Tuesday 30 June 2015 By: satyasrinivasg

ఎండో సల్ఫాన్ దురంతం- పర్యావరణ విధ్వంసం -36

మట్టికి, మానవ మనుగడకి ఒక అవినాభావ సంబంధం వుంది. ఇది మనిషికి ప్రకృతికి  మధ్య వుండే కేవలం భౌతిక సంబంధం  కాదు. ఇది ఒక అతీత అనుబంధం ( ప్లాటోనిక్) . అది విధ్వంశ కర సంబంధంగా(ప్లుటోనిక్) మారుతోంది. పర్యావరణ వినియోగం పేరు మీద జరుగుతున్న విధ్వంసం చెప్పుకుంటూ వస్తున్నాను. కాని మన జీవన చక్రానికి ,జీవనానికి, జీవనోపాదికి , మానవ సంస్కృతికి ఆవాసం అయిన మట్టినే నాశనం చేసినప్పుడు ,సమాజం ఎలా మారిపోతుందో ,ముందు తరాలు ఏ  విధంగా జన్మించి, ఎదుగుతారు అన్న దానికి మరొక సజీవ ఉదాహరణ కేరళ కేసరగోడని తోటల్లో ఎండో సల్ఫాన్ రసాయనిక మందుల వాడకం వల్ల జరిగిన ఉదంతం.
ఈ ఎండో సల్ఫాన్ దుస్సంఘటన ఉత్తర కేరళలోని కేసరగోడ ప్రాంతంలో 1990 లో జరిగింది. జీడితోటల్లో ఏరియల్ (గగనం నుండి)పద్ధతిలో తోటల్లో ఎండో సల్ఫాన్ రసాయనక క్రిమిసంహారక మందుని స్ప్రే  చేసారు. దీని వల్ల స్ధానికుల పై తీవ్ర ప్రభావం చూపించింది. క్యాన్సర్,చర్మ వ్యాధులు పుట్టుకతోనే మనో వైకల్యం,మధుమేహ కారకం, ఇతర వ్యాధులు సోకాయి. ఒకప్పుడు నిశబ్ధ మంచు పొరల్లో అందంగా జీవనం కొనసాగిన కాసరగోడ ప్రాంతం ఇప్పుడు వ్యాధి గ్రస్తురాలిగా మారింది. ఎండో సల్ఫాన్ని 20  సంవత్సరాల పాటు నిరంతరంగా అదే పద్ధతుల్లో జీడి తోటల్లో జల్లారు. దాని పర్యవసా నం
కవి ఫబియాస్ ఎం. వి  విలక్షణ మైన కవిత, కవిత్వ తీరులో ప్రస్తావించారు...
మృత్యు చుక్కలు
(ఫబియాస్ ఎం. వి.)
పత్రికల్లో కధనాల్ని మించిన కధనాలు;
సానుభూతులు సానుభూతులు;
నిర్వీర్యాన్ని మించిన నిర్వీర్యం
అసంఖ్యాక మృతదేహాలు.
ప్లాంటేషన్స్ లో ,పైశాచికమైన  ఎండోసల్ఫాన్ వాడకం .
అమాయకపు పారవశ్యం, దాని రంగు మారింది,
విషంతో మిళితమై.
మెదళ్ళు చచ్చుబడ్డాయి;తలలు వాచిపోయాయి;
ఇక ఆశ్చర్యకర ప్రతీకలా, నాలికలు వేలాడాయి;
నోటినుండి .
బొట్లు బొట్లుగా  పురుగుమందు  రాలుతూ :
కాళ్ళు చేతులు మెలికలు తిరిగిపోయాయి,
ఇక కళ్ళు ,వాటి చూపు  మాడిపోయింది .
ప్లాంటేషన్ వూర్లు మిగిలాయి
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారులా.
రాబందులు ఆకాశంలో తచ్చాడుతూ;
శవప పేటికలు తయారు చేసేవారు గొప్ప ధనవంతులవుతూ;
బొమ్మల్ని,ఉయ్యాలల్నిఎప్పటికీ తీరని శోకంలో అట్టిపెడుతూ.
చిమ్మ చీకటి; కాంతి రేఖలు ఇక ఎప్పటికీ  ప్రసరించవు.
చుక్కలుగా చావు రాలుతూ: గొడుగు ఎక్కడ?
(భారత దేశంలోని కేరళ ప్రాంతంలో ప్లాంటేషన్  గ్రామాల్లో ఎండో సల్ఫాన్  రసాయన క్రిమి సంహారకం   వాడకంవల్ల భాదితులైన వారి జ్ఞాపకార్ధం)
(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)


