Tuesday 14 April 2015 By: satyasrinivasg

భూమి పుత్రిక – దయామణీ బర్లా - పర్యావరణ ఉద్యమాలు-29

దయామణీ  బర్లా జార్కండ్ కి  చెందిన గిరిజన మహిళ. జార్కండ్ లోని అరహర వూర్లో జన్మించింది. వారిది నిరుపేద కుటుంబం. అయినప్పటికీ ఇళ్ళల్లో పని చేస్తూ పట్టభద్రురాలయ్యింది. దొరికిoది భుజించింది.పశువుల కొట్టంలో జీవించింది. ఇంగ్లీష్, హిందీ లో టైప్ చేస్తూ  గంటకి రూపాయి సంపాదించింది.  పోలీసుల దగ్గర పాచి పనిచేసింది,ఆమె జార్కండ్లోని  మొదటి గిరిజన  పత్రికా విలేఖరి కుడా.ఈమెకు  పి.సాయినాథ్ సంస్ధ వారు ఉత్తమ గ్రామీణ విలేకరి అవార్డు కూడా ఇచ్చారు. ఈమె అరెసేలోర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల నిర్వాసితమవుతున్న 4౦ గ్రామలకు అండగా నిల్చి పోరాడింది. గిరిజన కధలు చెప్పుతూ ,రాతల ద్వారా , వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి గిరిజనులు, దళితులూ ,మహిళల  స్ధితి గతుల్ని తెలిపే స్వరం కోసం  జన్ హక్ అనే పత్రిక నడిపాను అని చెపుతుంది. ఈ పత్రిక కష్టాల్లో వునప్పుడు స్ధానిక ప్రభాత్ ఖబర్ పత్రికలో గిరిజన ,దళితుల అంశాలపై రాయమని అందులో ఆ విషయాలకి సంబంధించి కూసింత స్ధానం ఏర్పడేటట్టు చేసింది. జార్కండ్ నలుమూలల నుండి ప్రాతినిధ్యమున్న గిరిజన. దళితుల, ఆదివాసి, మూలవాసి,అస్దిత్వ రక్షా మంచ్ కి ప్రధాన సూత్రధారిణి.స్టీల్ ప్లాంట్ వల్ల ,కోయల్,కరి నదుల పై కడుతున్న డ్యాం ల వల్ల ,ఇంకా అనేక విషయాల పైన దశాబ్ద కాలం పాటు నలుమూలలా గ్రామాల్లో పర్యటించింది.2౦1౦ లో రాంచి కి 15 కిలోమీటర్ల దూరంలో వున్న నగిరి గ్రామంలో ఐ.ఐ.యం.ఐ.ఐ.ఐ.టి. కి నల్సార్ కి 227 ఎకరాల వరి పండే భూముల్ని ప్రభుత్వం కేటాయించింది. ఇది ప్రభుత్యం ప్రకారం 1957లోనే బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకున్నట్టు పేర్కొంది. దయామణీ బర్లా ఆర్.టి.ఐ. ద్వారా సేకరించిన సమాచారం అనుసారం 153 కుటుంబాలకు రావాల్సిన నష్ట పరిహారం లో కేవలం 25 కుటుంబాలే నష్ట పరిహారం తీసుకున్నారు, మిగితా వాళ్ళు దానిని తిరస్కరించారు.
ఇంతటి పరిస్తుతుల్ని ఒకే కవితలో రాయడం కష్టమే ,గతం, వర్తమానం భవిష్యత్తు అంతటిని కనురెప్ప మూసి తెరిచే లోపు కేవలం కవిత ద్వారా చెప్పగలం.అందుకే పర్యావరణ కవిత్వ అపర్చర్ అఫ్ ది హార్ట్స్ ఐ. దానిని హిమాన్షు మనకు ఈ విధంగా చూపిస్తాడు.... 
ఇప్పుడు  దాయమణీ  బర్ల అవ్వడం   చాల  ప్రమాదం
ఆదివాసిగా వుండడం ప్రమాదం
ఇప్పుడు  వూర్లో వుండడం ప్రమాదం
వూర్లో భూముంది
వూర్లో చెట్లున్నాయి
వూర్లో  నదులున్నాయి
వూర్లో ఖనిజాలున్నాయి
వూర్లో  మనుషులున్నారు
వూర్లో  దయామణీ  బర్లా  కూడా వుంది
కంపెని వూర్లోని భూమి పై కన్నేసింది
కంపెని వూర్లోని నదుల పైనా కన్నేసింది
కంపెని వూర్లోని చెట్ల మీద కన్నేసింది
కంపెని వూర్లోని ఖనిజాల పైనా కన్నేసింది
కాని  దయామణీ  బర్లా ఊర్లోనే వుంది
కంపెని అంటే ప్రభుత్వానికి భయం
కంపెని అంటే పోలీసులు భయపడతారు
కంపెని అంటే పత్రికలూ భయపడతాయి
దయామణీ బర్లా కి కంపెని అంటే భయం లేదు
