Tuesday 7 April 2015 By: satyasrinivasg

మనో ‘గనులు’-పర్యావరణ ఉద్యమాలు-28-పబ్లిక్ హియరింగ్-సంఘటితంగా మినహాయించడం(inclusive exclusion)

ప్రాజెక్ట్ లు అమలులోకి రావడానికి ప్రభుత్వ పరంగా జరగవలసిన కీలక మైన చర్యల్లో ,పర్యావరణ ప్రభావ నిర్ధారణ , సామాజిక ప్రభావ నిర్ధారణ , పబ్లిక్ హియరింగ్ జరగాలి.వీటన్నిటినీ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అని నిర్వచిస్తారు. కాని ఈ ప్రక్రియలన్నీ అభివృద్ధి పేర్న ప్రజలని కలుపుకోక పోగా ,అభివృద్ధిని పొందటానికి అధికారం, అందుబాటు వున్న వర్గం వారు సంఘటితమై ప్రజల్ని అభివృద్ధి నుండి మినహాయించేందుకు బాగా ఉపయోగకర భాగస్వామ్య పద్ధతులుగా సహకరిస్తాయి. ఇది  ఇలా ఎందుకనిపిస్తుందంటే,ప్రాజెక్ట్ ప్రభావిత వేలమందికి ఆ రిపోర్టులు  అందవు, అందినా వేల  కొద్ది పేజీలలోని బాష అర్ధం కాదు, ఇక పబ్లిక్ హియరింగ్ అన్నది ఒక పబ్లిక్ ఫియర్ సృష్టించేది గా ఎలా జరుగుతుందన్నది నా అనుభవంతో ఒక ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్...
దృశ్యం 1
                జూన్‌ 7 2008న విశాఖపట్నం జిల్లాలోని మాకవరపాలెం మండలం, రాచపల్లిలో వెయ్యికిపైగా పోలీసు బలగాలున్నాయి. ఊరికి వెళ్లేదారిలో ఇరువైపులా పోలీసులు. ఊళ్లోకి వెళ్ళేవాళ్లను, వాహనాలను పరిశీలిస్తున్నారు. అతికష్టం మీద ఊళ్లోకి వెళ్ళి పరిచయస్తులతో మాట్లాడాం. నలుగురైదుగురు గుంపుగా ఉండి మాట్లాడుకుంటుంటే అంతకంటే ఎక్కువ మంది పోలీసులు వచ్చి వారిని గుంపుగా ఉండొద్దని, మీటింగ్‌ స్థలానికి వెళ్ళమని అంటున్నారు. మన దేశంలో అన్ని చర్చలూ మీటింగ్‌లుగానే కొనసాగే సాంప్రదాయం ఇక్కడా ఉందని నిరూపణ అయింది. దారిలో సమావేశ ముఖద్వారంలో, వేదికపైన కాలుష్య నియంత్రణ మండలి వారు, ''ఆన్‌రాక్‌ అల్యూమినియా రిఫైనరీ గూర్చి పబ్లిక్‌ హియరింగ్‌'' అన్న ఫ్లెక్స్‌ బ్యానర్లు పెట్టారు. సమావేశానికి వచ్చిన అతి కొద్దిమందికి తప్ప పబ్లిక్‌ హియరింగ్‌కు, మీటింగ్‌కు గల తేడా తెలియదు. ఇది అడుగడుగున వ్యక్తమయ్యింది. సమావేశ స్థలాన్ని అయిదారు విభాగాలుగా బ్యారికేడ్‌లతో విభజించారు. మీడియాకు, ప్రజలు అందులో స్త్రీలకై ప్రత్యేక స్థలం కేటాయించారు. వీరందరూ బ్యారికేడ్‌లో ఉన్నారు. మీడియాను