ,ప్రతికలతో అల్లిన గూడు. అనుభూతుల అల్లికలో,అనుభవాల అల్లికల్లో చాల వ్యత్యాసం వుంటుంది. ఇది సింపతేటిక్,ఎంపతెటిక్ లో వున్న  తేడా. మూలవాసుల పరిభాషలో ఎంపతెటిక్ ఎక్కువ. పోయిందన్న బాధతో,పశ్చాతాపంతో వ్యక్తీకరణ అగుపించదు.సహజీవనంగా పలుకుతుంది. 

ప్రకృతి  విధ్వంసంలో  అనాదిగా జరుగుతున్నది జీవవైవిధ్య  రూపాల్ని నిర్జీవ ప్రతీకలు గా పెంపొందించే వాతావరణం. ఈ మెటాఫర్ ప్రాసెస్ అంతా  రాజకీయం. అందుకే అడవుల్ని రొమాంటిక్ గా చిత్రీకరిస్తూనే,మూలవాసుల జీవనాన్ని అనాగరింకంగా ప్రచారం చేస్తారు. ఇది వనరుల్ని ఆక్రమించడానికి కీలక ఆయుధం ,వాళ్ళ వనరుల ఉపయోగం నుండి వెలిసిన రూపాల్ని   చిద్రం చేయడం. ప్రకృతి రూపాన్ని మార్చేయడం. దీనిని ఒక ముడిసరుకుగా, విలాసవస్తువుగా సృష్టించడం. భావ  వ్యక్తీకరణలో చిత్రలేఖనం,నృత్యం, శిల్ప కళ,ఆట ,పాట, నటన,కవిత్వం,అన్నీ వనరులే,ఇవి కూడా దురాక్రమణకు   గురయ్యాయి.
అప్పుడు ఆట ,పాట సాముహిక ప్రక్రియ,ఇప్పుడు కొందరు పాడే వాళ్ళు,కొందరు రాసే వాళ్ళు, ఎక్కువ శాతం వినేవాళ్ళు. ప్రకృతి లోని వనరుల్ని ముడి సరుకుగా జమకట్టినప్పుడు అవి మన పంచేద్రియాల్ని అలానే మార్చేస్త్తాయి. పంచభూతాలు   నినాదాల ప్రతిధ్వనులే  అవుతాయి. ఆ దశలో కవిత్వం కేవలం నిర్విజీవ కాగితాలోన్ని అక్షరాల దండ లాగానే మారుతుంది  తప్ప  నాలుక పైన ప్రవహించే  జీవన తేనె నది కాలమవ్వదు.  పర్యావరణ కవిత్వం మంటే  నేలానింగిని  పెనవేసే భూమిలోని నీటి గింజ వేరు,    గోడలకు  వేలాడే పఠం  కాదు.
ఇదంతా చెప్పడానికి కారణం , మెటాఫర్స్  కనుమరుగైపోవడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది, మనలో ఏర్పడ్డ జ్ఞాపకాలు, ప్రతీకలు రాజకీయ వ్యవస్థల నుండి  పుట్టాయి,మూలవాసుల జ్ఞానం నుండి కాదు. పోయిన భూమి ఉపరితల నేల, అడవి పునారావృతం కావు. ఇవి జ్ఞాపకాలే,
కవిత్వ బాష  ప్రాతినిధ్యం  కాదు,నకలు కాదు,ఆకారాల్ని విడతీసి చూడకూడదు, వాట్ని కవిత్వ రూపంలోనే ఆస్వాదించాలి అని క్రీస్తు అనంతరం 2వ  శతాభ్దం  లోని ప్రాకృతి కవులన్న మాట. ఇంతకంటే  నిర్వచనానికి రూపం ఏముంది ? ఈ మిళితం అర్ధమైతే నీటిలో మబ్బులా  కలిసిపోతాం.
ఆకాశం ఒదిగింది
వూరి చెరువులో
ఒక్క తామర పువ్వు నలగలేదు
ఒక్క కొంగ తగ్గలేదు
(గాథాసప్తశతి)
(అనుసృజన)

0 comments:

Post a Comment