Friday 7 February 2020 By: satyasrinivasg

కవిత్వావరణం


కవిత  అందంగా  వుండాలంటే స్ధిరమైన వస్తువును ప్రస్ఫుటించే  స్ధాయి పై ఆధారపడి వుంటుందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు, గతంలో  కవిత్వంలో ప్రస్ఫుటించిన ప్రకృతిని వివిధ  ఇకలాజికల్  దృక్పధాలతో  చూస్తున్నారు, విస్తృతంగా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అప్పటి ప్రకృతి,సామాజిక సంస్కృతి, ఆర్ధిక,రాజకీయ వ్యవస్ధ  వేరు. అప్పటి కవిత్వం ,ఇప్పటి కవిత్వం వేరు కాని వీట్నీ చూసే  పచ్చటి దృక్పధాలు  ఏంటి అవి ఎలా, అప్పటి   వస్తువుల్ని ఇప్పటి పచ్చని కాంతితో  చూస్తున్నాయి అన్నదే  ఈ నీటిగింజ ప్రయాస!. ప్రకృతి విధ్వంసం  అంచున వుండి  వెనక్కి తిరిగి ప్రకృతిని చూస్తున్నాం. ఇది  ప్రకృతి  సాహిత్యంలో అన్ని మాధ్యామాల్లో కాక  ఇక్కడ కేవలం ప్రకృతి ,కవిత్వం అన్న మాధ్యమం లొనే పరిశీలన . ఇది ఎగిరే వలస పక్షి కన్నుతో చూస్తూ చేసే  గమనం. ప్రకృతి .కవిత్వం అన్న విషయాల్ని పరిశీలిస్తున్నపుడు చరిత్రను పునరావృతం చేసుకోవడం అనివార్యం  ఇది వలస పక్షులు దృష్ట్యా చూస్తే బాగా అవగతం అవుతుంది.  కారణం అవి తమ ఏడాది కాలంలో రెండు సుదూర ప్రాంతాల్లో నివసిస్తాయి. ఆ రెండు ప్రాంతాలూ వాటికి  ముఖ్యం,  ఈ రెండు ప్రాంతాల్లో వాటి జీవన విధానం వేరు. ఈ ప్రాంతాల మధ్య  నివశించే నిడివి తక్కువ. కాని ఒకటి గతం, మరొకటి వర్తమానం.ఇక భవిష్యత్తు  అంటే కేవలం ఆ రెండు ప్రాంతాల నడుమ పయనమే. నేటి, వాటి జీవనం చూస్తుంటే ...,  ప్రస్తుతం వలస పక్షులకున్న సమస్య తమ నివాస స్ధానం నుండి వెళ్ళి, గుడ్లు పెట్టి .పొదిగి ,పిల్లల జనన,సంరక్షణలను చూడాలి.కాని ఆ రెండు ప్రాంతాలూ  విధ్వంస వికృతి రూపాల్లో ఏర్పడుతున్నాయి. దీని  వల్ల  అవి క్షీణతకు గురవుతున్నాయి. అంటే మనకున్న నేటి సిటిజన్ అమెండ్మెంట్ ఆక్ట్ వాటికి ఎప్పటినుండో ఏర్పడింది.  ప్రకృతి, కవిత్వం నిశ్చలంగా , ఎప్పటికీ వుండాలంటే ఈ టైం అండ్ స్పేస్ డైనమిక్స్ అర్ధం కావాలి లేక పోతే  “ది పాసెంజర్ పిజన్”  కధ లా, అందరి కధా అవుతుంది.
ఈ బాటసారి పావురాళ్ళు కొన్ని వేల సంఖ్యల్లో జతగా ఎగిరేవి ,అవి ఎగిరేటప్పడు ఆకాశం నల్లగా కమ్ముకునిపోయేది. అవి అమెరికా, కెనడా, మెక్సికో లో నివశించేవి. అవి నివాసలున్న పరిసర ప్రాంతాల్లో కానీ, అడవిలో కానీ వాలి తిరిగి మర్నాడు పయనమైనప్పుడు, మంచు కురిసినట్టు రెండు, మూడు ఇంచుల నేల వాటి పెంటికలతో కప్పడిపోయేది. వాటి రెక్కల కోసం, వాట్నితినడానికి, వాట్ని వేటాడే వారు,1800 చివరి నాటికి వాటి సంఖ్య 14కు మిగిలింది.1914 నాటికి అది రెండుకు చేరింది. ఆ రెండిట్ని సిన్సిన్నాటి జూ లో పెట్టారు, అందులో ఒకటి మగ, మరొకటి ఆడ.ఇందులో చివర్నచనిపోయినది ఆడ ,దాని పేరు మార్తా , దాని కధ ఇది...