బ్యారికేడ్‌లో చూసిన సందర్భాలు అరుదు. తరచూ సమావేశాలలో మీడియా ఫోటోగ్రాఫర్లను వేదిక నుండి కిందకు దించడం సమావేశంలో భాగమవుతుంది. ఇక్కడ ఆ శ్రమ తగ్గింది. విఐపిలు, వేదిక మీద ఎక్కేవారికి మాత్రం బ్యారికెడ్‌లు మినహాయించారు. విఐపిలో కూర్చున్నవారు ,కంపెనీ ప్రతినిధులు ఇంకా విశాఖపట్నం నుండి వచ్చిన కొందరు పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ఉండే బ్యారికేడ్‌లకి, వేదికకు చాలా దూరం ఉంది. సుమారు నలభై అడుగుల దూరం. దూరంగా కూర్చున్న ప్రజల మాట వేదికకి చేరడానికి అనువుగా వుండకుండా ఉండేటట్లు జాగ్రత్త పడ్డారు. పబ్లిక్‌ హియరింగ్‌ నిబంధనలను పట్టించు కోకుండా ఉండే జాగ్రత్త అనిపించింది. ప్రజలు ఎవరైనా ఒక్కొక్కరిగా మాట్లాడాలంటే మైక్‌ వాళ్లదగ్గరకి చేరడానికి అతికష్టంగా ఉండేటట్టుగా ఉంది. వేదిక దగ్గరికి వెళ్ళడానికి బ్యారికేడ్‌లు దాటుతూ, చుట్టూ ఉన్న పోలీసుల వలయం ఛేదించుకుని, బ్యారికేడ్‌ల నుండి దూకి వెళ్ళేసరికి అలసటతో, భయంతో నోటమాట రాకుండా ఉండేటట్టుగా పద్మవ్యూహం ఉంది. ప్రజలు అభిమన్యులుగా ఉన్నారు.
దృశ్యం 2
                సమావేశ సమయానికి గంటకు ముందుగా ప్రజలు, రాజకీయపార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, సమత సంస్థ ప్రతినిధులు చేరారు. మొదట్లో ప్రజలు చాలా పల్చగా ఉన్నారు. ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం. వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో పోలీసు కావలి కాసేటట్టుగా ఉంది. వాతావరణం ప్రజలకు సానుకూలంగా అసలు లేదు. అంతమంది పోలీసుల మధ్య మాట విప్పితే ఏమౌతుందో అన్న ఆందోళన. వెనకాల నాల్గు వజ్ర వాహనాలు. ఏ సమయంలోనైనా లోపల వున్న ప్రజలపై బాష్యవాయువు ప్రయోగించడానికి అనువుగా, ఉండే ప్రదేశంలో సిద్ధంగా ఉన్నాయి. బహుశా పబ్లిక్‌ హియరింగ్‌ ఇలాగే నిర్వహించాలి అన్న నిబంధన ఉన్నట్టుగా! ఇవన్నీ చూసిన తర్వాత ఇంక మనం చెప్పేదేముంది అన్న భావన ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. అంతా వాళ్ళకనుకూలంగా (ప్రభుత్వం, కంపెనీ) ఏర్పాటుచేసుకున్నారు. లోపలికి రావడం ఎంత కష్టమో, బయటకు వెళ్ళడం కూడా అంతే! వాళ్ళ పుణ్యమా అని వచ్చిన వాళ్ళు కూర్చుండిపోయారు అన్న ఆలోచన కూడా కలుగుతుంది.
