Sunday 26 April 2020 By: satyasrinivasg

ప్రకృతి, సంస్కృతి వలయాలు



శాస్త్రవేత్తల  ప్రకారం  మనమిప్పుడు ఆంత్ర ఫోసిన్  కాలం లో వున్నాం. ఇది 1950 లో మొదలైయింది, అంటే మానవాళి కృత్యాలు వాతావరణం, పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అణుధార్మిక శక్తి, ప్లాస్టిక్ వల్ల కాలుష్యం, శక్తి( బొగ్గు, వగైరా ) కేంద్రాలనుండి ఉత్పత్తి అయ్యే కాలుష్యం,  విచక్షణా రహితంగా విసర్జించిన కోళ్ల ఎముకల వల్ల ఏర్పడింది. 12000 సంవత్సరాల క్రితం నుండి నిలకడగా (మంచు యుగం ) గా వున్న వాతావరణం లో మార్పులు ఏర్పడ్డాయి. నేడు ఈ మానవ నిర్మిత వాతావరణం లో ఒక ఎపిడెమిక్ విస్ఫోటించి , మెల్లి మెల్లిగా  పరివ్యాప్తి చెందే వేగాన్ని, కాలాన్ని, ఆవరణని పెంచుకుంటూ పోతుంది... దీని వల్ల పలు చోట్ల  సంఘటనలు పెరుగుతూపోతాయి... అన్ని సంఘటనల కధ వెనక వున్నది కరోన, దాని రూపాలు వేరు.. ఇది,  ది   డీప్ సీ అండ్ ధ డెవిల్...
 ప్రకృతి వైపరిత్యాలు కూడా ఒకే రూపంలో ప్రస్పుటం అవ్వవు,ప్రకృతి లో ప్రతిది ఒకదానితో మరొకటి ముడిపడి వుంది, ‘నీరు పల్లమెరుగు  ఎరుగు, నిజము భగవంతుడికి తెలుసు  లా... . సంఘటనలు జరిగితే వాటి ప్రభావం అంతటా వుంటుంది. అది సామాజికంగా, ప్రకృతి పరంగాను,(ప్రభావ వత్యాసాలు వేరు) ఇదే బయోసోషియల్ స్ఫియర్! విపత్తులప్పుడు బయోసోసిషిల్, ప్రకృతి, లో  వుండే కంటిగ్యుటి(పర్సపరం ఇమిడివున్న జీవావరణం)లో  మార్పులు చాలా వుదృతంగా రియాక్ట్ అవుతాయి.  విపత్తుల కాలంలో మన మెదడులో కూడా చలనం, స్పందన  త్వరితంగా ఏర్పడుతుంది. కనీసం వివేకంగా ఆలోచించడం కూడా మర్చిపోతాం, మనకీ  కామన్ సెన్స్ కూడా తట్టదు.తొందరగా చేసేయాలి అన్న తాపత్రయంతో  స్పందిచేస్తాం! నేడు అదే జరుగుతోంది.దీనినే స్టిమ్యులస్ రెస్పాన్స్ స్టిమ్యులస్ అంటారు.
ఊహించండి ఒక్క సారిగా వివిధ తీరులలో మనుషులు ప్రవర్తిస్తోంటే వాళ్ళన్ని కట్టడి చేసే శక్తి ఎవరికి వుంటుంది?. అటువంటి సందర్భాల్లో ఒకే అంశాన్ని పట్టించుకుంటామా, లేక అన్నిట్ని పట్టించుకుని సవరించుకుంటూ పోతామా? ఇది ఏ పాలక వ్య్వస్దకి సాధ్యం?, కారణం మనం దిగువ  స్ధాయి వ్యవస్ధల్ని నిర్వీర్యం చేశాం, అది ప్రకృతిలోనూ, సమాజం లోనూ జరిగింది. గ్రామాల్లోని ప్రకృతి వనరుల్ని, పంచాయతీ వ్యవస్ధల్ని, ఇతరత్రా వ్యవస్ధల్ని చూస్తేనే అర్ధం అవుతుంది.
 పెద్ద ప్రాజెక్టుల అనుమతులు పై నుండే వస్తాయి, పంచాయతీల  తీర్మానాల్ని పట్టించుకోము, కారణం అక్కడి వనరుల పై అధికార  ఉల్లంఘన . ఇక వారి వనరులు వాళ్ళవి  కానప్పుడు వారి జీవనం వారిది ఎలా అవుతుంది, దీని వల్ల కూడా వలసలు అవ్వడం లేదా!  వలసల్ని అరికట్టడానికి చాలా పధాకాలు ప్రవేశ పెట్టాం, కానీ అరికట్ట లేక పోయాం.