బాటసారి కపోతం
-జాన్ హెరాల్డ్
 గడ్డిపోచలు, చెట్ల కంటే ,ఇంద్రధనుస్సు లా ఎత్తున
అవి వెన్నల కాంతి లా వాలుతాయి
కిటికీ ఆవలి పచ్చని, ఎరుపు రంగుల్లో కేరింతలు కొడుతూ పోయేవి
కానీ, ఎవరూ చూడలేదు ,పట్టించు కోనూ లేదు...
ఆకలిగొన్న సమూహం
ప్రోక్లైనర్లతో,తుపాకులతో  వచ్చేంతవరకు
ఇక అప్పటికీ శాంతి మిగల్లేదు
ఓ దేవుడా, వాళ్ళ కలలు నిజమయ్యేంతవరకు,వాళ్ళు పదే పదే యేమనుకుంటున్నారు?
నీకు తెలుసు మాలోని కొంత భాగం నీలో  ఇంకిపోతుందని
పక్షులు రాలిపోయాయి
అవి పడిపోయాయి,వేల సంఖ్యల్లో చనిపోయాయి
చివరికి మిగిలింది  సిన్సిన్నాటి జూ చేరేంతవరకు
అవును, ఇక మిగిలినదల్లా ఆ చివరిదే
 మార్తా అన్న పేరుతో...
చాలా  గర్వం, చాలా దుఖం, కానీ మంచిదే
వాళ్ళు అసంఖ్యాకులైనప్పటికి, కాని కొందరు మిగిలారు పట్టించుకోడానికి
లేక చింతించడానికి
ఎవరైనా వాట్ని ఇంతగా  హింసించగలరా?
అదీ ఒక డాలర్ లేక మరో డాలర్ కోసం, పదే,పదే వాళ్ళ కలలు నిజమయ్యేంతవరకు
నీకు తెలుసు మాలోని కొంత భాగం నీలో  ఇంకిపోతుందని
ఆమె మృతదేహం చుట్టూ రోదిస్తూ మిగిలున్న వాళ్ళు
కేజ్ లో ఓ మూలనున్న  ఆమెని గుర్తుపట్టారు
చివరి పాట వరకు,ఆమె ఎంత మృదువుగా వచ్చిందో అంతే మృదువుగా నిష్క్రమించింది
బాటసారి కపోతం
 కనుమరుగైంది...
(అనుసృజన-జి.సత్యశ్రీనివాస్)

“కానీ ఎవరూ చూడనూ లేదు, పట్టించుకోను లేదు. కొందరే  పట్టించుకున్నారు లేక చింతించారు”... మనుషులు చరిత్ర లో నమోదైన రెండో జంతుజాలాన్ని కొన్ని వందల సంవత్సరాలలోనే అంతరింప చేశారు. ఇదంతా అత్యాశ,పట్టించుకోనితనం ,మూర్ఖత్వం వల్ల. దేవుడా ,వాట్ని అంత క్రూరంగా ఎలా హింసిస్తారు, వాళ్ళు యేమనుకుంటారు? ఇది ఇప్పుడే కాదు గతంలోనూ జరిగింది. ఇది కొనసాగుతూనే వుంది. మార్తా భూమి పైన చివరి బాటసారి కపోతం 1914 సెప్టంబర్ ఒకటిన చనిపోయింది. భూమి పైన ఓ అందమైన బాటసారి  కపోతం  నేల వీడి నింగి చేరింది. భూమికి తన అందాల్ని అద్ది,  ప్రకృతికి స్మృతి పధం  ఇచ్చి తిరిగిరాని  లోకాలకు వీడింది.ఇదంతా జరిగింది కొన్ని డాలర్ల కోసం...
అవును ప్రకృతిని, అందులోనే జీవరాసుల్ని మనం  పచ్చగా  చూడ్డం  అంటే పచ్చ కాగితాల్లా 
మార్చడానికే అన్నది పచ్చి నిజం. చరిత్రను అందులోనూ... ప్రకృతి చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు 
ఒక విషయం గమనించాలి. గతంలోని చరిత్రలో మార్పుల  వల్ల నేడు  మనం 
ఇలా వున్నాం అన్నదానికంటే , ఇప్పుడు జరుగుతున్న మార్పుల వల్ల 
మన భవిష్యత్తు రూపం ఎలా వుంటుందో అన్న ఆందోళన మనల్ని 
ఎక్కువగా భయపెట్టిస్తోంది అన్నది వాస్తవం. నేటి ప్రకృతి కవిత్వం, 
నిన్నటి ప్రకృతి,కవిత్వానికి , రేపటి ప్రకృతి .కవిత్వానికి  మధ్య వారధి ప్రకృతి ఆనవాళ్ళు . 
ఇప్పుడు రాయడానికి ఉపయోగించే మాధ్యమాలు ప్రకృతి లోని చాలా శక్తిని ఉపయోగిస్తాయి.
 దానికోసం చాలా మైనింగ్ ,ఇతరత్రా విధంగా ప్రకృతి వనరుల్ని వినియోగిస్తాం. 
గతం లో ప్రకృతి లోని శక్తిని ఇంతగా వినియోగించ లేదు. రాయడం అన్నది ప్రకృతి కాదు,
 పలకడం ప్రకృతి, ప్రకృతి పలుకు రాసేటప్పుడు ,అచ్చువేసేటప్పుడు(ఏ మధ్యామమైనా) 
ప్రకృతాక్షర సంరక్షణ అవసరం. ఎందుకంటే మనమూ బాటసారి కపోతాలమే,
 కొన్ని సందేశాలు, పలుకులు విదిల్చి వెళ్ళి పోతాం.
 వాట్ని మన ముందు తరాలు అంకురించే భీజాలుగా భద్రపర్చుకోవాలి తప్ప, 
పచ్చటి నోట్ల కట్టలుగా మొలకెత్తవని  ఈసడించుకోకూడదు. 



0 comments:

Post a Comment