దృశ్యం-3
మిగతా సమావేశాల్లాగా  కాక ఈ సమావేశం నిర్ణీత సమయంలోనే ప్రారంభమయింది. టంచన్‌గా గోడ గడియారం పదకొండు గంటలు కొట్టేసరికి బొమ్మ మొదలైంది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి వేదికపైకి వచ్చారు. అన్నీ సవ్యంగా ఉన్నాయా? లేదా? అన్న పరిశీలన తర్వాత కాలుష్య నియంత్రణ మండలి అధికారి సమావేశాన్ని, సమావేశ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ ప్రారంభించారు. తర్వాత ఆన్‌రాక్‌ కంపెనీ ప్రతినిధులు కంపెనీ వల్ల వచ్చే లాభాలు, నష్టాలు లేదన్న వాళ్ళ ప్రగాడ నమ్మకంతో చెప్పుకొచ్చారు.ఆకాశంలోని తారల్ని గుపిట్లో చూపించినట్టు. ఇక్కడే మొదలయింది అసలు కథ! సాధారణంగా పబ్లిక్‌హియరింగ్‌ వేదికపైకి పానెల్‌ సభ్యులు తప్ప ఇతరులు వేదికపై ఉండకూడదు. కానీ జాయింట్‌ కలెక్టర్‌ గారు అక్కడికి విచ్చేసిన ఎమ్‌.ఎల్‌.ఏ., ఎమ్‌.ఎల్‌.సి., ఎం.పిజెడ్‌.పి.టి.సి., పంచాయితీ ప్రెసిడెంట్‌ ఇంకా స్థానిక నాయకుల్ని కొందర్ని వేదికనలంకరించమన్నారు. కొందరు స్థానిక పంచాయితీ ప్రెసిడెంట్లు సమావేశంలోకి వస్తున్నప్పుడు వారిని పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ వారి మాటల తర్వాత శ్రీ ఎమ్‌.ఎల్‌.ఏ గారిని మాట్లాడమని జాయింట్‌ కలెక్టర్‌ కోరారు. ఎమ్‌.ఎల్‌.ఏ గారు మైక్‌ అందుకోవడంతోనే కంపెనీ వల్ల కలిగే పర్యావరణ నష్టాలు గురించి చాలా వివరంగా చెప్పారు. అంతేకాక కంపెనీ కోసమని ఇచ్చే భూములు కంపెనీ రాక పూర్వమే ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిందని, ఉద్యమాల వల్ల సదరు ప్రభుత్వం ఎకర భూమికి నాలుగు లక్షలు నష్టపరిహారం ఇచ్చిందని చెప్పారు. కాని ఈ భూములు ప్రభుత్వం తీసుకున్నది ఐ.టి. పార్కు కోసమని తీసుకుని ఆన్‌రాక్‌ కంపెనీకిచ్చిందని, ఇలా ఎందుకు చేశారని అడిగారు. దీనితోపాటు నష్టపరిహారం తీసుకున్న రైతులు డబ్బులు ఈపాటికి ఖర్చుపెట్టేసారు, ఏదో కొందరు పెద్ద రైతులు మాత్రమే లాభపడ్డారని అన్నారు. దీనికి ప్రజలనుండి సానుకూల ప్రతిస్పందన లభించింది. ఆ తర్వాత ఎమ్‌.ఎల్‌.సి మాట్లాడటం మొదలు పెడుతూ ప్యానెల్‌ మెంబర్లు ఎవరు? అని అడిగారు. దీనికి అధికార్లనుండి ఎవరూ లేరన్న సమాధానం వచ్చింది. అయితే పబ్లిక్‌ హియరింగ్‌ చెల్లదు అనగానే ప్రజలనుండి ప్రతిస్పందన వచ్చింది. అసలు ప్యానెల్‌ సభ్యులు తప్ప ఇతరులు వేదికపై రావలసిన అవసరం లేదు, మేము ఇక్కడ ఉండకూడదు అన్నారు. అధికార్లు ఇక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలన్నీ నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
ఈ ఇరువర్గాల సంభాషణ వల్ల పబ్లిక్‌ హియరింగ్‌ పద్దతులు కొన్ని ప్రజలకు తెలిసాయి. ప్రజలలో తెలిసినవాళ్ళు కొందరు ప్యానెల్‌ ఉండాలన్న నినాదాలు చేశారు. సమావేశం ఈ తీరులో ప్రారంభమవ్వడం వల్ల ప్రజలలో నుండి భయం మెల్లమెల్లగా బ్యారికేడ్‌లు దాటి వేదికపైకి వెళ్ళడం మొదలయ్యింది. ఎమ్‌.ఎల్‌.