Thursday 14 May 2020 By: satyasrinivasg

బ్లాక్ అండ్ వైట్




ప్రకృతిని అర్ధం చేసుకోడానికి ప్రకృతిలోని జీవ వైవిధ్యాన్ని అర్ధం చేసుసుకోవాలి, దీనికి పరిశీలనతో కూడిన అనుభవం చాలా ముఖ్యం. అది ప్రకృతి రంగులని బ్లాక్ అండ్ వైట్లో చూస్తేనే అవగతమవుతుంది.  ప్రకృతికి కూడా మెమరీ వుంటుంది , యునివర్సిటీ ఆఫ్ స్టుట్ గార్డ్స్  వాళ్ళు  వ్యోమగాములకు  అంతరిక్షంలో అవసరమైన మందులు తయారు  చేయాడానికి చేసిన పరిశోధనలో  నీళ్ళు గురించిన విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యచకితులయ్యారు. మైక్రోస్కోప్ లో దానిని చూసినప్పుడు ,వాతావరణం బట్టి దాని రూపం మారుతుందట. దీన్ని బట్టి దానికి జ్ఞాపక శక్తి వుందని భావిస్తున్నారు.సాల్ చెట్లు(గుగ్గిలం) ఒంటరిగా పెరగవు, అవి వాటి సముహంతో కలిసి జీవిస్తాయి, వాట్ని ఒంటరిగా పెంచితే , ఒంటరి తనానికి లోనై చనిపోతాయి. అంతదాక ఎందుకు, ఒంటరిగా ఎదిగిన తురాయి, వేప ,కానుగ, కరివేపాకు  లాంటివి తమ చుట్టూ వాటి సముహాల్ని ఏర్పర్చుకుంటాయి.

కరోనా వల్ల మనుషుల అలికిడి  తగ్గింది, వన్య జీవులు తిరిగి నగరాలలోకి  వస్తున్నాయి అని సంతోషం,ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు, అవేవీ ఇక్కడ  వుండానికి రావడం లేదు, వుండాలన్నా  వుండలేవు. కాలుష్యం   తగ్గింది అని ఏమీ లేదు, ఇవన్నీ తాత్కాలిక మార్పులు. ఈ సమయంలోనే జరగాల్సిన చట్టాల మార్పులు, ఒప్పందాలు జరుగుతూనే వున్నాయి. ఒకసారి కరోనా పోయిన తర్వాత షరా మామూలే...  ఈ భూమి , ప్రకృతి ఎన్ని ఎపిడెమిక్స్, పాండమిక్స్ చూడలేదు...

అసలు మనం మాములుగానే ప్రకృతిని సరిగ్గా పరిశీలించం,  చుట్టూ  వున్న దాన్ని పట్టించుకోము. అసలు మనలో నిక్షిప్తమైన వాట్ని కుడా పట్టించుకోము.అన్నిటికి సమయం లేదు,లేక రాదు అనే అంటాం. ఎందుకంటే మన ఇష్టాలన్నీ డబ్బుతోనే ముడిపడిపోయాయి కాబట్టి  మన ఇష్టాల్ని కుడా మెమొరి లేన్లో వదిలేసాం! కరోనా వల్ల వాట్ని కొద్దో గొప్పో  మన జ్ఞాపకాల వూట బావిలో ఏతమేసి తోడుకుంటున్నాం.  ఇలా జ్ఞాపకాల్ని తోడుతున్నపుడు పరిశీలన ముఖ్యం.  పరిశీలనలో మనం గమనించే వాటిని మనం గమనిస్తున్నాం అన్నది తెలియకూడదు, అది తెలిస్తే అవి అప్రమత్తమయ్యి సహజంగా వుండవు ,లేక అక్కడి నుండి వెళ్లి పోతాయి. ప్రకృతి పరిశీలనలో ఇది చాల కీలకమైన అంశం. దీనినే ఆల్ఫర్డ్ స్క్రుత్స్ నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు.  దీనిని ఎలా చేయ్యాల్లో ఎమిలి డికిన్ సన్ కవిత ద్వారా తెలిపింది...
ఒక పక్షి సంచారం
ఎమిలి డికిన్ సన్
ఒక పక్షి ఇటుగా వచ్చింది
దానికి తెలియదు ,నేను చూస్తున్నట్టు-
అది ఒక పురుగుని సగంగా కొరికింది
దానిని పచ్చిగానే తినింది,
తర్వాత పచ్చిక పైనున్న
ఒక చుక్క నీటిని తాగింది
తూనీగలకు దారినిస్తూ
అటు తర్వాత గోడంచునే ఎగిరింది
అది సూక్ష్మ నేత్రాలతో చూసింది
తొందరగా తూనీగలు అంతటా  చెల్లాచెదురుగా వెళ్ళిపోయాయి
నాకు, అవి రాలిపోతున్న ముత్యాల్లా అగుపించాయి-
అపాదం  మునట్టుగా, జాగ్రత్తపడుతూ
అది తన సునిశితమైన  తలను అటిటూ తిప్పింది
నేను దానికి ఒక బ్రెడ్ ముక్కనిచ్చాను
అది తన రెక్కలను విదిల్చి
సముద్రాన్ని ఛేదించే ఖడ్గంలా కాక
రంగులల్లిక మెరుపుతో
మిట్టమధ్యానం ఒడ్డుచేరే  సీతాకోకచిలుక  అలలా
సుతి మెత్తంగా,సవ్వడిలేని ఈతలా  తన  గూటికి ఎగిరింది
(అనుసృజన-జి. సత్యశ్రీనివాస్)