పత్రికల్లో కధనాల్ని మించిన కధనాలు;(పంక్తి-1) అవును ఏ దుర్ఘటన జరిగినా పత్రికల్లో వెనువెంటనే కధనాలు వెల్లువెత్తుతాయి కాని సానుభూ తప్ప మరేమీ మిగలట్లేదని బాధితుల గోడు. ఇది పర్యావరణ అంశంలో మరీ ఎక్కువ .కారణం ప్రకృతిలో ప్రే(భక్షించబడేది)) ప్రిడేటర్(భక్షకుడు) సంబంధం మానవ సమాజం లోనూ వుంది. ముఖ్యంగా పర్యావరణ విధ్వంసం జరగడానికి కారణం ఇది అని సాంకేతిక సమాచారం తో నే రుజువు చేయాలి. ముఖ్యంగా మృత్యువుని.
అసంఖ్యాక మృతదేహాలు.
ప్లాంటేషన్స్ లో ,పైశాచిక మైన  ఎండో సల్ఫాన్ వాడకం .(పంక్తులు 4-5) ఇది ఎండో సల్ఫాన్ వల్లే జరిగిందని ఘోషించే పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు, బాధితుల ఘోషని కొట్టి పారేస్తూ రాజకీయ నాయకులు, ఇతరులు మరో వైపు. ఇప్పటికి ఇది ఎండోసల్ఫాన్ వల్లే జరిగిందన్న వాదనని రుజువు చేయండి అని వాగ్వివాదం కొనసాగుతూనే వుంది. ఈ లోపల
అమాయకపు పారవశ్యం, దాని రంగు మారింది,
విషంతో కలిసి.(పంక్తులు-6-7) అవును అమాయక బతుకు బుగ్గి పాలవుతుంది.
కేసరగోడ స్ధానిక నోడల్ వైద్య అధికారి మాటల్లో ఎండో సల్ఫాన్  బాధీతులతో బాటు ఇతర వ్యాధులకు అందుతున్న సహాయం ఎంతమందికి అంటే? 300  మందికి అని సమాధానం . మొదటి సారి బాధితుల కోసం వైద్య శిబిరం నిర్వహించి నప్పుడు పచ్చ కామెర్లు, డిప్రషన్, వినికిడి కోల్పోవడం, ఎపిలెప్సి, అంగ వైకల్యులు, వంటి వారందరికీ నష్టపరిహారం లభిస్తోంది. పెద్ద మొత్తంలో 5 లక్షల పారితోషకం, నెలకి 1700 సామాజిక భద్రత కింద సుమారు  4000 మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇదంతా అమాయకత్వ రంగు మార్చడం. ఎందుకంటే అసలు రహస్యం బయటకి రానీకుండా తగు జాగ్రత్త చర్యలు. ఈ వైనం చూస్తుంటే  ఇబ్సన్ నాటకం ఎనిమి ఆఫ్ ద పీపుల్ 1882 లో రాసిన నాటకం. అది ఎప్పటికీ  సజీవంగా  రాజకీయ సమాజంలో ప్రదర్శన కొనసాగుతూనే వుంటుంది.  ఎటొచ్చి విష పదార్ధాలు మారుతాయి.
కవి ఫబియాస్ ఎం. వి. లోతైన అంశాల్ని చాల సునాయాసంగా చెప్పాడు. అంతే కాక ప్రతీకల్ని వినూత్న విధంగా ప్రయోగించాడు.
ప్లాంటేషన్ వూర్లు మిగిలాయి
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారులా. (పంక్తులు 14-15).అవును అభివృద్ధిలో వూర్లు నిజంగానే ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారులా కనబడుతున్నాయి. అభివృద్ధి ఛోదకులకు ఎన్ని హెచ్చరికలు చెప్పినా  ప్రమాదానికి బాధితురాలవుతున్నది గ్రామాలే. ఇక్కడ కారుని, గ్రామాన్ని పోల్చిన తీరు చాల విన్నూతంగా వుంది. ఎప్పుడో గుల్జార్ అన్న మాటల్ని ఇక్కడ నెమరేసుకోవాలి. మనం ఇప్పటికి ఆధునికంగా రాస్తున్నాం అనుకుంటున్నాం ,కాని మనం ఎక్కువగా వాడే ప్రతీకలన్నీ  ఒక గ్రామీణ నోస్టాల్జిక్  చిత్రాలే. నగరవాసులనుకుంటాం కాని ఆ చిత్రాలు మనం ఇంకా చిత్రించడం లేదు.  