ఇది కంపెని నిబంధన
అందుకే కంపెనీకి కోపం
అందుకే కంపెని యజమాని  ఉత్తర్వు ప్రకారం
పొలీసు వున్నతాధికారి  దయామణీ బర్లా ని
చెరశాలలో  బంధించారు
రండి, మనం ఉత్సవాలు చేసుకుందాం
ఇప్పుడు  దయామణీ బర్లా జైల్లో వుంది
ఇక దయామణీ బర్లా కంపెని అధికార్ని ఆపలేదు
ఇప్పుడు కంపెని అధికారి నదిని  వూరి నుండి పెకిలించేస్తాడు
ఇప్పుడు  కంపెని అధికారి  భూమిని    వూరి నుండి లాగేసుకుంటాడు
ఇప్పుడు  కంపెని అధికారి  ఖనిజాల్ని  వూరి నుండి కొల్లగొట్టేస్తాడు
ఇక కంపెని అధికారి  దేశాన్ని అభివృద్ధి చేస్తాడు
ఇంక కంపెని అధికారి అన్నిట్ని సక్ర పరుస్తాడు
మనమెప్పుడు  ఈ దేశంలోని దయామణీ  బర్లా నుండి విముక్తి చెందుతాము?
మన నదులన్నీ ఎప్పుడు
మన చెట్లన్నీ
మన భూమి అంతా
ఇంక మన అడవులన్నీ
కంపెని హస్తగతం అవుతాయి
కంపెనీల  ఫ్యాక్టరీలు
కంపెని ఉద్యోగాలు
కంపెనీల కార్లు
కంపెనీల షాపింగ్ మాళ్ళు
కంపెనీల రోడ్లు
కంపెనీల టోల్  గేట్లు
కంపెనీల కాలేజీలు
కంపెనీల అధునాతన సాంకేతిక సంస్థలు
కంపెనీల అధునాతన యాజమాన్య సంస్ధలు
కంపెనీల విశ్వవిద్యాలయాలు
అందులో చదివివచ్చే  వారు
కంపెనీల బానిసలు
కంపెనీలకు అవసరమైన చదువులు
కంపెనీలకు  లాభాలు తెచ్చే జ్ఞానం
కంపెనీల  ఇచ్చకు అనుకూలమైన  ప్రభుత్వాలు
కంపెనీలకు తగట్టుగా వంగి  'అవును సర్' అని  నమస్కరించే  పోలీసులు
ఆ..., ఇప్పుడు, మీరే చెప్పండి
మనకు  దయామణీ  బర్లా  అవసరమా?
(హిందీ మూలం-హిమాన్షు  కుమార్,అంగ్ల అనువాదం- ప్రియాంక , తెలుగు- సత్య శ్రీనివాస్)
ఈ భూమిప్పుడు కంపెనీల మాయజాలం లో ఇరుక్కుని ప్రదక్షణ చేస్తోంది, ఆ ప్రదక్షణని వ్యతిరేకించే వారు తీవ్రవాదులుగా ముద్రించ  బడతారు. అవును, వాళ్ళిప్పుడు మనకు అవసరమా అంటే మన ఆలోచనలు సైతం జనిటికల్లీ మాడిఫై అవుతునప్పుడు అంత తీవ్రంగా ఆలోచించే విషమే ఇది. ఆ సమయాన్ని చెప్పే దయామణీ బర్లా అడవిముక్కెర . ఆ ముక్కెరలోని తళుక్కు చాల దూరంనుండి కనపడుతుంది, కొద్దిగా సునిశితంగా దృష్టి పెట్టాలి.
దయామణీ బర్లా ఫాసిల్ కి రాసిన ఉత్తరం(సంక్షిప్త భాగం) ఆమె వ్యక్తిత్వాన్ని చేబుతుంది.
నేను నా మాత్రు భూమిని మోసం చేయలేదు. జార్కండ్ ప్రజలు లేవనెత్తిన  ప్రస్నల్ని మరుగున పర్చలేదు  ఇందుకు ప్రవహించే కోయల్,కరో,చాట నదులే సాక్ష్యం.నేను నెలలో ఇంకిన మట్టి వేళ్ళతో రాస్తున్నాను.కరో నది ఒడ్డున ,గొర్ల కి పచ్చిక  మేపుతూ నేను ఈత కొట్టడం నేర్చుకున్నాను. గడ్డి నీడలు, మంచులో తడిసిన చెట్లతో కమ్మిన ఆకాశం నాకు ప్రేమను పంచింది. నేను వీట్ని ఎలా అమ్మగలను.  నన్ను నన్నుగా మలచిన, జీవించడం నేర్పిన సామాజిక బాధలు , కష్టాలని నాలో భాగ మైన వాట్ని  ఎలా విడనాడను.
ప్రజల కష్టాల్ని, ఇష్టాల్ని కాపాడడం మన (ప్రతి ఒక్కరి) భాద్యత.  ఈ బాధ్యతల్ని నెరవేర్చేవారికి  ఇదొక్కటే మార్గం అని నేనుకుంటాను.  విపత్తులు, కష్టాలే వారి నుదిటిన రాసి వున్నాయి. ఇది జీవిత సత్యం. నేను ప్రభుత్వం ,వారి వ్యవస్ధ ప్రజల పట్ల తమ బాధ్యత నిర్వహించడం లేదని  చెప్పాను.