నగరాల్ని కట్టడానికి మనుషులు  కావాలి, వాళ్ళని కూలీలు అనే అంటాం, వాళ్ళు నగర నిర్మాణకర్తలు కాదా! కేరళలో వలస వెళ్ళిన వాళ్ళు ఇతర దేశాల్లో ఇబ్బందులు పడి, తిరిగి రావడానికి, వారి క్షేమం కోసం , ఆయా పంచాయతీలు వాళ్ళ జాబితా చెయ్యాలన్న ప్రయత్నాలు జరిగాయి, అవి పుర్తి  స్ధాయిలో జరగలేదు . హైదరాబాద్ చుట్టుపక్కల ఇటుకల బట్టిలో పనిచేసే ఒడిస్సా వాళ్ళు   తీవ్ర పీడనకు, హింసకు గురవుతుంటే ఇటు వంటి చర్యలు  తాత్కాలికంగా చేపట్టి, ఆపేశారు. నగర వీధుల్లో ఉంటున్న వారికి (హోం లెస్) వారికి షెల్టర్స్ కి కేంద్ర  ప్రభుత్వం  నిదులున్నపటికీ, వాట్ని సరిగ్గా వుపయోగించలేదు. కాని ట్రంప్ వచ్చినప్పుడు మాత్రం బస్తిలను ఖాళి చేయిస్తాం. ఇప్పుడు వాళ్ళ పైన బాధ్యత చూపిస్త్తాం. మరి ఈ ద్వంద వైఖరి ఎందుకు? అసలు మన చుట్టూ ఎవరున్నారో మనకే తెలియదు. కరోనా పుణ్యమా  అని  ఎవరు, ఎక్కడ, ఎంతమంది వున్నారు అన్నది బయటకు వస్తోంది. మరి యూరోప్ లో ఇమ్మిగ్రెంట్స్, పాలెస్తీనియన్ల్ పరిస్ధితి ఏంటి?.
డార్క్ ఇకాలజి ప్రస్తావించేదల్లా... మనకు కనిపించేదల్లా...అపరిచిత మైనది. ఇకోజ్ఞాసిస్ ప్రకారం,  దానికి(ప్రకృతి) తెల్సినది మనం తెల్సుకోవడం, ఇది ఒక చిక్కు ప్రశ్న, పర్యావరణ అవగాహన అన్నది ఒక ఉచ్చుల తో అల్లుకున్న వలయం , జీవారణ, జీవవ్యవస్ధలు  కూడా అంతే,మానవ ప్రమేయం కూడా ఒక ఉచ్చు రూపం లో వుంటుంది.!  ఈ ఉచ్చుల్ని ఛేదించాలంటే ప్రపంచంలో మన ‘జీవ’ ఆవరణ ఎపిసోడ్స్ అర్ధం అవ్వాలి ...
ఎపిసోడ్ -1
ఒక్క క్షణంలో 50 ఆలోచనలు వస్తాయట
ఒక నిమిషానికి  3000
గంటకి 180000, రోజుకి   4320000, 20 రోజులకి 86400000….
ప్చ్..
ఒక్క ఆలోచన కూడా  నిలకడగా వుండదు ,
అసలు ఎటువంటి ఆలోచనలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు
తిరుగుతునప్పుడు ,పని చేస్కుంటున్నప్పుడు,కదలకుండా ఒకే చోట కూర్చునప్పుడు వచ్చేవి వేరు
శరీరం కదలకుండా వున్నా, మెదడులోని ఆలోచనలకి నిలకడలేదు
అంతటా ... నేడు
ఒకే ఒక ఆలోచన
చావు నుండి బయటకు రావాలి ,
అందుకు మార్గం ఒక్కటే
ఇంట్లోనే కూర్చోవాలి...
కాని ఇంట్లోనే 21   రోజులు కూర్చోవడం ఎలా?
అదే ఒక భయపెట్టే ఆలోచన...
ఇదే యూనివర్సల్ పిక్చర్  స్టోరీ లైన్
అందరి  విలన్ కరోనా.  దాని రూపాలు వేరు,  వివిధ రీతుల్లో ప్రబలుతోంది.