సి గారు కొత్త పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే చట్టాలు (భూసేకరణ చట్టం సవరణ బిల్లు, పునరావాస  చట్టం బిల్లు) గురించి అవి ఏవిధంగా ప్రస్తుత ప్రాజెక్టుకు వర్తిస్తాయో చెప్పారు. అప్పుడు ప్రజలకి ఇంకొంచెం విషయ పరిజ్ఞానం వచ్చింది. కంపెనీ పబ్లిక్‌ హియరింగ్‌ ముందుగా చేసినా ఇ.ఐ.ఎ. లోని(పర్యావరణ ప్రభావ నిర్ధారణ) అంశాలే చెప్పారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం అన్ని పంచాయితీలలో, ప్రజలకి అర్ధమయ్యేటట్లుగా స్థానిక భాషలో వాటిని అనువదించి అందించాలని చెప్పింది. అది ఎందుకు జరగలేదన్న ప్రశించారు. అది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని, కానీ ఆ సమాచారం అందరికీ తెలిస్తే సమస్య ఏమో అన్న భయంతో వాటిని పాటించరు. కంపెనీ రూపొందించిన ఇ.ఐ.ఎ. నివేదికలో ఈ చట్టాల ప్రస్తావనే లేదు. కేవలం ఇన్ని ఉద్యోగాలు కలుగుతాయి, బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని మాత్రమే ఉంది. అదీ సబబేనేమో, ఎందుకంటే భూమిని కంపెనీతో కొనిపించలేదు. ప్రభుత్వం రైతులనుండి భూమి కొని కంపెనీకి ఇవ్వదల్చుకుంది. ప్రభుత్వ అధికారులు, కంపెనీ వారెవరూ సమావేశంలో ఇది ప్రస్తావించలేదు. ఈ ఇరువురి నాయకుల ప్రసంగం వల్ల ఈ విషయం బయటకు వచ్చేందుకు దారి ఏర్పడింది. ఇంక అప్పటికే ప్రజలనుండి కంపెనీకి వ్యతిరేకత మొదలయి మాకు కంపెనీ వద్దు,వద్దు అన్న నినాదాలు మొదలయ్యాయి. నాయకులు  ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు,వేరు,వేరు, పార్టీల  మధ్య భేదాభిప్రాయాలు కనిపించాయి.
దృశ్యం-4
వేదిక పైన ,కింద కంపెనీ పై తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వెల్లువెత్తింది.ఇక ప్రజలనుండి ఒకరిద్దరిని మాట్లడమని కోరారు. బ్యారికేడ్లను పై నుండి దూకి జిల్లా సి.పి.యం. కార్యదర్శి గారు వెళ్లారు. అయన తీవ్ర స్ధాయిలో వ్యతిరేకించారు. దానితో పాటు పదమూడు వందలమంది వ్యతిరేకతతో కూడిన సంతకాల పత్రాన్ని అందచేశారు.వాటి పై వేదిక మీదున్న పెద్దలు కొందరు సంతకం చేశారు. ఒకరిద్దరు, మహిళలు ,పురుషులు తమ ఆవేదనను తెలిపారు. ఇంకా కొందరు తమ గోడు చెప్పుకుందామని వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది.అర్దాతరంగా ఇక సమావేశం ముగిసిందని కార్యక్రమాన్ని ముగించారు. వేదిక నుండి దిగివస్తున్న జాయింట్  కలెక్టర్ను కొందరు చుట్టు ముట్టి ఎంతమంది సానుకూలంగా చెప్పారు, ఎంతమంది వ్యతిరేకించారు అని ప్రశ్నించారు.అది తెలియచేయడం పబ్లిక్ హియరింగ్ ఆనవాయితీ అని అడిగారు. దానికి అయన ఎక్కువశాతం వ్యతిరేకించారని చెపుతూనే వెళ్ళిపోయారు.
దృశ్యం-5
రాచపల్లిలో,చుట్టూ పక్కల గ్రామాల్లో   గత పదిహేను రోజులుగా వున్న యుద్ధ వాతావరణంలో రక్తపు మరకలు లేకుండా కార్యక్రమం ముగిసింది. కొందరు భీబత్సంగా ఏ గొడవ జరగ కుండా కార్యక్రమం ముగిసిందని, మరి కొందరు డామిట్ కధ అడ్డం తిరిగిందని, మరి కొందరు అనుకున్న మలుపుకి రాలేదని ఎవరి దార్న వాళ్ళు వెళ్ళిపోయారు. కాని కధ ఇంకా కొన సాగుతూనే వుంది. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు వున్నారు.