ఎమిలి డికిన్ సన్(1830-1886,అమెరికన్ కవయిత్రి), తన శైలిలో నాల్గు పంక్తులు /అయుదు పంక్తులతో కూడిన స్టాన్
 జాలలో కవితలు రాస్తుంది. కవితలో  ఒక పాజ్ తో కూడిన వాక్యాల్ని అమర్చుతుంది .ఇది  చదవడానికి అనువుగా వుంటుది. తన కవితల్లో కవయిత్రి  ప్రకటితమవుతుంది.

ఒక పక్షి సంచారం కవితలో ,ఒక పక్షి తనకు దగ్గరగా సంచరిస్తున్నప్పుడు దాని నడవడిక తీరుని ప్రస్తావిస్తుంది, ఇక్కడ పక్షి ప్రకృతి ప్రతిరూపం కూడా. పక్షిని పరిశీలిస్తున్నట్లు దానికి తెలియదు. పక్షి పురుగుని తిన్నాక , మనుషులులానే గ్లాస్లోని నీళ్ళు తాగినట్టే అది కూడా గడ్డి పరక మీదున్న నీటిచుక్కను తాగుతుంది. ఇక తూనీగల ప్రస్తావనలోని ప్రతీకల్లో  (రాలిపోతున్న ముత్యాల్లా) సామాజిక మెటాఫర్ల ప్రస్తావన  కనిపిస్తుంది.అపాయం అన్న విషయాన్ని   చిన్నగానే చెబుతూ , అప్పుడు పక్షి అప్రమత్తమై తీసుకున్న జాగ్రత్తల్ని వివరిస్తుంది.కవిత  ముగింపులో పక్షి తిరుగు ప్రయాణంలో వ్యక్త పర్చిన మెటాఫర్స్ ఒక దర్జీ పిట్ట గూడు అల్లే దృశ్యంలా వుంది. అవును  ప్రమాదం అన్నదాన్ని పక్షులు, జంతువులూ చాలా సునిశితంగా పసిగడతాయి, అంతే జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి. ఈ చర్యలో మిట్టమధ్యానం ఒడ్డుచేరే  సీతాకోకచిలుక  అలలా, సుతి మెత్తంగా,సవ్వడిలేని ఈతలా  ,తమ సమూహాన్ని తన ,పర అన్న తారతమ్యం  లేకుండా   అప్రమత్తం చేస్తాయి. మనుషులు అలికిడివున్న  చోట పక్షులు,ఇతర ప్రాణులు అప్రమత్తంగానే సంచరిస్తాయి.అలికిడి అన్నది మన ఆలోచనలోని అంతర్లీన భాగం,ఒక స్పర్శ.

ఇప్పుడేదో కరోనా వల్ల అవి తిరిగి వస్తున్నాయి అన్నది నగర వాసులకి ఆశ్చర్యం కాని ,నగర శివారుల్లో, ఊర్లల్లో, పంట పొలాల దగ్గర, పోడు చేనులోని చేనుమకాంల దగ్గర ఇది  షరా మామూలే. మనుషులు , పక్షులు, జంతువులు ఒకరి అలికిడి ఒకరు పసిగడుతూ జీవించాలి.  పక్షులు ,జంతువులు వాటికి హాని కలగదు అన్న భరోసా ఏర్పడినప్పుడు అవి వస్తూ పోతూ వుంటాయి.  ఇప్పుడు జంతువులు అవి కోల్పోయిన జీవావరణలోకి  తిరిగి వస్తున్నాయి, మనుషుల, వాహనాల అలికిడి తగ్గినందుకు.