 ఎపిసోడ్ -2
అభ్ క్యా కర్నా !
ఛలో ఎవరు ఏంటి అన్న క్యారెక్టర్స్ మ్యాప్ ని చూద్దాం ...
 సహజంగా వైరస్  సోకిన వాళ్ళు, సామాజికంగా సోకినవాళ్ళు, తనతో బాటు అందరికి సోకించాలనుండే –వైల్డ్ ఫైర్స్ లాంటి వాళ్ళు, ఇదే అదను అనుకుని లాభాలు చేస్కునే వ్యాపారులు, రోజుకూలి దొరక్క అలమంటించే వాళ్ళు, ఇంట్లో వుండి ఆన్ లైన్ లో చదువుకునే విద్యార్ధులు, చెత్త ఎత్తుకునే వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, ఇళ్ళు లేక   రోడ్ల పైన నివసించే వారు, పూజారులు, ఏది వచ్చినా రాకపోయినా మారని తమ  విధుల్ని నిర్వర్తించే మహిళలు, ముసలి వాళ్ళు, పిల్లలు, విధి నిర్వహణలో నిమగ్నమైన డాక్టర్లు, పోలీసులు, పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు. వగైరా, వగైరా...
నాకేమవుతుంది, దీని నుండి ఎలా బయట పడాలి, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనుకునే వాళ్ళు.
వ్యక్తులు, కుటుంభాలు, సమూహాలు, ఊర్లు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం అంతా ఎప్పుడు వైరస్ పోతుంది అన్న ఆందోళనలో!.
గది గడప నుండి  ప్రపంచ తలుపులన్నీ మూసి వేసి వున్నాయి. నిర్మానుష్యమైన వీధులు...  ఆలోచనలు ఒక్కటే తెరచుకుని వున్నాయి.
ఎపిసోడ్ --3
ఇంట్లో టి.వి.,మొబైల్  సవ్యంగా,సమయానుసారంగా పనిచేస్తున్నాయి. అప్పుడే ఒక హౌస్ సర్జన్  విధులు ముగించి ఇంటికి వచ్చింది, ఇంట్లోకి అడుగిడగానే , మీరు ‘వెంటనే  ఇల్లు ఖాళి చేయాలి ‘ అని ఇంటి యజమాని దారికి అడ్డంగా  నుంచున్నాడు.  ఎందుకు అని అడిగేతే ,కారణం చెప్పాల్సిన అవసరం లేదనట్టుగా చిరాకుగా మొహం పెట్టాడు. పట్టుబట్టి అడిగితే  ‘మీకు వైరస్ సోకుతుంది, మా జాగ్రత్తలో మేముండాలి, అందుకే’! . మొన్ననే కదా ,వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వైద్య సహాయం చేశాం అంది. అవేవీ ఇప్పుడు జ్ఞాపక్లం లేవన్నటు గా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అలోచనలో పడింది,  నిన్ననే మాకు చప్పట్లు కొట్టారు, ఇంతలోనే దూరంగా వుండమని తరిమేస్తున్నారు, అసలు ఏది వైరస్ , ఏది కాదు. ఇల్లు అద్దెకు తీసుకుంటునప్పుడు, వాళ్ళ ఇంట్లో ఎవరుంటున్నారు అన్న విషయం కంటే ఆ ఇంటి ల్యాండ్ వ్యాల్యూ చెప్పుకుంటూ వచ్చారు, దాని బట్టి ఇంటి అద్దె పెంచాడు. ఈ లొకాలిటి బాగా డెవెలప్ అయ్యిందట అందుకే అద్దెలు ఎక్కవ,  డెవెలప్మెంట్ని చూసి కాదు, కాలేజీకి దగ్గరగా ఉంటుందని చేరాం. బాగానే డెవెలపయ్యారు. ఇప్పటికీ తెలియదు వాళ్ళ  కుటుంబంలో ఎవరుంటున్నారన్నది. ఇప్పుడు అందర్నీ ఇంట్లో వుండమంటున్నారు, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా వుంటున్నారన్నది తెలియదు.
అసలు ఇల్లు ఏంటి, కుటుంబం ఏంటి, మనం ఎక్కడ వుంటున్నాం ! శారీకంగా వైరస్ సోకిన వార్ని ఇసోలేషన్ లో వుంచుతున్నాం , మరి ఇట్లాంటి వార్ని ఎక్కడ వుంచాలి?.