కంపెనీలకి వనరుల్ని కట్ట బెట్టడం అంతా చట్ట పరంగా గానే జరుగుతుంది. అందుకే అభివృద్ధి ని అవలంభించడంలో చట్ట బద్దమైన మార్పులు జరుగుతాయి. గతంలో చాల ఈస్ట్ ఇండియా కంపెనీలు వ చ్చాయి.వాటిలో కొన్ని మనల్ని పాలించి ,ఎప్పటికి చెరగని చట్టాల్ని చేసి పోయాయి, వాట్ని మనం పలక మీద అక్షరాల్లా తుడిపి మళ్ళి దిద్దుకుంటున్నాం. ఇదంతా ఆధునికతలో జ్ఞాపకాలకి ముసుగు వేయడం లాంటిది.  మన చట్టాలలో ముఖ్యంగా వన్య ప్రాణి చట్టం లో  ఒక కీలక మెలిక వుంది, యిది బలవంతంగా స్దానికుల్ని నిర్వాసితుల్ని చేయదు. వాళ్ళని ఇన్వాలెంటరి డిస్ప్లేస్మెంట్ పేర్న వాళ్ళoతట వాళ్ళే వెళ్ళి పోయేటట్లు చేస్తుంది, అక్కడ ఏవిధమైన సౌకర్యాలు లేకుండా చేసి వెళ్ళిపోయేటట్లు చేసే ప్రక్రియ . ఇది ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్ ప్రాంతాల్లో జరుగుతోంది, పోలవరం నిర్వాసిత గ్రామాల్లో, విశాఖ బాక్సైట్ గ్రామాల్లో ,అటవీ హక్కుల చట్టం , ఉపాది హామీ పధకం నామ మాత్రంగాగే జరిగాయి, చాల సందర్భాల్లో జరగలేదు.
ఇదంతా తప్పుని ప్రజల పైనే నెట్టడానికి చేపట్టే  యోజన, ఇది కళ్ళకి కనిపించదు, ఒక జ్ఞాపకానికి మెటాఫర్ లేకుండా ,వున్నా ఆ జ్ఞాపకానికి మనలో చోటులేకుండా కొన్ని వేల మంది ఆలోచనల్ని మన మెదళ్ళలో ఒకే సారి గుప్పించే ప్రయత్నం. అది పబ్లిక్ హియరింగ్.ఇప్పటికి మన దేశంలో సుమారు 900 పైగా పబ్లిక్ హియరింగ్ లు జరిగాయి, అందులో 90 శాతం పైగా వ్యతిరేకతలు వచ్చినవే, కాని ప్రాజక్టులు ముందుకు కొనసాగుతాయి.
ఈ సంఘటనలకు సంబంధిoచిన కవితలు లేవనే చెప్పాలి, బహుశా సాహిత్యంలో కధలు, నవలల్లో సంఘటన ఆధారంగా వస్తువుని ఎంపిక చేస్కుని అల్లుకుంటారు, కాని కవితల్లో అది అరుదు .అది పర్యావరణ కవిత్వానికి చాల అవసరం. ఎందుకంటే, మన ఆలోచన ప్రకృతికి ఆకృతి , మనలోని సంఘటన, మెటాఫర్ అండ్ మెమరీ. ఈ మెమరీ లోనే ప్రకృతి మనకి అందంగా మిగిలిపోయిన జ్ఞాపిక. 195౦లో బొలీవియన్ కవి విలియం స్టివెంస్ అన్నట్టు అపనమ్మకం బాగా చెలామణి అవుతున్న కాలం లో ,కళలు కవిత్వం ద్వారానే ఉపశమనం పొందొచ్చు.

కవిత్వ ప్రకృతి లక్షణం మెటాఫర్ . వెనకున్న వాస్తవాన్ని వెలికితీయడం కూడా, అది మనలోని సామాజిక ప్రకృతి నైజం.

0 comments:

Post a Comment