Tuesday 16 December 2014 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- కెన్ సారో వివా-పచ్చని కాంతి విస్ఫోటం -14

ఇనుప  బూటూ- నల్ల తూనీగ
1
నువ్వు వర్షపాతాల్ని
కలలు గన్నావు
కలలు కనే వాడెవడైనా సరే దు:ఖ oపాత్రుడు
2
నేనేల నూనె గానుగల
ఒగోనిశోకాన్ని కద్దేడులా తిప్పిన వాడివి
క్రిమి కీటకా లం
మాకు వచ్చేపోయే ఋతువుల   పై
ప్రేమలు కూడా లేవు
నవ్వుల ఏడ్పుల గాయాలపై వీచే
తేమల్నివాసన కూడా చూడం
3
ఒకే దేహమెందుకుంది
అన్ని దేహాలూ నేనెందుకు కాలేదని
చింతించిన వాడికి
భయపడ్తాడెవరైనా
4
అభయారణ్యాల నిర్భయారణ్యాలకై
నెత్తురోడుతూ కువారిల్లిన కుందేలుకూనా...
అందరికో...నీ కొందరికో
దాచిన నీ ప్రొద్దుటి నక్షత్రాల్ని
వాడి ఉమ్మి తొట్లో దులుపుకున్నాడు
5
అక్షరాన్ని నమ్ముకున్నావు
చినిగిన చినుకుగా చేజారిపోయావు
ప్రేమికదేవుడు భయపెడ్తాడు
6
ఓ పచ్చి కుండలో నదుల్ని
వనాల్ని
వనాల పరివాహక గానాల్నీ
మోసుకు తిరిగిన వాడివి
భయపెడ్తావు
7
వాడు డబ్బు బొడ్లో తల దాచుకున్నాడు
హింసా రోగ పీడితుడు
ఇనుప బూట్లో ముడుచుకున్నవాడు
భయపడ్తాడు
8
ఆఖరాఖరి
వెలుతురు ద్వారం దగ్గర
ఈవా అపజయయాల ప్రపంచం
తల మోదుకుంటూనే  వుంది
ఇంకా ఎంత మందో
నీకులా....
(కెన్ సారో వివాకి, సిద్ధార్ధ,95)

గత కొంత కాలంగా అడవులు,నీళ్ళు,భూమి,పంటలు, గూడు కోసం పోరాడే యోధులు బలవ్వడం క్రమేణ పెరుగుతోంది. ఈ పరిణామం వనరుల క్షీణతకు ,వాటిని ప్రేమించే గుణ మున్న వార్ని ,మట్టినుండి దూరం చేసే సంకేతం.