ఎపిసోడ్ --4
  ఈ సంఘటనని  1760 నాటి కాలంలో మరో విధంగా చూద్దాం!. ఈస్ట్ ఇండియా కంపెనీ(ముఖ్యంగా  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ) వాళ్ళు వ్యాపార దశ నుండి  మన దేశంలో సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని  (అప్పటికి  ఇంకా  భారత దేశం ఏర్పడలేదు)  నిలదోక్కు కోడానికి ముఖ్యంగా ఇక్కడి వాతావరణం పై వారు అవగాహన కల్పించుకున్నారు. మనకి వాతావరణం ఎంత స్నేహంగా  వుంటుందో , అంతే శత్రుత్వాన్నీ చూపిస్తుంది. ఇది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వుండే వాస్తవం.అందుకే  ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్ధానిక  జీవావరణ వ్యవస్ధల తీరుని, వాటినుండి వచ్చే రోగాల గురించి  విస్తృతంగా పరిశీలన చేశారు. స్ధానిక వైద్యుల  నుండి ఈ సమాచారం సేకరించి తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్కున్నారు, అలా వలసవాదం ఏర్పడింది దాని వల్ల వనరుల్ని కొల్లగోట్టుకోవడం మొదలైంది. ఈ పంధాలో వాళ్ళు మెడికల్ టోపోగ్రఫి(  భౌగోళిక ప్రదేశాలు  మానవుల ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపుతాయి అన్న దాని పై సమగ్రమైన అధ్యయనం.) మెడికల్ జియోగ్రఫి( స్ధానిక ఆవరణ, వాతావరణం వల్ల  ఆరోగ్యం పై ఏర్పడే  ప్రభావం, దీని ద్వారా ప్రజా ఆరోగ్య సంరక్షణకై తగు చర్యలు పై చేసే అద్యయనం).
1760  కాలంలో వాళ్ళ  వైద్య బృందాలలోని డాక్టర్లు వైద్యం ,జీవ శాస్త్రం అధ్యయనం చేసిన వారు, వాళ్ళు మొక్కలు, చెట్లు నాటడం, బొటానికల్ గార్డెన్స్ కి  పర్యవేక్షలుగా కూడా పనిచేసే వారు. అంటే వాళ్ళు ఏర్పరుచుకునే  సామ్రాజ్యంలో  మొదటి శత్రువు, మిత్రువు అక్కడి వాతావరణం , స్ధానిక ప్రజలు తర్వాత సంగతి.  ఇదే విషయాన్ని చార్ల్స్ డార్విన్ ధ డిసేంట్ అఫ్ మ్యాన్ (1871) లో ప్రస్తావించాడు, ‘నాగరిక సమాజలు , అనాగరిక సమాజలతో తలపడినప్పుడు, పోరాటం చాలా తక్కువ నిడివిలో  ముగుస్తుంది, కాని భీకర మైన వాతావరణం స్ధానికులకు సహకరించినప్పుడు కాదు’. కారణం ఇట్ ఇస్ ‘ఇకోజ్ఞాసిస్”
ఇప్పటికి మన వాళ్ళు బాగా ఎండగా వునప్పుడు, చలిగా వున్నపుడు బయటికి వెళుతుంటే జాగ్రత్తగా   వుండే సూచనలిస్త్తాం! వైద్యం అన్నది కేవలం రోగ నివారణకు చేసే చికిత్స  కాదు, మన ప్రకృతి, వ్యక్తిగత,సామాజిక మానసిక  నడవడకి తీరుతెన్నులని గ్రహించి, అంచనా వేస్కుని,  ఆయా ప్రాంత పర్యావరణానికి మన జీవనాన్ని మల్చుకునే ప్రక్రియ! మరి ప్రకృతి, వ్యక్తిగత,సామాజిక మానసిక  నడవడకని మార్చే  తీరుకి వైద్యులు ఒక్కరే, ఒకే వ్యవస్దే దోహదం చెయ్యదు  కదా! ప్రకృతి ని సమాజాన్ని అర్ధం చేస్కోవాలంటే అన్ని కిటికీలు తెరవాలి, ఒక్క కిటికీ తెర్చి చుస్తే సరిపోదు!