నిర్మానుష్యమైన వీధులు, అందరూ ఇళ్ళలోనే వున్నారు, ఆ నగరం పోలిమేరనానుకుని అడవి వుంది. జపాన్ లోని నార నగరంలో నిర్మానుష్యమైన వీధుల్లో సిల్కా జింక వీధుల్లో, స్టేషన్లలలో స్వేఛ్చగా తిరుగుతోంది.పనామా లోని సాన్  ఫిలేపి సముద్రపు ఒడ్డున రాకూన్స్ చేరుతున్నాయి.చికాగో లోని లింకన్ జ్యూ పార్క్,అర్బన్ వైల్డ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సెత్ మాగ్లె మాట్లల్లో మేము ఉపయోగించని ప్రదేశాల్లో జంతువులు తిరుగుతూ వుంటాయి, ‘వాటి సంచారం,ఉనికి మాకు తెలియదు, ఒక రకంగా అవి కనిపించని దెయ్యాలు’. ఇట్లాంటి సంఘటనలు కరోనా వచ్చినప్పుడే కాదు, మామూలు రోజుల్లోనూ  హైద్రాబాద్ , వైజాగ్, తిరుపతి, శివార్లల్లో జరిగాయి. ఇక వూర్లల్లో చెప్పనక్కర లేదు. మాగ్లె  ఈ సందర్బంగా అన్న మాటలు  ‘జ్యూరాసిక్ పార్క్ లో అన్నట్టు, జీవితం తన మార్గాన్ని అన్వేషిస్తుంది,” . ప్రస్తుతం నగర ప్రవేశం చేసిన జింకల పై వాళ్ళు ఇంటిపట్టు నుండే , సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, వన్య ప్రాణుల పై  ప్రతి సంవత్సరం చేసే కొద్ది పాటి పరికరాలతో చేసే అధ్యయనాన్ని ,ఇప్పుడు  కరోనా వల్ల వాటి నడవడికలో వచ్చే మార్పులపై అధ్యనం  చేస్తారట.

జంతువులు ,పక్షులు తిరిగి అవి కోల్పోయిన ఆవాసాలకు వస్తున్నాయి. మరి మనం కరోనా ప్రభావం వల్ల  ఇంటికి కూడా పోలేక పోతున్నాం,ఆహారం నిల్వ వుండే రోజులు కూడా దగ్గర పడుతున్నాయి, జేబులకు  కూడా కన్నాలు పడుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న, చెందిన  దేశాల్లో లాక్ అవుట్ దృశ్యాలు వేరు, వేరు. అభివృద్ధి చెందిన దేశాల్లో, పేరు చెప్పడం అవసరం లేదన్కుంటా. ఒక మహా నగరంలో నిత్యావసరాల మాల్ దగ్గర జనాలు గుమికూడి వున్నారు, నిత్యావసరాలకంటే ముఖ్య మైన దాని కోసం, ఎగబడి .గంటల కొద్దీ నుంచున్నారు, వాళ్ళ తరుణం వచ్చే సరికి కట్టల కొద్దీ కావాలన్నారు, కౌంటర్ దగ్గర వున్న వాళ్ళు అన్నీ ఇవ్వం ,అందరికీ ఇచ్చే కోటా  ప్రకారమే తీస్కోవాలి, కట్ చేస్తే... దిగాలుగా  గత్యంతరం లేక తనకు వచ్చిన కోటా టిష్యు పేపర్ రోల్స్ తీసుకుని  వెళ్ళాడు.

ఇదంతా ఒక జోక్ సోషల్ మీడియా లో చూసి నవ్వుకోవచ్చు,1943 క్షామం అప్పుడు ఇట్లాంటివి జరిగాయి, డిమానిటైజేషన్ కాలంలో ఇట్లాంటి  సంఘటనలని చూశాం, సినిమా అప్పుడే అయిపోలేదు, కరోనా తగ్గినా  తర్వాత సినిమా ఇంకా వుంది. వాణిజ్య  వైరస్ అంటుకుంటుంది... ఒకటి మాత్రం నిజం ప్రకృతి,సామాజిక నడవడికలు గతంలో లాగానే పునరావృతం కావు. అవి కొండ గుహలలో మన పూర్వీకులు మనకు వీడ్కోలు చెప్పిన అచ్చైపోయిన హస్తాల  ఆనవాళ్ళు మాత్రమే, వాళ్ళు మనని రమ్మని పిలిచే సంకేతం కాదు. !. కారణం మనం, మనిషి-వస్తువు, మనిషి-ప్రకృతి, వ్యక్తి- సమూహం, సమూహం-కులం ,జాతి -మతం  అన్నిట్నీ విడదీసి చూసి కలుపుకుపోతాం. మనకంట్లోని కనుపాప తడి వెలుతురులేని చుక్క మాత్రమే, చూపున్న పక్షి నేత్రం కాదు.


0 comments:

Post a Comment