పూల నీడల్లో పరిమళించాలన్న,కెన్ శారొ వివ అతని అనుచరుల జీవితం అర్ధాంతరంగానే ముగిసింది. 1995,1998 దశలో పోరాటాలు పెరుగుతూనే వున్నాయి దానితో పాటు ఆబాట  పట్టిన వారి చావులు కూడా. ఈ మధ్య  బ్రెజిల్లో రియో +20 ముగిసింది పర్యావరణానికి సంబంధించిన సదస్సులు షరా మాములుగా జరుగుతూనే వున్నాయి. కాని అవి  ఏ మాత్రం పర్యావరణాన్నిఆపడం లేదు. గ్లోబల్ విట్నెస్ వారి  అంచానాల ప్రకారం గత దశాబ్ద కాలంలో బ్రెజిల్లోనే  వనరుల సంరక్షణ కోసం గళమెత్తిన వారు 365 మంది చనిపోయారు/చంపివేయబడ్డారు. గ్లోబల్ ఎకానమీ అయిన తర్వాత స్థానిక వనరులు ,మల్టినేషనల్ కంపెనీల పెట్టుబడులు పెరిగాయి, ఇప్పుడు పోరాటం గ్లోబలే! భూమి కోసం పోరాటం సదా జరుగుతూనే వుంది .ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు  దోచుకోవడానికి విస్త్రుతమైన సాంకేతిక నైపుణ్యం వుంది. చాల తొందరగా ,తక్కువ కాలంలో వనరుల్ని పెకిలించవచ్చు. 
సిద్ధార్ధ తన కవితలో చెప్పాల్సిన విషయాన్ని వివిధ ప్రక్రియలతో  చిత్రించాడు. ఈ కవితలో సంఘర్షణ ఒక దృశ్యంగా అవిష్కరించుకుంటుంది. మాములుగా సిద్ధార్ధ కవిత్వంలో దృశ్యం కంటే ధ్వనితో కూడుకున్న శబ్ద సౌందర్యం ఎక్కువ. కాని ఈ కవితలో దృశ్యం లో ధ్వని అంతర్లీనం గా వుంది. ధ్వని స్ధాయి గద్యమం దాటలేదు, పూర్వపు సంగీత బాణీ లా. వాయిస్ ఓవర్ ఒక     దీర్ఘ పాస్ తో వస్తు విజువల్ పై ఎక్కువ ఫోకస్ వున్నట్టు. ఈ టెక్నిక్ పర్యావరణ కవిత్వం లో వుండే మరో ప్రతేక్యత. దీని ద్వారా పాఠకుడ్ని ఇమోషనల్ గా టచ్ చేయగల్గుతాం. కవి కూడా ఇటువంటి కవితలు రాసేటపుడు అదే విధమైన భావోద్యేగంలో  ఉంటాడు. రెండు మనసుల్ని ఒకే విధమైన భావోద్వేగ స్దాయిలోకి చేర్చే రసాయనిక ప్రక్రియ ఇది.
ఓ మెలోడి పాటని ఒంటరిగా శీతాకాలం సంధ్యా సమయంలో వింటునట్టు. ధ్వని అప్పుడు మనలో ఓ దృశ్యంలా ప్రవహిస్తుంది. మనము మెల్లిగా పాడడం మొదలు పెడతాం, అలా మది కొలనులో కలువుగా ఉండిపోతుంది.
కెన్ సారో  వివా జ్ఞాపకంలా
వివా అపజయయాల ప్రపంచం
తల మోదుకుంటూనే వుంది
ఇంకా ఎంతమందో
నీకులా....
కవిత ముగింపులో ఓ డిసాల్వ్ టెక్నిక్ కనపడుతుంది. ఒక హమ్మింగ్ తో పాట ముగిసినట్టు.
పర్యావరణ కవిత్వాన్ని రాయడం,ఆస్వాదించడానికి, విజువల్, మ్యూజిక్,పర్ఫామింగ్ ఆర్ట్స్ ని అర్ధం చేస్కోవడం అవసరం. ఎందుకంటే అంతర్లీన ,బాహ్య ప్రకృతి అంటే ఇంతే! ఈ  లక్షణాల్ని మన పదాల్లో,ప్రతీకల్లో వచ్చే టట్లు చూసుకోవాలి.ఎందుకంటే పుట్టుకతో వచ్చిన భావాల్లో మార్పు వుండదు అవి వ్యక్త పరచే తీరు మారుతుంది.ఇది సామాజిక,సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల వల్ల ఏర్పడుతుంది. ప్లాస్టిక్ డబ్బుల కాలం మనని ప్లాస్టిక్ చేసింది. ఇప్పుడు పాటలు ఎంత తొందరగా పుడుతున్నాయో అంటే తొందరగా చనిపోతున్నాయి. మన పాట కవితని ఇప్పుడు, ఎప్పుడు చదువుకున్నా అది ఫ్రెష్ గా వుండాలంటే మనలో సునిశత అలానే వుండాలి,కవితని అల్లిన తీరు అలా వుండాలి.(అందుకే కవితని రాసిన వెంటనే పోస్ట్ చేయకండన్న హెచ్చరికలు వెలువడుతాయి).అది మనలోని ప్రకృతి దాని పర్యావ రణం గా మార్చకుండా ఉండేందుకే ఉద్యమాలు జరుగుతున్నాయి.

గిరిజనుల మాటల్లో, పాటలు, కధల్లో ఇవి ఇమిడి వున్నాయి. పర్యావరణ విధ్వంశం వల్ల మనం కోల్పోతుంది కేవలం వనరుల్నే కాదు ,వాటిని అల్లుకున్న గిరిజన పలుకుల్ని.ఈ పలుకులతోనే కెన్ సారో వివా వివాదం సృష్టించాడు. అది గద్యమ స్ధాయిలో భూమి చుట్టూ .తిరుగుతూనే వుంది, ఎప్పటికి మన చెవుల్లో  తూనీగ పాటలా ధ్వనిస్తూ...

0 comments:

Post a Comment