నేడు ప్రపంచలో దరిదాపు అన్ని దేశాల్ని ఏక కాలంలో ముట్టడించిన కరోనాకీ  వైద్యం ఏంటి, వైద్యులు, ఎవరు, రోగులు ఎవరు, నా దృష్టిలో అందరం అన్నీను!  మనం , నాగరికత పేర్న   సృష్టించుకున్నది బయోసోషల్  డిస్టెన్స్. ప్రకృతి నుండి భౌతిక సామాజికంగా విడిపోవడం, కులం ,మతం, జాతి ,తెగ అన్నవి కూడా మినహాహింపు కావు, సోషియో బయో డిస్టేన్సులు, మన సమాజంలోని కుల వర్గీకరణ పెర్న వనరుల ఆధిపత్యానికి దోహదపడ్డాయి  , వీటి గురించి మున్ముందు చర్చిద్దాం.

ఎపిసోడ్ --5
 ఈ మధ్యన మిత్రుడు కోడూరి విజయ్ కుమార్ అనువదించిన చైనీస్ కవిత  ఇక్కడ ప్రస్తావిస్తాను, నేటి పరిస్దితులని  అనుభవ పూర్వకంగా ,అవేదనలని చాలా  సులభ తీరులో వ్యక్తపరచిన కవిత,...... అంతే నేటివిటితో  అనువందించాడు కోడూరి విజయ్.
దయచేసి విసిగించకండి
దయచేసి నా రక్షణ వస్త్రాలను,
మాస్క్ నూ తీసివేయనీయండి
ఈ రక్షణ కవచాన్ని తొలగించి
నా మాంస దేహాన్ని విడుదల చేసుకోనీయండి
నా ఆరోగ్యం బాగుందని నన్ను నమ్మనివ్వండి
ప్రశాంతంగా నన్ను ఊపిరి తీసుకోనివ్వండి
ఓహ్ -
నినాదాలు, ప్రశంసలు, ప్రచారాలు
ఆదర్శ సేవకులు ... అన్నీ మీరు సృష్టించినవే
వైద్య వృత్తికి వుండవలసిన మనస్సాక్షితో
నేను నా విధులు మాత్రమే నిర్వర్తిస్తున్నాను
జీవితానికీ మరణానికీ నడుమ ఏదో వొకటి
నిర్ణయించుకునే అవకాశం లేకుండా
గంభీరమైన ఆదర్శాలు ఏవీ లేకుండా
తరచుగా యుద్ధ భూమికి గుండెల నిండా
ఊపిరి తీసుకుని మాత్రమే వెళ్ళవలసి వుంటుంది
దయచేసి నన్ను పూల దండలతో అలంకరించకండి
దయచేసి నన్ను ప్రశంసలతో ముంచెత్తకండి
విధి నిర్వహణలో తగిలే గాయాల తోనో, అమరత్వంతోనో
దయచేసి నాకు గుర్తింపునివ్వకండి
చెర్రీ పండ్ల రుచి కోసమో,
ప్రకృతి రమణీయ దృశ్యాల కోసమో
మైమరపించే ఆహ్వానాల కోసమో
నేను ఈ వూహాన్ నగరానికి రాలేదు
ఈ అంటువ్యాధి అంతరించాక
వొట్టి ఎముకల గూడులా నేను మిగిలినా సరే
నా పిల్లల కోసం నా తలిదండ్రుల కోసం
నేను సురక్షితంగా నా ఇల్లు చేరాలి
మీరే చెప్పండి
సహచరుల చితా భస్మాన్ని అందుకోవాలని
ఏ కుటుంబానికి మాత్రం వుంటుంది?
రోడ్డుపై అడుగు పెట్టగానే మీదపడి
ప్రశ్నలతో వేధించే మీడియా మిత్రులారా
దయచేసి నన్ను మళ్ళీ విసిగించకండి
మీరు అడిగే వాస్తవ సంఖ్యలూ, సమాచారమూ
దేని మీదా ఆసక్తి లేదు నాకిపుడు
రాత్రీ పగలూ విసిగిపోయి వున్నాను
కంటి నిండా నిద్ర, కరువు తీరా విశ్రాంతి
మీ ప్రశంసల కన్నా విలువైనవి ఇపుడు
మీకు చేతనైతే ఖాళీ ఐపోయిన
ఆ ఇళ్లకు వెళ్లి చూడండి
ఏ వంటింటి నుండైనా పొగ వొస్తోందా?