నగడి గ్రామం నుండి ప్రభుత్వం బలవంతంగా 227 ఎకరాల పంట భూమిని బలవంతంగా తీసుకుంటోంది. చట్ట బద్ధగా, మనవ విలువలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ పనిచేస్తోందని నేను చెప్పను. పంట భూముల్ని కాక నిస్సారమైన భూముల్లో లా కాలేజి, ఐ.ఐ.యం. ని కట్టమని నివేదించాను. ఇదే నేను చేసిన తప్పు, నా నల్గురు మనుషుల్ని చెరశాలలో బంధించారు.చాల మంది చేతులు కోల్పోయారు, నేను, చెరశాలలో బందీనయ్యాను. నేడు, దోచుకునేవారు ,వారి సంస్ధలు ప్రభుత్వ దృష్టిలో మంచి వాళ్ళు గా అయ్యాయి. ఒక వైపు ప్రభుత్వ వనరులని, దోచుకునే వారు, మానవ హక్కుల్ని కబళించే వారికి  ప్రభుత్వ రక్షణ వుంటుంది. మరో వైపు భూమి పుత్రులకు ,భూమి పుత్రికలకి , శ్రేయోభిలాషులని  క్రూరులుగా చిత్రీకరిస్తారు.బిర్సా ముందా లాగానే దేశ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరినీ అదే విధంగా ప్రకటిస్తారు.ప్రజల కోసం పోరాడిన అతనిని దొంగ గా చిత్రీకరించారు.
ఏది ఒప్పో, ఏది తప్పో నాకేమి పాలు పోవటం లేదు. కాని ఒక్కటి మాత్రం తెలుసు, నేను రాయిగా మారాను.ప్రపంచం అంతా నిద్రిస్తోంది,ఇప్పుడు సమయం రాత్రి ఒంటి గంటయ్యింది. మహిళా బందీలు బిర్సా ముండా సెంట్రల్ జైల్లోని మహిళల బందిఖానలో నిద్రిస్తున్నారు. నేను ఒంటరిగా కూర్చున్నాను. ఎప్పడు ఇటువంటి  కష్టాలని మర్చి పోలేదు.అది రాత్రైనా, పగలైనా.ఇతరుల కన్నీళ్ళని తుడవడానికి చీకటి రాత్రులు అడ్డుకాలేదు. కాని ఈ రోజు నా కాళ్ళని కట్టేశారు,ఇతరుల కన్నీళ్ళని తుడిచే చేతుల్ని కట్టేశారు. నా ఇంట్లో ,నా వదిన శవం వుంది. కుటుంబం మొత్తం భయంతో వణుకుతున్నారు. నేను జైల్లో ,నిస్సహాయంగా, మౌనంగా ఉండిపోయాను. కళ్ళల్లో కన్నీరున్నా, కన్నీరు రాల్చలేని స్ధితి. నేడు ,6,నవంబర్ ,2౦12. నేను కోర్టుకి వెళ్ళాలి. నా కనిపిస్తోంది, నా పై మరో కొత్త కేసు మోపుతారని,దాని ద్వారా నన్ను బంధిస్తారు,లేకపోతే రిమాండ్ లో పెడతారు, కాకపొతే, నా మీద వారంట్ జారీ చేస్తారు. నాకు నమ్మకం పైన నమ్మకం పోతోంది.
ఈ కష్ట కాలంలో నాకు తోడుగా వున్న నా మిత్రులందరికీ కృతజ్ఞతలు. నాతోటి ఖైదీలు. జైలు గోడలు దాటి పోరాడమని కోరుతున్నారు.  ఈ పోరాట పటిమని చాటే ఊర్లల్లో వుండే బలమైన పర్వతంలా,నదుల్లా, అడవుల్లా నిలబడడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా. వీస మెత్తు  మా పూర్వికుల భూమిని ససేమిరా ఇవ్వం. మా జీవితాలతో అంతమయ్యే పోరాటం కాదని తెలుసు,ఎందుకంటే...కోయల్,కరో,చాట నదులు ప్రవహిస్తున్నంత కాలం మేము పోరాడుతూనే వుంటాం.
మీ సోదరి
దయామణీ బర్లా.
(ఈ ఉత్తరం, మొదటిగా ప్రభాత్ ఖబర్ పత్రికలో అచ్చు అయ్యింది.)

భూమి పుత్రుల ,పుత్రికల ఉత్తరాల్లోని సారాంశం ఒకటే చెపుతుంది, అది కెన్ శారో వివా ,చికో మెండిస్, దయామణీ బర్లా కానివ్వండి. ఈ పోరాటం కేవలం భూమి నల్లుకున్న మనుషుల కోసమే కాదు. భూమి మనుగడ కోసం కూడా అని. అందుకే మనకి దయామణీ బర్లాల గుణం అడవి ముక్కెరలోని తళుక్కు. అది భూమి కంట్లోని కనుపాప ,ఆ కనుపాప నాడే  పర్యావరణ కవిత్వం.

0 comments:

Post a Comment