అవును ఇది ముమ్మాటికి నిజం, కాని ఫబియాస్ పరిధిని దాటి ప్రతీకల్ని చిత్రించిన తీరు అమోఘం. కారుని ఒక సామాజిక స్ధాయి, హోదాగా వాడుకుంటూ వచ్చామే తప్ప కారు అభివృద్ధి వేగం ఆ వేగం దాని జీవిత కాలం తక్కువ , అది నుజ్జునుజ్జవుతూ దారిని కూడా ప్రమాదకరంగా మారుస్తోంది అని సులువుగా, క్లుప్తంగా చెప్పాడు. ఇది ముఖ్యంగా పర్యావరణ అంశం కవిత్వంలో కావల్సిన శైలి.
ముగింపు లో లాభానష్టాలు పొందే వారు , (పంక్తులు16-17) నుండి సునిశితను చాల మృదువుగా చెపుతూ గుండెల్లో తడిని, నిశబ్దంగా రోదిస్తున్నాం అని చెంపల మీద కన్నీటి చారల మరక ద్వారా గుర్తించినట్టు రాసేనైపుణంతో బాటు  ఆధునికతకు కావాల్సిన హస్తకళ .
బహుశా ఒక కాలంలో కేసరగోడ గ్రామస్తులు ఆకాశం వైపు వర్షం  కోసం చూసే వారు ,కాని ఇప్పుడు
బొమ్మల్ని,ఉయ్యాలల్నిఎప్పటికీ తీరని శోకంలో అట్టిపెడుతూ.
చిమ్మ చీకటి; కాంతి రేఖలు ఇక ఎప్పటికీ  ప్రసరించవు.(పంక్తులు18-19)
ఇప్పుడు ఆకాశం వారికి బతుకు గొడుగు కాదు
 చుక్కలుగా చావు రాలుతూ: గొడుగు ఎక్కడ?(పంక్తి 20)
ఏప్రెల్ 14,2015, ది హిందు పత్రిక న్యూస్స్ రిపోర్ట్ అనుసారం స్ధానిక జిల్లా ఇన్చార్జ్, కేరళ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కే.పి. మోహనన్ త్వరలో ములియార్ గ్రామంలో ఎండోసల్ఫాన్  బాధితులకు నిర్వాసిత గ్రామం నిర్మిస్తున్నాం అని ప్రకటించారు. వివిధ అర్కిటేక్ట్స్, ప్రభుత్వ వ్యవస్ధలతో కూడిన కోఆర్డినేషన్ కమిటితో వర్క్ షాప్ ఏర్పాటుచేస్తారు. అంతేకాక  ప్రపంచ ఆరోగ్య సంస్ధ దీనికి సహాయ సహకారాలు అందిస్తుంది.
ఏప్రెల్ 17,2015, ది హిందు పత్రిక న్యూస్స్ రిపోర్ట్ అనుసారం  ఎండో సల్ఫాన్ విరోధ పోరాట సమితి గత నాల్గు నెలలు గా రూ. 1800 బకాయిలున్న స్టయి ఫండ్ వెంటనే చెల్లించాలని, నెలవారిగా వచ్చే రూ. 3000 స్టయి ఫండ్ 3,295 బాధితుల్లో 2,602 మందికి అందలేదని . రూ. 3000 ఇచ్చే స్టయి ఫండ్లో రూ. 1800 లని రెవెన్యూ శాఖ, మిగతా రూ. 1200 లని ఆరోగ్య శాఖ ఇవ్వాలని వుంది. దీనితో బాటు ఉచిత బస్ పాస్లు సరిగా అందటం లేదని అందుకు వారు ఏప్రెల్ 27 న నిరసన ప్రకటిస్తామని ప్రకటించారు.
అవును క్రమేణా బాధ, వ్యధ స్వరూపాలు మారిపోతాయి,
చుక్కలుగా చావు రాలుతూ: గొడుగు ఎక్కడ?(పంక్తి 20)

ఇదంతా కధ ముందు, జరిగేటప్పుడు, తర్వాత వున్న ప్లుటోనిక్ (విస్ఫోటన) పర్యావరణీయం.

0 comments:

Post a Comment