శ్మశాన వాటికల చుట్టూ భ్రమిస్తోన్న
సెల్ ఫోన్లను వాకబు చేయండి
వాటి యజమానులు దొరికారేమోనని
 ( వీ షుయిన్ - చైనా కవిత,తెలుగు: కోడూరి విజయకుమార్)
చివరి పంక్తులు చదువుతుంటే  నాకు వ్యాధిగ్రస్తులతో బాటు , వైద్యం చేసే  వారు ఆలోచనల్లో  మెదులుతున్నారు, ఆ  ఆలోచన పుట్టలో నుండి మొలకెత్తిన పేరు, డా. ద్వారకానాథ్ కొట్నిస్. కొట్నిస్ 1938 లో జపాన్ – చైనా మధ్యన యుద్దమప్పుడు సుబాష్ చంద్ర బోస్ పిలుపు మేరకు   సహాయ సేవలందించడానికి స్వచ్చందంగా  వెళ్ళాడు. మన దేశం నుండి  వెళ్ళిన అయుదుగురి బృందంలో ఈయన ఒకరు, ఆయన వెళుతున్నపుడు చెల్లెలు పలికిన మాటలు  ‘కొట్ని స్ కి ప్రపంచమంతా తిరిగి వైద్య సేవలు అందించాలన్న కోరిక, మాకు చైనా గురించి ఎక్కువ గా తెలిసింది లేదు, తెలిసిందల్లా , వాళ్ళు ఇక్కడ చైనా సిల్క్ వస్త్రాలు అమ్ముతారు’. తల్లి చాలా ఆందోళన పడింది, దూర ప్రాంతంలో ని యుద్ధ భూమికి వెళుతున్నాడని. తండ్రి నిబ్బరమైన గుండెతో పంపించాడు.
 ఆతను మొదటి గా చైనాలో వుహాన్ నగరంలో అడుగుపెట్టాడు, యుద్ద భూమిలో క్షతగాత్రులకు చాల సేవ చేశాడు. 1940లో గుయో క్విన్ చియాన్ అనే నర్సుని కలిశాడు , ఇద్దరు ప్రేమ వివాహం చేస్కున్నారు, 1942  లో ఒక మగ  పిల్లడు పుట్టాడు, ఆ పిల్లాడి పేరు,హిం  హువా అంటే (హిం అంటే ఇండియా, హువా అంటే చైనా). 9 డిసెంబర్   1942 లో ఆయన ఎపిలెప్సి వల్ల మరణించాడు. నాన్ క్యువాన్  వూర్లో యుద్ధ వీరుల సమాధుల పక్కనే అయన సమాధి చేశారు. అప్పుడు మావో అన్న మాటలు, ‘సైన్యం ఒక సహాయ హస్తాన్ని కోల్పోయింది, దేశం ఒక మిత్రుడ్ని కోల్పోయింది, మనమందరం  మానవాళికి సేవలందించాలన్న  అతని ఆశయాన్ని ఎప్పటికీ మరవద్దు”  2005 ఏప్రిల్ లో డా. నోర్యాన్ బెతూన్, కొట్నిస్ సమాధులని చైనా ప్రజలిచ్చిన పుష్ప గుచ్చాలతో అలకరించారు ఆ రోజు కిన్గ మింగ్ పండుగ అంటే  వాళ్ళ  పూర్వికులను తల్చుకునే రోజు. మనం మటుకు అతనిని ఎప్పుడో మర్చిపోయాం. ఆయనని చైనా వాళ్ళు ‘కే దేహువ’ అని పిలిచేవారు.
నేటి ఆంత్రఫోసీన్ సంస్కృతిలో  మనని మనం ,చట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకపోవడం  సర్వసాదారణం.. అంతా...
శ్మశాన వాటికల చుట్టూ భ్రమిస్తోన్న
సెల్ ఫోన్ల వాకబు ...
అవును మనం అధునాతన ప్రపంచంలో పుటుక , పెళ్ళిళ్ళు . పూజలు పునస్కరాలు, చావు   స్మశాన వాటికలలో(మహా: ప్రస్తానం)  అన్నింటిలో  మన సంభాషణ , అన్నీ సెల్ ఫోన్ల ద్వారానే కారణం మన సెల్ల్స్ మారిపోయాయి, అరచేతిలోని కొత్త సెల్ వలయంలో అల్లుకున్న రేఖలం.

0 comments:

Post a Comment